అదరగొడుతున్న ఐటీ , భారీగా ఉపాధి అవకాశాలు _ ఈ ఏడాదిలో 11 వేల మందికి జాబ్స్
రూ.3 వేల కోట్లు దాటిన టర్నోవర్
25 శాతం పెరిగిన వేతన ప్యాకేజీలు
ఐటీ రంగం పుంజుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మల్టీ నేషనల్ కంపెనీలు తమ పంథా మార్చుకుంటున్నాయి. గతంలో తమ సంస్థల్లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలో డిస్టింక్షన్ ఉండాలని, బ్యాక్లాగ్లు ఉండకూడదనే నిబంధనలను పెట్టేవి. అయితే, ఇప్పుడు నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో క్యాంపస్ రిక్రూమెంట్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రతి ఏటా ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతం, గాయత్రి, అనిట్స్, విజ్ఞాన్, రఘు తదితర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐదు వేల మంది వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందేవారు. ఇప్పుడు వీరి సంఖ్య 6,500 దాటింది. మల్టీనేషనల్ కంపెనీలైన అమెజాన్, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో, మైండ్ ట్రీ, వర్చ్యూష తదితర కంపెనీలకు 3,500 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ ఒక్క విశాఖపట్నంలోనే 40 మందికిపైగా ఎంపిక చేసి ఒక్కొక్కరికీ రూ.20 లక్షల నుంచి రూ.22 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది.
ఏడు నెలల్లో 11 వేల మంది :
ఏపీ ఐటీ రంగంలో 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది 2021 జనవరి నుంచి జూలై వరకు 11 వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఐటీ టర్నోవర్ రూ.2,500 కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.3 వేల కోట్లు దాటేసింది. మార్చి, 2022 నాటికి వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. విశాఖపట్నం, విజయవాడల్లో ఇన్సూరెన్స్, హెల్త్కేర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రిటైల్ రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. కోర్ ఐటీలో డాట్నెట్, జావా, పైథాన్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. పెద్ద కంపెనీలు నిబంధనలు సడలించుకొని భారీ సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్యాకేజీలను కూడా పెంచాయి. ప్రారంభంలోనే రూ.4 లక్షలకు తక్కువ లేకుండా ఆఫర్ చేస్తున్నాయి. ఆఫర్ లెటర్ ఇచ్చిన వెంటనే కొందరికి ల్యాప్టా్పలు, ఎక్కువ మందికి డెస్క్టా్పలు, ఫర్నిచర్ కూడా ఇస్తున్నాయి. ఇంతకు ముందు దూరప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడక, విశాఖ, విజయవాడల్లోనే ఉండాలనుకునే అమ్మాయిలు ఇపుడు ఇంటి నుంచే పెద్ద కంపెనీలకు పనిచేస్తున్నారు. వేతన ప్యాకేజీలు 25 శాతం వరకు పెరిగాయి.
అన్నీ పెరిగాయి.. శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం :
ఐటీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో నైపుణ్యం పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రొగ్రామ్(ఐఎ్సటీపీ) నిర్వహించి, 1000 మందికి రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం.
- శ్రీధర్ కొసరాజు, అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ అసోసియేషన్
రిక్రూట్మెంట్ బాగా పెరిగింది :
కరోనా సమయంలోనూ ఐటీ రంగం పుంజుకుంది. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం నుంచి ఏటా 2,500 మందికి ఐటీ ఉద్యోగాలు లభించేవి. కరోనా ప్రభావం చూపిన 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో ఈ సంఖ్య మూడు వేలు దాటింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ పది మందిని రూ.20 లక్షల ప్యాకేజీతో తీసుకుంది.
- ప్రొఫెసర్ శివరామకృష్ణ, వీసీ, గీతం
0 Comments