GET MORE DETAILS

సీపీఎస్‌ రద్దు చేస్తే దానికే బడ్జెట్‌ సరిపోదు..

 సీపీఎస్‌ రద్దు చేస్తే దానికే బడ్జెట్‌ సరిపోదు..



14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినా ఐఆర్‌ కంటే ఏమీ తగ్గదు..

సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఇబ్బంది..

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..


‘సీపీఎస్‌ రద్దు చేస్తే దానికి మొత్తం బడ్జెట్‌ సరిపోదని లెక్కలు చెబుతున్నాయి’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘ఉద్యోగులు పదవీవిరమణ చేశాక వారికి భద్రత ఎలాగని ఆలోచించే ప్రతిపక్ష నేతగా జగన్‌ సీపీఎస్‌ రద్దుపై హామీ ఇచ్చారే తప్ప.. అది ఎన్నికల జిమ్మిక్కు కాదు. అందులోని సాంకేతిక అంశాలు అప్పుడు మాకూ తెలియవు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని చూసి సీపీఎస్‌ రద్దుపై తర్జనభర్జన, ఎలా చేయాలనే ఆలోచన మొదలైంది. సీపీఎస్‌ను రద్దు చేస్తే రిటైరయ్యాక ఉద్యోగులకు భద్రత వస్తుంది కానీ, దాని మూల్యమెంత? అయినా ఉద్యోగులసంక్షేమాన్ని చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్న సానుకూల దృక్పథం సీఎం జగన్‌కు ఉంది కాబట్టే అప్పుడు ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలను నిలబెట్టుకునేందుకు వస్తున్న ఇబ్బందులను అధిగమించే ప్రయ త్నం చేస్తున్నారు’ అని తెలిపారు. మంగళవారం ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో విడివిడిగా చర్చించారు. ప్రభుత్వ పరిస్థితిని వారికి వివరించి, ఉద్యోగుల డిమాండ్లపై పరిష్కారానికి వారి నుంచి ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. సమావేశానికి ముందు సజ్జల విలేకర్లతో మాట్లాడారు.*

క్రమబద్ధీకరణకు అదే ఆటంకం..

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సజ్జల స్పందిస్తూ.. ‘సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది సీఎం జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ. అది చట్టబద్ధంగా చేయాలనేది కాదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో గతంలో ఊహించనిది సుప్రీంకోర్టు తీర్పు. ఉద్యోగ నియామక ప్రకటనలో సమాన అవకాశం కల్పించి రెగ్యులర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అంటే తప్ప కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణను గుర్తించలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రధాన అడ్డంకిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఒకటి రెండు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే అది కొట్టేశారు. మనం చట్టాల పరిధిలో కోర్టు పరిశీలనలో నిలబడాలి. మినిమం టైం స్కేల్‌్ లాంటివి ఆలోచించాలి. పొరుగు సేవల ఉద్యోగులపై కాంట్రాక్టుసంస్థల దోపిడీని నియంత్రిస్తూ కార్పొరేషన్‌ ద్వారా జీతాలిస్తూ రక్షణ కల్పించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపాం. ఇప్పుడు ఉద్యోగులు చెబుతున్న 70 డిమాండ్లలో కొన్ని ఆర్థికాంశాలు కానివి ఉన్నాయి, అలాంటివి అధికారుల స్థాయిలోనే పరిష్కారమవుతాయి’ అని తెలిపారు.

14.29% ఇచ్చినా..

పీఆర్‌సీపై సజ్జల స్పందిస్తూ.. ‘14.29% ఫిట్‌మెంట్‌ ఇచ్చినా ఇప్పటికే ఇచ్చిన 27% ఐఆర్‌ కంటే రూపాయి కూడా తగ్గదు. ఇంకా పెరుగుతుంది. ఆ లెక్కన 45% ఫిట్‌మెంట్‌ అయితే ఎక్కడికి పోతుందో? రాష్ట్ర ఆదాయంలో మెజారిటీ దీనికే వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర పరిస్థితిని బట్టే అధికారుల కమిటీ సిఫార్సు చేసింది. ఉద్యోగులకు గరిష్ఠంగానే చేయాలని ముఖ్యమంత్రి చూస్తారు. అధికారుల కమిటీ సిఫార్సు కంటే ఆయన ఎక్కువ ఇస్తే అది అదనం అవుతుంది. నాలుగేళ్లకోసారి పీఆర్‌సీ ఉన్నా, అమలయ్యేసరికి ఆరేడేళ్లు అవుతోంది. అయితే కేంద్ర పీఆర్సీ తరహాలో పదేళ్లకోసారి పెడితే, కేంద్రంతో పాటే రాష్ట్రంలోనూ ఆటోమేటిక్‌గా పీఆర్‌సీ అమల్లోకి వస్తుంది. దాన్ని ఆలోచించే అధికారుల కమిటీ నివేదించింది’ అని వ్యాఖ్యానించారు.

Post a Comment

0 Comments