ఒమిక్రాన్లో డెల్టా కంటే రెట్టింపు మ్యుటేషన్లు..! _ ప్రజలు అలసత్వం వహించవద్దని హెచ్చరించిన కేంద్రం.
దేశంలో సెకండ్ వేవ్ సృష్టించిన విలయం కారణంగా వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితికి ప్రమాదకర డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. ఇదే సమయంలో ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్లో డెల్టా రకం కంటే రెట్టింపు మ్యుటేషన్లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా సంక్రమణ ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
‘ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్కు సంబంధించిన అన్ని కేసుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ తీవ్ర లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఒమిక్రాన్లో మొత్తం 45 నుంచి 52 మ్యుటేషన్లు జరిగితే.. అందులో 26 నుంచి 32 వరకు కేవలం స్పైక్ ప్రొటీన్లోనే చోటుచేసుకున్నాయి. ఇలాంటి మ్యుటేషన్లను ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా త్వరగా గుర్తించవచ్చు. అయితే, ఇతర వేరియంట్లతో పోలిస్తే కణానికి అతుక్కుపోయే సామర్థ్యం ఈ రకానికి ఎక్కువగా ఉంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందవద్దని.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో ఈ వేరియంట్పై చేపట్టిన విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
0 Comments