కేంద్ర వేతన సంఘానికి మారాలి : : పీఆర్సీపై ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ సిఫారసు
ఈనాడు-అమరావతి: కేంద్ర వేతన సంఘ సిఫార్సులను పలు రాష్ట్రాలు అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విధానాన్ని అనుసరించాలని పీఆర్సీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అంతర్దృష్టి, ఆర్థిక అంశాలతో కూడిన ఫిట్మెంట్, ఇతర ప్రయోజనాలను అందించేలా కేంద్ర వేతన సంఘం సిఫారసులు ఉంటున్నాయని అభిప్రాయపడింది. ఆ సిఫారసుల మేరకే రాష్ట్రంలోనూ ఉద్యోగుల వేతనాలను సవరించవచ్చని సూచించింది. తద్వారా రాష్ట్ర వేతన సవరణ సంఘాల ఏర్పాటును నిలిపేయవచ్చని పేర్కొంది. అలాగే పలు సిఫారసులు చేసింది.
మానవ వనరులను క్రమబద్దీకరించాలి
సమకాలీన అవసరాలకు అనుగుణంగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లోని మానవ వనరులను క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ‘అనవసరమైన కేడర్లు, పోస్టులను తొలగించడంతో పాటు, అవసరమైన చోటకు అదే కేడర్లో పనిచేస్తున్న వారిని పంపడం, సూపర్ న్యూమరీ పోస్టుల సృష్టికి సంబంధించిన ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖలు, శాఖాధిపతులు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల్లో ఒప్పంద సిబ్బంది నియామకాలకు సంబంధించి ప్రామాణిక విధానాలను తయారు చేయాలి. మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యాలకు అనుగుణంగా..పనితీరు, ఖర్చు, ప్రయోజనాలను అంచనా వేస్తూ ప్రస్తుతం ఉన్న కారుణ్య నియామకాల వ్యవస్థపై అధ్యయనం జరగాలి..’ అని సిఫారసు చేసింది.
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకూ వేతన స్కేల్
క్షేత్రస్థాయి పాలనలో కీలకమైన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపజేయాల్సిన అవసరం ఉందని కమిటీ సిఫారసు చేసింది. వీరి వేతన స్కేళ్లను క్రమబద్దీకరించడం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,800 కోట్ల మేర అదనంగా ఖర్చవుతుందని పేర్కొంది.
ఉద్యోగుల వారీగా వేతన స్కేళ్ల వివరాలు(రూ.ల్లో)
* పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 : కనిష్ఠం 15,030 - గరిష్ఠం 46,060
* గ్రేడ్ -4(డిజిటల్ అసిస్టెంట్), మహిళా పోలీస్, వ్యవసాయ(గ్రేడ్-2), ఉద్యాన, పట్టు, పశు సంవర్థక, మత్స్య సహాయకులు, ఏఎన్ఎం, ఇంజినీరింగ్ అసిస్టెంట్, విలేజి సర్వేయర్, వీఆర్వో, సంక్షేమ సహాయకుడు: కనిష్ఠం 14,600 - గరిష్ఠం 44,870
* వార్డు పరిపాలనా కార్యదర్శి : కనిష్ఠం 15,030 - గరిష్ఠం 46,060
* వార్డు సదుపాయాల కార్యదర్శి, విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి: కనిష్ఠం 14,600 - 44,870.
0 Comments