నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావచ్చు, భావోద్వేగంతో జెలెన్ స్కీ
ఉక్రెయిన్పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో పౌరులు, వేల సంఖ్యలో సైనికులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ తమకు సాధ్యమైనంత మేర తీవ్ర పయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ ఇప్పటికే వివిధ దేశాల నేతలతో యుద్దంపై మాట్లాడింది. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా చట్ట సభలోకి 300 మంది సభ్యులతో దాదాపు గంటపాటు వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ, రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలంటూ విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో తమ గగనతలాన్ని నో-ఫ్లై జోన్గా ప్రకటించాలని నాటోను మరోసారి అభ్యర్థించారు. రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కోరారు.
మరోవైపు, తమను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఆయన అన్నారు. తమ మాతృ భూమిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారని ప్రశంసించారు.
0 Comments