GET MORE DETAILS

మోక్ష మార్గ పథం సంక్రాంతి

మోక్ష మార్గ పథం సంక్రాంతి 



మనిషి కర్మలు చేయడం వల్ల అతనికి సుఖదుఃఖాలు లభిస్తాయి. ఈ సుఖదుఃఖాలను అనుభవించే స్థితికే భోగం అని పేరు. ఈ భోగ దశనే తాత్త్యికులు ''భోగి'' అని పిలిచారు. మనిషి భోగాలనుభవించే సమయమే "దక్షిణాయనం". ఎప్పుడైతే కర్మ ఫలాలను ఆశించకుండా పుణ్య కర్మలు చేస్తూ, భోగాలనుంచి విముక్తుడౌతాడో, అప్పుడే అతనికి ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుంది. దీన్నే ''ఉత్తరాయనం'' అని వేదవిదులు గుర్తించారు.

హిందువుల పండుగలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అవి కేవలం పాశ్చాత్యుల కాలమానం ప్రకారం వచ్చేవికావు. మన పండితులు హిందువుల పండుగలను నాలుగు విధాలుగా విభాగించారు.

మొదటి విధం:  మహాపురుషుల జన్మదినోత్సవాలను బట్టి చేసుకునేవి.

రెండవ విధం:  ఋతువులను బట్టి జరుపుకునేవి.

మూడవ విధం: శైవం, వైష్ణవం మొదలైన సంప్రదాయాలను బట్టి నిర్వహించేవి.

నాల్గవ విధం: జన్మ దినోత్సవాలను బట్టి, ఋతువులను బట్టి, సంప్రదాయాలను బట్టి జరుపుకునేవి కానట్టివి.

సంక్రాంతి రెండవ రకం పండుగ. ఋతువును బట్టి వచ్చే పండుగగా హిందువులు దీనిని భావిస్తారు. సాధారణంగా ఈ పండుగ మార్గశీర్షం లేదా పుష్య మాసంలో వస్తుంది. సూర్యుని సంచారాన్ని బట్టి ఏర్పడే పండుగగా పంచాంగ కర్తలు నిర్ధారించారు. సూర్యుడు ఆరు మాసాలు దక్షిణాయనంలో ఉండి తదుపరి ఉత్తరాయనానికి పోయే సందర్భంలో వచ్చే పండుగగా దీన్ని లెక్కించడం చాలాకాలం నుంచి వస్తున్న సంప్రదాయం.

ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు జరుపుకునే పండుగను భోగి అని, మూడవ రోజు కనుమ అని పిలుస్తారు. భోగి మరుసటి రోజు జరుపుకునే పండుగకే సంక్రాంతి అని పేరు.

నిజానికి సంవత్సరానికి పన్నెండు సార్లు సంక్రాంతి వస్తుంది. జ్యోతిశ్శాస్త్రంలో 12 నక్షత్ర రాశులను గుర్తించారు. ఒక్కొక్క మాసంలో సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉండడం చేత, దాన్ని ఆ మాసంలో ఆ నక్షత్రానికి సంబంధించిన సంక్రాంతిగా లెక్కిస్తారు. ఇట్టి సంక్రాంతులలో మకర సంక్రాంతి ముఖ్యమైనది. సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రమణం అని పిలుస్తాం. ధనూరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన దినమే సంక్రాంతి పర్వదినం.

సూర్యుడు దక్షిణ దిశలో ఆరు మాసాలు, ఉత్తర దిశలో ఆరు మాసాలు సంచరించడాన్ని అయనమని వ్యవహరిస్తారు. జ్యేష్ఠం నుండి కార్తికం దాకా ఆరు మాసాలు దక్షిణంలో ఉండడమే దక్షిణాయనం. మార్గశిరం నుండి వైశాఖం దాకా ఆరుమాసాలు ఉత్తర దిశలో ఉండడమే ఉత్తరాయనం. అయితే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోకి ప్రవేశించడం వల్లనే సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నామనేది మనకు సంప్రదాయంగా వస్తున్న ఆచారం. కాని దీనికి మరొక విశిష్టత ఉంది. దాన్ని తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఉత్తరాయనం కేవలం పుణ్యకాలాన్ని మాత్రమే సూచించేదికాదు, జీవన్ముక్తులు ఊర్ధ్వగతిలో చేరే దేవలోకాన్ని గుర్తు చేస్తుంది. మానవులు కేవలం దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోకి వెళ్లడం వల్ల జీవన్ముక్తులు కాజాలరు. కాలమే పుణ్యలోకాలనిస్తే, పాపాత్ములు కూడా మోక్షానికి అర్హులవుతారు. కాలానికి విముక్తులను చేసే శక్తిలేదు. పాపాల నుండి విముక్తులు చేసి పుణ్య లోకాలను ప్రసాదించగలిగిన శక్తి కేవలం పరమాత్మకు మాత్రమే ఉంది.

మనకు మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకొని, ఉత్తరాయన పుణ్యకాలం వచ్చిందాకా ఉన్నాడని తెలుస్తుంది. దక్షిణాయనంలో లేనిది ఉత్తరాయనంలో లభిస్తుందని దీన్ని బట్టి తెలుస్తుంది. పాపాత్ములు దక్షిణాయనంలో కాక, ఉత్తరాయనంలో మరణిస్తే మళ్లీ జన్మలేకుండా చేసుకోవచ్చుననే అభిప్రాయం కలుగుతుంది. కాని కాలానికి పాపపుణ్యాలకు సంబంధంలేదు. మనం చేసిన కర్మలే పాపపుణ్యాలను నిర్ణయిస్తాయి. నిజానికి పాపాలనుండి విముక్తుల్ని చేసి సుఖాన్ని ప్రసాదించే వాడు పరమాత్మనే. కేవలం సుఖాన్ని మాత్రమే కాదు. మోక్షప్రదాత కూడా అతడే. కనుకనే దక్షిణాయనంలో మరణిస్తే దుర్గతి పొందుతాడని, ఉత్తరాయణంలో మరణిస్తే సద్గతి పొందుతాడని చెప్పడం ఊహా మాత్రమేగాని సత్యం కాదు.

ఉత్తరాయనంలో దేవలోక ద్వారం తెరిచి ఉంటుందని, దక్షిణాయనంలో అది మూసుకొని ఉంటుందని భావించడం కూడా వట్టి భ్రమ మాత్రమే.

వేద ఋషులు సంవత్సరాన్ని రెండుగా విభజించి వాటికి దక్షిణాయనం, ఉత్తరాయణం అని పేర్లు పెట్టడంలో గొప్ప రహస్యం దాగి ఉన్నది. మనుష్య జీవనం భోగం (సుఖదుఖానుభవం)తో ముడిపడి ఉంది. పుణ్యకర్మలు చేస్తూ క్రమంగా నిష్కామ కర్మలవైపు మానవుడు సాగిపోవడం ఒక దశ. ప్రకృతి పురుష వివేకం (జ్ఞానం) సంపాదించడం మరొక దశ. మనుష్య జీవితంలో కర్మకెంత ప్రాధాన్యం ఉందో జ్ఞానానికి అంతే ప్రాధాన్యం ఉంది. "జ్ఞానాన్ముక్తిః'' అని సాంఖ్యదర్శనం చెప్తుంది.

"అవిద్యయామృత్యుం తీర్త్వా

విద్యయామృతమశ్నుతే"

ఇది యజుర్వేద వచనం. నిష్కామకర్మ చేత మృత్యువును జయించి, జ్ఞానం (విద్య) చేత అమృతం (మోక్షం) పొందమని వేదం ఉపదేశిస్తున్నది. మనిషి కర్మలు చేయడం వల్ల అతనికి సుఖదుఃఖాలు లభిస్తాయి. ఈ సుఖదుఃఖాలనుభవించే స్థితికే భోగం అని పేరు. ఈ భోగ దశనే తాత్త్వికులు ''భోగి'' అని పిలిచారు. మనిషి భోగాలనుభవించే సమయమే ''దక్షిణాయనం''. ఎప్పుడైతే కర్మ ఫలాలను ఆశించకుండా పుణ్య కర్మలు చేస్తూ, భోగాలనుంచి విముక్తుడౌతాడో అప్పుడే అతనికి ఊర్థ్వలోక ప్రాప్తి కలుగుతుంది. దీన్నే ''ఉత్తరాయనం'' అని వేదవిదులు గుర్తించారు.

దక్షిణాయనం ప్రవృత్తి రూపం. దానికే పితృయానమని పేరు. పితృయానమనగా మళ్లీ జన్మ సంపాదించడమని అర్థం. భోగాపేక్ష కలిగినవారు నిరంతరం దక్షిణాయనంలోనే సంచరిస్తారు. దీన్నే ''భోగి'' అనే పదం సూచిస్తుంది. ఇట్లే ఉత్తరాయనానికి దేవయానమని పేరు. ఇది నివృత్తి రూపం. భోగాపేక్షలేనివారు దేవయానంలో ప్రవేశించి మోక్షానందం పొందుతారు.

ఇష్టాపూర్తులతో కాలక్షేపం చేస్తూ సుఖదుఃఖాలనుభవిస్తూ భోగులుగా ఉండే జీవులు ఎల్లకాలం అలాగే ఉండవలసిన అవసరం లేదు. భవబంధనం అనేది శాశ్వతమైంది కాదు కనుక జీవుడు ప్రకృతి పురుష వివేకం చేత జీవన్ముక్తుడై పరమాత్మలో ఉండి ఆనందాన్ని పొందగలడు!

Post a Comment

0 Comments