చాలావాటికి సమాధానాలు ప్రశ్నలలోనేవున్నాయి, వెతికి తెలుసుకొని చెప్పడమే...
(1) పంచముఖ ఆంజనేయుడంటే ఐదు ముఖాలు కలవాడని అర్థం కదా ! అవేవంటే (1) నరసింహవతారంలోనిది (2) వరహావతారంలోనిది (3) హయగ్రీవం (4) గరుడ మరి ఐదవదేది. మీకు తెలుసు. ఆలోచించండి.
జ॥ ఆంజనేయుడే కదా !
(2) మైరావణుడు (మహిరావణుడు) శ్రీరామలక్ష్మణులను అపహరించి పాతాళంలో దాస్తాడు. హనుమ పాతాళంలో ప్రవేశించి మైరావణుడి ప్రాణాలను హరిస్తాడు. ఎలా ? ఆధారం (క్లూ) వచ్చే దీపావళిలోవుంది.
జ॥ దీపావళి
(3) ఆంజనేయుడు పాతాళ ప్రవేశాన్ని అడ్డగించి ధ్వజమెత్తినవాడెవరు ? ప్రశ్నలోనే సగం సమాధానముంది.
జ॥ మకరధ్వజుడు
(4) రావణుడికి మైరావణుడికి గల సంబంధమేమిటో ? మీ మా మనసులోనే వుంది. ?
జ॥ మామ
(5) నా మిత్రుడు కొద్దిగా కోతిముఖంతో వుంటాడులేండి ఒకసారి హనుమ అని పిలిచాను, కోపించి దవడ పగులగొట్టాడా సన్యాసి.కొడితే కొట్టాడు కాని హనుమంటే ఏమిటో నాకు తెలీదు.మీరైనా కాస్తా చెబుతారా ? ఏమిటి ఆధారమా ! ప్రశ్నలోనే వెతుక్కోండి.
జ॥ దవడ
(6) పరవస్తుచిన్నయసూరి గొప్ప వ్యాకరణవేత్త, పండితుడు, గ్రంథకర్త, ఏకసంధాగ్రాహి, స్ఫూరదృపి కదా ! మరి ఆంజనేయస్వామి వీటిలో ఏమిటిలో ప్రసిద్ధి ? సమాధానం ప్రశ్నలోనేవుంది వెతుకోవాల్సిందే! తప్పదు.
జ॥ వ్యాకరణవేత్త
(7) లంకకు బయలుదేరిన శ్రీరాముడి సేనలు భూమి నీలాకాశాన్ని దద్దరిల్ల చేసేలావుందని అడవిలోని సింహ, వ్యాఘ్ర, నృకోదర, భల్లూకాలు భయపడిపోయాయి. మీకేమైనా తెలుసా ఆ సైన్యం ఎవరి ఆధ్వర్యంలో దక్షిణదిక్కుగా బయలుదేరిందో ? జవాబు ప్రశ్నలో కనబడుతుందిగాని, కొంచెం కష్టమే మరి .
జ॥ నీలుడు
(8) నీకు నాకు శత్రుత్వంలేదు కనుక నా మాటవిని రాముడి పక్షాన్ని వదలిరమ్మని రావణుడు శుకుడనేవాడిచేత రాయభారం పంపుతాడు. శుకుడు శ్రీరామస్కందావారాన్ని (సైనికశిబిరం) చేరి ఒక యోధుడిపై వాలి ఆలింగనం చేసుకొంటాడు. ఎవరా యోధుడు ? సమాధానం ప్రశ్నలో వుందంటారా ?
(అ) హనుమ
(ఆ) నీలుడు
(ఇ) వాలి
(ఈ) సుగ్రీవుడు
(ఉ) జాంబవంతుడు
జ॥ సుగ్రీవుడు
(9) వానరాలు ఎవరి ఆధ్వర్యంలో జలధిపై సేతునిర్మాణం చేపట్టాయి ?
(అ) నీలుడు
(ఆ) నలుడు
(ఇ) జాంబవంతుడు
(ఈ) లక్ష్మణుడు
(ఉ) విభీషణుడు
జ॥ నలుడు
(10) లంకానగరం ఏ పర్వతంపై నిర్మించివుంది ? కొలువు కూటములోనున్న త్రి జటనడిగితే సరిపోతుంది. సమాధానం ప్రశ్నలోనే వెనుకాముందు వుంది. వెతికి పట్టుకోండి మరి !
జ॥ త్రికూటపర్వతం
జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
0 Comments