ఎన్ఇపితో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం _ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్
నూతన విద్యా విధానం (ఎన్ఇపి)-2020 అమలు జరిగితే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్న కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఇపిని తీసుకురాగా, రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు పూనుకుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ నగర 33వ మహాసభ ఉక్కునగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని రాకెట్ స్పీడ్తో ప్రైవేటీకరణ చేస్తున్నాయని, అందులో భాగంగానే ఎన్ఇపి-2020 అమలు చేస్తున్నాయని తెలిపారు. దీని వల్ల రెండు కోట్ల మంది పేద విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వీరికి అవసరమైన కొత్త పాఠశాలలు ఏర్పాటు కోసం ఎన్ఇపిలో ఎందుకు ప్రస్తావించలేదని, బడ్జెట్ కేటాయింపులు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. మానిటైజేషన్ పేరుతో 91 రైల్వే పాఠశాలలు ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడి స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించడం వల్ల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశ కల్గించినట్లేనని చెప్పారు. అందువ్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఎలాంటి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మహాసభలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎల్జె.నాయుడు ప్రవేశ పెట్టిన నివేదికపై సమీక్షించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
0 Comments