GET MORE DETAILS

రూ.8 లక్షల పరిమితి సరైనదే.. ఇడబ్ల్యుఎస్‌ ప్రాతిపదికపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌

 రూ.8 లక్షల పరిమితి సరైనదే. ఇడబ్ల్యుఎస్‌ ప్రాతిపదికపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌



నీట్‌-పిజి అడ్మిషన్లలో ఇడబ్ల్యుఎస్‌ కోటాలో మార్పులద్దని అభ్యర్థన

 నీట్‌-పిజి అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఇడబ్ల్యుఎస్‌) కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షల్లో మార్పేమీ లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. నీట్‌-పిజి పరీక్షల్లో ఇడబ్ల్యుఎస్‌కు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై ఈ నెల 6న కోర్టు విచారణ జరపనుంది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపులు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల సమస్యలు తలెత్తవచ్చని పేర్కొంది. అవసరమైతే వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నామని పేర్కొంది. ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి రూ. 8 లక్షలుగా ఉండాలని ఆ కమిటీ పేర్కొంది. ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ వర్తించదు. ఒబిసిలకు క్రీమీలేయర్‌గా ఉన్న రూ.8 లక్షల కటాఫ్‌ను కేంద్రం ఇడబ్ల్యూఎస్‌కు 'యాంత్రికం'గా స్వీకరించిందనే వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఒబిసిల విషయంలో వరసగా మూడేళ్ల స్థూల వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. జీతాలు, వ్యవసాయం, సాంప్రదాయ చేతివృత్తుల ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోరు. ఇడబ్ల్యూఎస్‌లో రూ.8 లక్షలకు వ్యవసాయంతోసహా అన్నింటి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒకే కటాఫ్‌ నంబర్‌ (రూ.8 లక్షలు) అయినప్పటికీ, వీటి కూర్పు భిన్నంగా ఉంటుంది కాబట్టి, రెండింటినీ సమానంగా చూడలేమని కమిటీ తన నివేదికలో తెలిపింఇ. ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్‌ ప్రక్రియను ప్రభావితం చేయబోవని పేర్కొంది. ఇప్పటి వరకు లబ్ధిపొందిన విద్యార్థుల పూర్వాపరాలను కమిటీ పరిశీలించిందని అఫిడవిట్‌లో తెలిపింది. అనర్హులకు రిజర్వేషన్లు అందుతున్నాయన్న ఆందోళన ఉత్పన్నం కావడం లేదని తెలిపింది. ప్రస్తుతం దీని వల్ల లబ్ధ్దిపొందుతున్న వారిలో చాలా మంది రూ.5 లక్షల లోపు ఆదాయం కల్గిన కుటుంబాల విద్యార్థులే ఉన్నారని తెలిపింది.

Post a Comment

0 Comments