పరీక్ష తేదీలపై ఎపిపిఎస్సి తర్జన భర్జన _ నాలుగు నెలలుగా ప్రకటించని వైనం : ఎదురుచూస్తున్న నిరుద్యోగులు
వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహించే అంశంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) తర్జనభర్జన పడుతోంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 1148 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో ఆయుష్లో 151 పోస్టులు, అసెంబ్లీ తెలుగు రిపోర్టర్స్ 5 పోస్టులు, డిపిఆర్వో 4, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులో 6, అసిస్టెంట్ ఇంజనీర్స్ 192, నాన్ గెజిటేడ్ 38, స్త్రీ సంక్షేమ శాఖలో 22 పోస్టులకు విడుల చేసింది. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, దేవాదాయ శాఖలోని 60 ఇవో పోస్టుల భర్తీకి డిసెంబర్ 28న నోటిఫికేషన్లు విడుదల చేసింది. సెప్టెంబర్లో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలను కూడా కమిషన్ ఇంతవరకు ప్రకటించలేదు. నాలుగు నెలలుగా కోచింగ్ కేంద్రాల వద్దే ఉండి పరీక్షలకు సిద్ధమవుతున్నామని, త్వరగా తేదీలు ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ మాత్రం ప్రిలిమ్స్ నిర్వహణ అంశం మరోసారి తీసుకురావడం, వేర్వేరు పోస్టులకు డిగ్రీనే అర్హత కావడం వంటి అంశాల వల్ల తేదీల ప్రకటన ప్రక్రియ ఆలస్యమవుతుందని కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో నిర్వహించిన పరీక్షలకు కొంతమంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో సిబ్బందిని మేనేజ్ చేసుకుని మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డారని నిరుద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన్నట్లు కమిషన్ అధికారులు చెబుతున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తే ఒక చోటైనా మాల్ప్రాక్టీస్కు అడ్డుకట్ట వేయవచ్చుననే ఆలోచనతో ప్రిలిమ్స్ను మళ్లీ నిర్వహిస్తున్నామని సమర్ధించుకుంటున్నారు. రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, దేవాదాయ శాఖలోని ఇవో పోస్టులకు సాధారణ డిగ్రీ అర్హతగా ఉంది. కాబట్టి ఇలాంటి పోస్టులకు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని కమిషన్ భావిస్తోంది. వెంటవెంటనే పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు సన్నద్ధమైందుకు సమయం ఉండదని, అభ్యర్ధులు కూడా వాయిదా వేయాలనే డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని కమిషన్ భావిస్తోంది. ఆర్ఆర్బి, యుపిఎస్సి, ఎస్ఎస్సి విడుదల చేసిన పరీక్షల తేదీలను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పోస్టులకు నిర్వహించే తేదీలు రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పటివరకు కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తులు ఎన్ని వచ్చాయో అనే అంశాన్ని పరిశీలించి, పరీక్షల తేదీలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది. తక్కువ దరఖాస్తులు వచ్చిన పోస్టులకు ముందుగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది.
0 Comments