GET MORE DETAILS

మార్చి 21 - ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం

మార్చి 21 - ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం



తోలుబొమ్మలాట అనగా తోలుతో చేసిన బొమ్మలతో నాట్యం చేయించుట. పల్లె వాసులకు వినోదాన్ని పంచి పెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాట మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసుల కందుబాటు లోకి వచ్చాయి.

తోలుబొమ్మలాట క్రీ.శ. 1700 కాలంలో  ఆంధ్రదేశంలో ఎక్కువగాప్రదర్శింపబడుతుండేవి. ఆ కాలపు జనుల వేడుకలలో తోలుబొమ్మలాట ముఖ్యమైంది.  చాలా ప్రాచీనుడగు పాలకురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో తోలుబొమ్మలాట గురించి వ్రాసియున్నాడు.

ఈ జానపద కళారూపం తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శించేవారు. 

భారతీయులలోతెనుగువారిలోను, కర్ణాటకులలోను ఇది చాలా ప్రాచీనమునుండి వచ్చినట్టి యాట. 

సన్ననివస్త్రమును తెరగా కట్టి దానిలోపల పెద్ద దివటీలు వెలిగించి తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు, తలలకు దారములు కట్టి మధ్య నొక వెదురుకర్ర కట్టి అ బొమ్మనుపట్టి నిలబెట్టి అవసరమగు దారములను లాగుతూ వదులుతూ బొమ్మ లాడించెడివారు. ఆట కనుగుణ్యముగా తాళము వాయించుతూ కథకు సంబంధించిన పాట పాడుదురు.

రామయణకథకు గోన బుద్ధారెడ్డి రామాయణములోని ద్విపదలను పాడేవారు. 

బొమ్మలను సూత్రములతో నాడించువా రగుటచేత అట్టి ప్రదర్శకుని "సూత్రధారుడు" అని యందురు. సంస్కృత నాటకములలో నాటకమును ప్రారంభించునప్పుడు 'సూత్రధారుడు' ప్రవేశించి ప్రదర్శింపనున్న నాటకము గురించి కొన్ని మాటలు చెప్పిపోవును. కాని తోలుబొమ్మలాటలో ఆదినుండి తుదివరకు సూత్రదారుడు లేనిది బొమ్మ లాటయే యుండదు. కాన నాటకాలకన్న బొమ్మలాటకే సూత్రధార పదము సరిపోవును.

 తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్చి దిద్ది ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. 

ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. తోలుబొమ్మలాట ప్రదర్శనకు  కావలసిన పరికరాలను,  రథాలు, గుఱ్ఱాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం మొదలైన వాటినన్నిటినీ కూడా తయారు చేసుకుని ప్రదర్శనం రోజున వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఈ బొమ్మలన్నిటినీ సక్రమంగా, సిద్ధంగా అమర్చి పెట్టుకుని, ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరమీదీకి ఎక్కించి కథను ముందుకు నడుపించుతారు.

పాట పాడేవారు, హార్మోనియం వాయించే వారూ, తాళం వేసే వారూ, మద్దెల కొట్టేవారూ, అదనపు మోతల్నిచ్చేవారూ, వంతపాటలు పాడేవారూ అందరూ లోపలే కూర్చుంటారు.  వీరికి హార్మోనియం శ్రుతిగా వుంటుంది. తాళాలుంటాయి. హార్మోనియం, తాళాలు, మద్దెల వాయించే వ్వక్తులు కూడా వెనుక వంత పాట పాడుతూ వుంటారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ క్రింద బల్లచెక్కలుంటాయి. ఆ యా ఘట్టాల ననుసరించి ఈ చెక్కలను త్రొక్కుతూ వుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, పరుగు లెత్తేటప్పుడూ, యుద్ధ ఘట్టాలలోనూ ఈ చెక్కలు టకటకా త్రొక్కుతూవుంటే బలే రసవత్తరంగా వుంటుంది. అంతేగాక నగరా మోతలకు ఖాళీ డబ్బాలు వుపయోగిస్తారు. పిడుగులు పడ్డట్టూ, వురుములు వురిమినట్టు డబ్బాలను మోగిస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శననాన్ని జయప్రదంగా రక్తి కట్టిస్తారు. ఆట ఆడినంతసేపూ పరస్పర సహకారం వారిలో కనబడుతుంది. అందువల్లనే వారి ప్రదర్శనాలు అంత బాగా రక్తి కడతాయి.

ముఖ్యంగా ఏ వ్యక్తి బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్యక్తి నోటితొ పాట పాడుతూ పాటకు తగిన విధంగా బొమ్మను ఆడిస్తాడు. సంభాషణలకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాడు. ఇక రెండు బొమ్మల్నీ ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే పోరంటంలో, రెండు బొమ్మల్ని రెండు చేతులతో కొట్టిస్తాడు. అలా కొట్టడంలో సమయానికి క్రింద బల్ల చెక్క టకామని త్రొక్కుతాడు. నిజంగా పాత్రలు కొట్టుకున్నట్టే వుంటుంది. ఈ సమమంలో ఇతర వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధ ఘట్టం వచ్చిందంటే, డోళ్ళు, డబ్బాలూ, ఈలలూ కేకలతో వాన కురిసి వెలిసినట్లు చేస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శనను సమష్టి కృషితో జయప్రదంగా నిర్వహించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.

అప్పటిలో తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చాలు, గ్రామ చుట్టుప్రక్కలున్న పెద్దలు, పిల్లలూ, స్త్రీలూ అందరూ హెచ్చు తగ్గుల భేదాలు లేకుండా ఒకరికంటే ఒక ముందుకు వచ్చి కూర్చునేవారు. కథా ప్రారంభం నుండి ఆసాంతం వరకూ రెప్ప వాల్చకుండా చూస్తూ  ఆనందించేవారు. 

ప్రతి ఘట్టం లోనూ వారు కదిలి పోతారు. హాస్య ఘట్టాలలో ఎంతగా పగలబడి నవ్వుతారో అలాగే కష్టాలతో కూడుకున్న ఘట్టాల్లో కళ్ళవెంట నీరు కారుస్తారు. ఇక దౌర్జన్యం ఘట్టాలలోనూ, దుర్మార్గపు సన్నివేశాలలోనూ, ఆయా పాత్రలమీద పళ్ళు పటపాటా కొరుకుతారు. ఈ విధంగా పండితుల మొదలు పామరుల వరకు ఆబాల గోపాలం ఆనందంతో మునిగి తెలేలా తోలుబొమ్మలాట నడిచేది.

ఈ బొమ్మలాట ప్రదర్శనలను ఇంత ఆపేక్షాగా ప్రజలు చూడడానికి కారణం లేక పోలేదు. తెలుగు నాట బొమ్మల ప్రదర్శనాలలో విచిత్రమైన లాస్య పాత్రలను చూపుతారు. ఈ పాత్రలు కథా ప్రారంభం నుండి కథాంతం వరకూ అడుగడుగునా కథాగమనంతో ఒక ఘట్టం అయిన తరువాతి రెండవ ఘట్టం ప్రారభమయ్యే వ్వవధిలో ప్రత్యక్షమౌతూ వుంటాయి. ఆ పాత్రలే జుట్టుపోలిగాడు, బంగారక్క. ఈ రెండు పాత్రలూ హాస్యం ద్వారా, దీర్ఘ కాలం ప్రదర్శించే ప్రదర్శనంలో మధ్య మధ్య వారిని కడుపుబ్బ నవ్వించి నిద్రమత్తు వదలగొడుతూ వుంటాయి. ఈ పాత్రల హాస్యం బహు మోటుగా వుంటుంది. నవ్వుతో కడుపు చెక్కలయ్యే పనులు ఈ బొమ్మలతో చేస్తారు. సమాజంలో వున్న కుళ్ళును, ఈ బొమ్మలను అడ్డంగా పెట్టుకుని కుళ్ళగిస్తూ వుంటారు. మధ్య మధ్య విసుర్లూ విసురుతూ వుంటారు.

తోలుబొమ్మలాటల్లో హాస్యం ఎంతవర కెళ్ళిందో అల్లటప్పగాడి గురించి తెలుసుకుంటే బోధపడుతుంది. జుట్టుపోలిగాడు, బంగారక్క కాక వీడు మూడవ వాడు. వీడి పాత్ర ఎటువంటిదంటే 'తాడెక్కే వాడుంటే వాడి తలదన్నే వాడుంటాడనే సామెత ప్రకారం పైరెండు పాత్రలనూ తలదన్నేవాడు. 

ఈ అల్లాటప్పగాడు. ప్రదర్శనంలో బంగారక్కను గడసరి పెండ్లాంగా సృష్టిస్తారు. ఈమెకు, పోలిగాడికి నిరంతరం కయ్యం నడుస్తూ వుంటుండి. కాసేపు రెండు పాత్రలూ అతి విచిత్రంగా అసభ్య శృంగారాన్ని అభినయిస్తాయి. కొంచెంసేపు పోట్లాట, మరల రాజీ, ఇంతలో పోలిగాడు అంతర్థానం. ఈ సమయంలో అల్లటప్పగాడు బంగారక్క దగ్గర ప్రత్యక్షమౌతాడు. బంగారక్కకు, అల్లాటప్పకు సంబంధాన్ని కుదురుస్థాడు. రెండు పాత్రలూ మంచి శృంగారపు పట్టులో వుండగా మరో పాత్ర ప్రవేశిస్తుంది. అది కేతిగాని పాత్ర.

కేతిగాడి పాత్ర అతి విచిత్రమైంది. అన్నీ బొమ్మలకన్నా కేతిగాడి బొమ్మ చిన్నది. ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు పానకంలో పుల్లలాగ ఒక అడుగు చోటు తెరమీద వుంటే చాలు హఠాత్తుగా ప్రవేశిస్తాడు.   

చాలమంది ప్రేక్షకులు కథకంటే హాస్య పాత్రల ప్రవేశం కొరకే ఎదురు చూస్తూ వుంటారు. అందువల్లనే ప్రదర్శనం తెల్లావార్లూ ప్రదర్శించినా విసుగుజెందరు.

గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయి పోయిన తరువాత ఈ బొమ్మలాటల ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో జానపదులకు కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. వర్షాలు కురవక పోతే భారతంలోని విరాటపర్వం ఘట్టాన్ని హరికథగా గానీ, లేదా శ్రవణం ద్వారా గాని చేస్తే వర్షాలుపడతాయని పల్లె ప్రజల నమ్మకంఇ. ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని ప్రాంతంలో ఆ ఆటలను ఆడిస్తూ వుంటారు. ఆవిధంగానే పై కథలను తోలుబొమ్మలాట రూపంలో ప్రదర్శిస్తే వర్షాలు కురుస్తాయని పల్లె ప్రజల నమ్మిక.

అరవై దశకంలోనే ఈతోలుబొమ్మలాట అవసాన దశకుచేరుకున్నట్టు అర్థం మౌతూంది. ఎలాగంటే అంతవరకూతోలుబొమ్మలాటలను మాపల్లెలో ఆడించండంటూ పల్లె పెద్దలు తోలు బొమ్మలాట కళాకారులను అభ్యర్థించేవారు. కొంతకాలానికి తోలుబొమ్మలాట కళాకారులు తమ ప్రయాణ ప్రస్థానంలో తారసపడిన పల్లె పెద్దలను నాశ్రయించి తాము తోలు బొమ్మలాట ఆడించడానికి అనుమతి కోరిన సందర్భాలలో వారి అనుమతి కొరకు వేచి వుండే సందర్భాలకు దిగజారి చాల కాలమే గడిచిపోయింది. ఆ పరిస్థితి కూడా గతించగా తోలుబొమ్మలాట ఆడించనిదే తమ జీవన భృతి లేదనే స్థాయికి దిగ జారి పోయారు ఆ కళాకారులు. అప్పటికే వీధినాటకాలు, డ్రామాలు, సినిమాలు, ఇతర వినోదాన్నందిచే అనేక ప్రక్రియలు మారుమూల నున్న పల్లె ప్రజలకు అతి సమీపంలోకి వచ్చాయి. ఆదరణ పొందాయి. పల్లెప్రజలు కూడా సాంఘికంగా, నాగరికంగా, విద్యావిషయంలో చాల అభివృద్ధి పొందారు. ఆ విధంగా ఆనాటి తోలుబొమ్మలాటలను, అందులోని హాస్యం, శృంగారం, ఇతర సంభాషణ చాతుర్యం చాల మొరటుగాను, జుగుప్సాకరంగాను అపహాస్యంగాను అనిపించ సాగాయి. అభివృద్ధి చెందిన పల్లెవాసులకు, అభివృద్ధి చెందిన ఇతర వినోద ప్రక్రియలు వైపు పల్లె ప్రజలు మొగ్గు చూపారు. పైగా తోలు బొమ్మలాట కళాకారులు అభివృద్ధి చెందుతున్న సమాజాని కనుగుణంగా తమ ఆటలను మార్పు చేయక తమ పాత పద్ధతిలోనే ఆటను కొనసాగించారు. అది పల్లె ప్రజలకు నచ్చక ఆ కళాకారులు నిరాధరణకు గురైనారు.

ఆవిధంగా నిరాదరణకు గురైన కళాకారులు అంతవరకు తమ తోలు బొమ్మలాటకు సకల సౌకర్యాలు అనగా పందిరి, తెరలు, వేదిక, కళాకారుల భోజన సదుపాయాలు పల్లెవాసులే అమర్చిన స్థాయి నుండి కళాకారులే తామె స్వంతంగా తమకు కావలిసిన సరంజామానంత సమకూర్చుకొని ఎక్కడన్నా పెద్ద వేడుకలు, తిరుణాళ్లు, వంటి సందర్భాల ప్రదేశాలలకు వెళ్ళి వారి అనుమతితో అవసరమైతే వారికి కొంత పన్ను కట్టి, తమ స్యంత గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో టికెట్టు పెట్టి తమ కళను ప్రదర్శించేవారు. ప్రస్తుతం ఈకళ అంతరించిపోతూ ఉంది. నేటి యువతరానికి ఈ కళగురించి తెలియచెప్పాలనే ఆలోచనతో ఈ వివరాలందించడం జరిగింది.

Post a Comment

0 Comments