ప్యాసింజర్స్ రెవెన్యూలో వాల్తేరు రికార్డు
2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి వాల్తేరు రైల్వే డివిజన్ పాసింజర్ల (ప్రయాణికులు) ఆదాయంలో రికార్డు నెలకొల్పింది. 2020-21 సంవత్సరంలో 10.16 మిలియన్ల మంది పాసింజర్ల ద్వారా రూ.349.71 కోట్లు రెవెన్యూ ఆర్జించిన వాల్తేరు డివిజన్, తాజా ఆర్థిక సంవత్సరంలో 10.61 మిలియన్ మంది ప్యాసింజర్ల ద్వారా రూ.358.01కోట్లు ఆదాయాన్ని ఆర్జించి ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 4.43శాతం అదనంగా ఆర్జించింది. టార్గెట్ కంటే 2.37శాతం మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్జించింది. ఈ సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ అనుప్ సత్పతి మాట్లాడుతూ డివిజన్ అంతా మానవ శ్రమను పూర్తిగా వినియోగించుకున్న ఫలితంగా అద్భుత ఫలితాలను సాధించామన్నారు. టిక్కెట్ చెకింగ్ డ్రైవ్లు కూడా ఆదాయ పెంపునకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. కోవిడ్-19 సందర్భాల్లో టికెట్ల కేన్సిల్, రైళ్ల రద్దుతో ఆదాయానికి అంతరాయం ఏర్పడిందని, ఈ ఏడాది పూడ్చుకోవడం జరిగిందని తెలిపారు. పీక్ సీజన్లో రైళ్ల డైవర్షన్ ఈ ఏడాది లేకుండా ఉండి ఉంటే ఇంకా ఆదాయం అధికంగా లభించేదని పేర్కొన్నారు. 2 తుపాన్లు కూడా రైల్వే ఆదాయంపై నెగెటివ్ ప్రభావం చూపాయని పేర్కొన్నారు. తుపాన్ల కారణంగా మేజర్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలిగామని తెలిపారు. 2022 ఫిబ్రవరి చివరనాటికి 0.43 లక్షల కేసులను డిటెక్షన్ చేయడం ద్వారా రూ.2.58కోట్లు రెవెన్యూ సాధించామని, ఇది 2019 నాటికంటే 101.56శాతం ఎక్కువని పేర్కొన్నారు. అప్పట్లో 0.40 కేసుల ద్వారా రూ.1.28కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
0 Comments