కాశీలో వదిలిన కాయ, పండు పొరబాటున తింటే ప్రాయశ్చిత్తం ఏమిటి ? మళ్ళీ కాశీకి వెళ్ళాలా...?
మళ్ళీ అవి తినకుండా ఉండడమే ప్రాయశ్చిత్తం.
అసలు ఇలాంటి విధి నిషేధాలు పెద్దలు ఎందుకు పెట్టారో ముందు తెలుసుకోవాలి.
మనకు బాగా ఇష్టమైన కాయను, పండును వదలడం అంటే విషయాసక్తి తగ్గించుకోవడం, ఆ విధంగా వైరాగ్యాన్ని పెంచుకోవడం, ఇదీ ఉద్దేశ్యం.
'మీకిష్టమైనదేదో చెప్పండి. అది వదిలెయ్యాలి' అని పురోహితుడంటే 'గంగలో మునిగిన ఒక సంసారి, ‘నాకు నా భార్యంటే చాలాఇష్టమండీ' అన్నాడట!
మనుషుల మనస్తత్వం ఇలా ఉంటుంది!
మన శాస్త్రాలు ఏ ఆచారం పెట్టినా, దాని వెనక ఏదో మంచి ఆశయం ఉంటుంది.
ఆ సదాశయాన్ని పాటించకుండా ఏదో పండు, కాయ వదిలేయమంటే ఏ మాత్రం ఇష్టంలేని కాకరకాయను, దోసపండును వదిలేవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు.
రోజులు గడిచేకొద్దీ అహంకారాలు, మమకారాలు, లోక విషయాలపట్ల, రుచులపట్ల ఆసక్తి తగ్గాలి.
అనాసక్తి, అసంగం, విరక్తి కలగాలి. మళ్ళీ మళ్ళీ పాపకర్మలు చేసి, సంసారకూపంలోకి దిగిపోకుండా చూచుకోవాలి.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
లోకా సమస్తా సుఖినోభవన్తు!
0 Comments