కనుమరుగౌతున్న తోకలేని పిట్ట (నేడు ప్రపంచ తపాలా దినోత్సవం)
యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836
ఇప్పుడు ఉత్తరం అంటే దిక్కు అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఇలా అనుకోవడం లో తప్పులేదు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కొన్ని సమాచార సాధనాల యొక్క ప్రాముఖ్యత పోయి,కొత్త వాటికి ఆదరణ లభిస్తోంది. టెలిగ్రామ్, ఉత్తరం అలాంటివే.
నాడు తోకలేని పిట్ట కోసము ఆతృతగా ఎదురుచూసి వీధిలో "పోస్ట్ " అన్న కేక వినగానే ఉరుకులు , పరుగులులతో బయటకు వచ్చి పోస్ట్ మేన్ నుండి ఉత్తరం ఆతృతగా అందుకుని చదివేవాళ్ళం.
నేడు స్మార్ట్ ఫోన్లో సెకండ్ల వ్యవధిలో యస్ యం యస్, వాట్సప్లద్వారా సమాచారం అందుతుంది.అయినప్పటికీ ఎన్నోవిశేషాలు , అనేక కమ్మని కబుర్లు , కెరీర్ కు మంచి బాటలు ఆనాటి ఉత్తరాల్లోనే వచ్చేవి.మంచి ఉత్తరము అందుకున్నప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు అలాగే మనియార్డర్లు కూడా!
సెల్ ఫోన్లు , కంప్యూటర్లు , ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక తపాలా ఉత్తరాలు పని తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి .అయినప్పటికి కొన్ని ప్రదేశములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు .
1874 లో నార్త్ జర్మన్ కాన్ఫెడరేషన్ కు చెందిన ఓ సీనియర్ పోస్టల్ అధికారి హెయిన్రిచ్ బనీ స్టీఫెన్ స్విట్జర్లాండ్ లోని బెర్నె లో 22 దేశాల ప్రతినిధులతో ఒక సదస్సు ఏర్పాటుదేశాడు . ఆ ఏడాది అక్టోబరు తొమ్మిదో తీదీన ప్రతినిధులు బెర్నె ఒప్పందము పై సంతకాలుచేసి జనరల్ పోస్టల్ యూనియన్ ను నెలకొల్పారు . ఈ యూనియన్ లో సభ్యదేశాలు క్రమముగా పెరుగుతూ రాగా యూనియన్ పేరు 1878 లో యూనివర్షల్ పోస్టల్ యూనియన్ గా మారింది . ఇది 1948 లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక ఏజెన్సీగా రూపాంతరం చెందినది . 1969 లో అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వ తేదీవరకు జపాన్ టోకియో లో 16 వ యూనివర్షల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ ను నిర్వహించారు.ఈ కాన్ఫెరెన్సు లో ప్రతినిధులు అక్టోబరు 9 వ తేదీన " వరల్డ్ పోస్టల్ డే" గానిర్వహించాలని తీర్మానించారు.
పోస్టల్ డే ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశము ప్రపంచ వ్యాప్తం గా సందేశాల్ని సౌకర్యము గా పంపుకునే యంత్రాంగము నొకదానిని సృస్టించడమే . అంతర్జాతీయ లేదా జాతీయ పోస్టల్ సర్వీసుల ప్రగతి లేదా చరిత్ర పై ప్రపంచ దేశాలు , మంత్రులు , సంస్థలు , అత్యున్నతష్థాయి అధికారులు ఈ రోజున ప్రకటనలు ఇస్తారు లేదా ప్రసంగాలుచేస్తారు.యూనివర్సల్ పోస్టల్ యూనియన్ లో సభ్యత్వము కలిగిన దేశాలలో నేడు 'వర్కింగ్ హాలిడే ' గా అనేక కార్య క్రమాలు నిర్వహించ బడుతాయి.
తోకలేని పిట్ట తొంభై ఊర్లు తిగిందని ఉత్తరాలపై ఓ సామెత ఉంది. సమాచార రంగంలో రానురాను విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పావురాల ద్వారా బట్వాడా నుంచి.. స్పీడుపోస్టు.. ఈ-మెయిల్ ఇలా దూసుకెళ్తున్న భారత తపాలవ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని మూటగట్టుకుంది. ఉత్తర ప్రత్యుత్తరాల వారధులుగా అశేష సేవలందిస్తున్న ఈ విభాగం ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగింది.. ప్రైవేట్ రంగం నుంచి వచ్చిన పోటీని ప్రస్తుత కంప్యూటర్ యుగాన్ని తట్టుకొని నిలబడుతోంది. తపాలశాఖ గతంలో ఉత్తరాలు బట్వాడాకే పరిమితంకాగా కాలక్రమంలో అనేక సేవల్లోకి మారింది. ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు లక్షల మంది తపాల సిబ్బంది 1.10లక్షల కార్యాలయాలతో సేవలందిస్తోంది. దేశంలో రైల్వే తర్వాత ఇదే అతి పెద్ద వ్యవస్థ.
స్పీడు పోస్టు కోసం మనదేశంలో 180 కేంద్రాలున్నాయి. 100కు పైగా దేశాలకు ఈ సౌకర్యం ఉంది. రూ.5 అదనంగా చెల్లిస్తే స్పీడు మనియార్డరు సదుపాయం ఉంది.ఈ-పోస్టు సర్వీసు.. ప్రపంచంలో ఏమూలనుంచైనా ఈ పోస్టు చేస్తే క్షణాల్లో ఎంపిక చేసిన పట్టణాల్లో పోస్టుమెన్ ద్వారా ఇంటికి అందుతుంది.
బంగారు నాణాలు, ఫారెన్ ఎక్ఛేంజ్ కరెన్సీ మార్చుకోవడం లాంటి అనేక సౌకర్యాలు అందిస్తుంది. ఎక్స్ప్రెస్ పార్సిల్ పోస్టు ద్వారా 35 కిలోలు మించని ఆర్టికల్స్ పంచవచ్చు.మీడియా పోస్టు ద్వారా పోస్టల్ కార్యాలయాలు, లెటర్ బాక్సులపై తమ సంస్థల ప్రకటనలు రాసుకునే సదుపాయం ఉంది.
2006లో ఇన్స్టెంట్ మనీ ఆర్డర్ సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా దేశంలోని ముఖ్యమైన పట్టణాలకు ఈ సౌకర్యాన్ని వర్తింపజేశారు. దీనిద్వారా రూ.50వేల వరకు క్షణాల్లో పంపవచ్చు.ఫోన్ చేస్తే పోస్టాఫీసు సర్వీసులను ఇంటివద్దకే వచ్చి పోస్ట్మెన్ అందించే సౌకర్యాన్ని ప్రారంభించారు.ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా నిధుల విడుదల, డబ్బుల చెల్లింపులను తపాలశాఖనే నిర్వహిస్తోంది.
ఆపరేషన్ యారో పథకం ద్వారా దేశంలోని పోస్టు ఆఫీసుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టారు. వాటి రూపురేఖలు మార్చారు.వివిధ పథకాల ద్వారా పోస్టల్ రంగం తిరిగి ప్రజలకు చేరువైంది. కానీ తోక లేని పిట్ట మాత్రం ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది.
0 Comments