ఏకాగ్రత పెంచే ప్రాణాయామం
బిజీ బిజీ జీవితంలో నిత్యం ఉరుకులు పరుగులే. ఈ కారణంగా మానసిక ఒత్తిడి పెరిగి ఏకాగ్రత లోపిస్తుంది. బీపీ పెరగడం, తలనొప్పి తదితర సమస్యలు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రాణాయామం చేయడం ఎంతో మంచిది. వీటిని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఏకాగ్రత ను పెంచే ఆసనాల గురించి తెలుసుకుందాం.
1) భ్రమరీ ప్రాణాయామం
ముందుగా పద్మాసనం, సుఖాసనం, అర్ధ పద్మాసనం, లేదా వజ్రాసనంలో కూర్చోవాలి. తల, మెడ, నడుము నిటారుగా ఉంచాలి. నెమ్మదిగా కండ్లు మూసి, రెండు చేతుల చూపుడు వేళ్ళతో రెండు చెవులు మూసి, దీర్ఘంగా ముక్కు ద్వారా శ్వాసను తీసుకుని గొంతు నుంచి తుమ్మెద లాగా ఝంకార నాదం ధ్వనించాలి. ఈ విధంగా పది రౌండ్లు చేయాలి.
ఉపయోగాలు:
• కోపం తగ్గుతుంది, బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
• జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
• తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మనసు ప్రశాంతంగా ఉంటుంది.
జాగ్రత్తలు:
• పెదాలు మూసి ఉంచాలి.
• చెవుల పైన ఎక్కువ ప్రెషర్ లేకుండా సున్నితంగా మూయాలి.
2) శీతకరి ప్రాణాయామం
సుఖాసనంలో మెడ, వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. దంతాలను నొక్కి పట్టి నాలుక కొనను పళ్ల లోపల భాగానికి పోనిచ్చి పెదవులు తెరచి ఉంచాలి. గాలి పళ్ల మధ్య నుంచి లోపలికి గాలి పీల్చాలి. గాలి పీల్చిన తరువాత పెదవుల్ని మూయాలి. పీల్చిన గాలి కాసేపు లోపల ఆపి, ఆ తర్వాత ముక్కు రంధ్రాల నుండి బయటకు వదలాలి. ప్రారంభంలో 5 సార్లు, క్రమంగా 20 సార్లు ఈ ప్రాణాయామం చేయాలి.
ఉపయోగాలు:
• ఒత్తిడి, ఆందోళన, భయం తగ్గి మనసు ప్రశాంతమవుతుంది.
• అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా మంచిది.
• ఏకాగ్రత పెరుగుతుంది.
• రక్తం శుద్ధి అయి చర్మ సమస్యలు తగ్గుతాయి.
• ముఖ కాంతి పెరుగుతుంది.
• కోపం తగ్గుతుంది.
• నిద్ర బాగా పడుతుంది.
జాగ్రత్తలు:
• అల్ప రక్తపోటు (లో బీపీ) , దగ్గు, జలుబు ఉన్నవారు చేయకూడదు.
• శ్లేష్మం ఎక్కువ ఉన్నవారు కూడా ప్రాణాయామం చేయకూడదు.
0 Comments