GET MORE DETAILS

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత

 తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత


తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన.. చెరగని ముద్రవేశారు. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు.  1983 నవంబర్‌ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011లో పదవీ విరమణ చేసేవరకు దూరదర్శన్‌లో పనిచేశారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

శాంతి స్వరూప్‌తో అనుబంధం సుదీర్ఘమైనది: చంద్రబాబు

అమరావతి: తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti swaroop) మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఆయనేనని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

‘‘నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ప్రతి సోమవారం ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమం చేసేవాళ్లం. ఆరేళ్ల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందేవారు. ఆ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

శాంతి స్వరూప్‌ మృతిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. దూరదర్శన్‌ అంటే వార్తలు.. వార్తలు అంటే శాంతి స్వరూప్‌ అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరయ్యారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్‌ సంతాపం

శాంతి స్వరూప్‌ మరణంపై భారాస అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్తలు చదివే తొలితరం న్యూస్‌రీడర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారని.. మీడియా రంగంలో తనదైన ముద్రవేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment

0 Comments