GET MORE DETAILS

చికాకోల్ (శ్రీకాకుళం) ప్రత్యేకతలు - కళింగాంధ్ర భాష

 చికాకోల్ (శ్రీకాకుళం) ప్రత్యేకతలు - కళింగాంధ్ర భాష 




విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రజలు మాట్లాడే భాషను కళిగాంధ్ర భాష అంటారు. తెలుగులోనే ఒక ప్రత్యేకమైన యాస ఇక్కడ మీకు కనిపిస్తుంది. బ్రిటీషర్ల కాలంలో శ్రీకాకుళం చికాకోల్ పేరుతో చెలామణీ అయ్యింది. నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగెడ్ మొదలైన ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్య నదులు.ప్రత్యేకమైన యాసతో  కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు. గణేశ్ పాత్రో లాంటి సినిమా రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు. బేపి (కుక్క), పెనిమిటి (భర్త), గీర లేదా గీర్మానం (పొగరుబోతుతనం), వర్ర (కారం), గుంట (కాలువ), బుగత (భూస్వామి), గుడ్డి (పొలం) లాంటి పదాలు, మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి. గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి.

ఆ మధ్యకాలంలో విడుదలైన అల వైకుంఠాపురంలో చిత్రంలో "సిత్తరాల సిరపడు" పాట రాసిన కవి ఎవరో కాదు.. శ్రీకాకుళం వాసైన బల్లా విజయకుమార్. ఈ పాటలో చాలా శ్రీకాకుళం పదాలు కనిపిస్తాయి. బుగతోడి ఆంబోతు, కొమ్ములతో కోలాటం, వరదలో గుంటగాళ్లు, గుక్కి గుండ చేసినోళ్లు, పనిమోల సొరసేప, సక్కనమ్మ కళ్లలో యేల యేల సుక్కలు.. ఇలా చాలా గమ్మత్తైన జానపద పదాలు ఈ పాటలో కనిపిస్తాయి. శ్రీకాకుళం జానపద పదాల సంపదను మనకు మన గుండెకు మరింత దగ్గర చేస్తాయి.


వీరులు తిరుగాడిన నేల :

శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్రపాపారాయుడి పేరు కచ్చితంగా నిలిచిపోతుంది. ఆయన కోట రాజాంలో ఉండేది. బొబ్బలి యుద్ధం తర్వాత విజయరామరాజును పాపారాయుడు మట్టుబెట్టాడన్న సంగతి తెలిసిందే. తాండ్ర పాపారాయుడి రాజాం కోట ఎన్నో రహస్యాలకు కేంద్రమని పెద్దలు అనేవారట. ఆ కోటను దుర్గామాత ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందని, కోట పైభాగాన భేతాళుడు నివసిస్తుంటాడని పలు కట్టుకథలు కూడా హల్చల్ చేశాయి.

ఉద్యమాల నేల :

 ప్రపంచ ఉద్యమాల చరిత్రలో శ్రీకాకుళ గిరిజనోద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ అంటూ సుబ్బరావు పాణిగ్రహి లాంటి విప్లవకారులు సోంపేట లాంటి ప్రాంతాలలో పోరాటాలకు బీజం వేశారు. ఈయన కంటే ముందే గరిమెళ్ల సత్యనారాయణ లాంటి స్వాతంత్య్ర సమయోధులు శ్రీకాకుళం నేలపై సమర శంఖరావాన్ని మ్రోగించారు. మాకొద్దు తెల్లదొరతనమూ అంటూ బ్రిటీష్ వారి ఆగడాలను ప్రతిఘటించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేట గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం.


ఎందరో గొప్ప రచయితలను కన్న కర్మభూమి :

రావిశాస్త్రి, చాగంటి సోమయాజులు, కవేరా, గెడ్డాపు సత్యం, తాపీ ధర్మారావు, ఛాయారాజ్, దూసి ధర్మారావు, బలివాడ కాంతారావు, రోణంకి అప్పలస్వామి, మీగడ రామలింగస్వామి, వెలమల సిమ్మన్న, అట్టాడ అప్పల్నాయుడు, చింతా అప్పల్నాయుడు, బంకుపల్లె మల్లయ్యశాస్త్రి , దైతా గోపాలం, మల్లాది వెంకటక్రిష్ణ శాస్త్రి, రావి కొండలరావు లాంటి ఎందరో పేరొందిన రచయితలు శ్రీకాకుళం వాణిని జగద్విఖ్యాతం చేశారు.


కళామతల్లి ముద్దు బిడ్డలు :

 మాడుగుల వేంకట సూర్యప్రసాదరాయ కవి (అష్టావధానం), పురుషోత్తమచౌదరి (తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు), స్వాతీసోమనాథ్ (కూచిపూడి కళాకారిణి), వడ్డాది పాపయ్య (చిత్రకారులు), దూసి బెనర్జీభాగవతార్ (హరికథ), యడ్ల గోపాలరావు (నాటకకళాకారులు), మిమిక్రీ శ్రీనివాస్ (ధ్వన్యానుకరణ), లోకనాథం నందికేశ్వరరావు (ధ్వన్యానుకరణ), శ్రీపాద పినాకపాణి (కర్ణాటక శాస్త్రీయ సంగీతం), తుమరాడ సంగమేశ్వరశాస్త్రి (వీణా విద్వాంసులు), భాస్కరభట్ల రవికుమార్ (గేయ రచయిత), ఆర్పీ పట్నాయక్ (సంగీత దర్శకులు), జి.ఆనంద్ (సినీ సంగీత దర్శకులు), పింగళి నాగేంద్రరావు (సంగీత దర్శకులు), కొండవలస లక్ష్మణరావు (సినీ నటులు), జెవి సోమయాజులు (సినీ నటులు), రమణమూర్తి (సినీ నటులు), షకలక శంకర్ (జబర్దస్త్ ఫేమ్ హాస్యనటుడు) మొదలైన వారు శ్రీకాకుళం వాసులే.


రాజకీయాలలో శ్రీకాకుళం :

 శ్రీకాకుళం అనగానే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చే పేరు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న. 1947 నుండి 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆయనే ప్రధాన ప్రతిపక్షం. ఈయన సోంపేట వాసి. అలాగే వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్య సమాజ్ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసిన స్వామి అగ్నివేశ్ కూడా సిక్కోలు వాసే.

తెల్లబంగారానికి శ్రీకాకుళమే కేంద్రం :

 శ్రీకాకుళంలోని పలాస ప్రాంతం తెల్లబంగారంగా పేరుగాంచిన జీడిపప్పు పంపిణీ కేంద్రాలకు ప్రసిద్ధి గాంచింది. 1930ల్లో అండమాన్ నుండి మల్లా జనార్థన్ అనే వ్యాపారి వచ్చి తొలుత ఇక్కడ జీడపప్పు ఉత్పత్తిని ప్రారంభించారు. తర్వాత 1950లలో ఏకంగా ఈ ప్రాంతంలో జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘమే ఆవిర్భవించింది. దాదాపు 50 వేల కుటుంబాలు ఇదే వ్యాపారాన్ని నమ్ముకొని ఉన్నాయి. పలాస, మందస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, కవిటి , టెక్కలి, సోంపేట, పాలకొండ, కోటబొమ్మాళి, నందిగాం లాంటి ప్రాంతాలు జీడిపప్పు పంపిణీకి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడి నుండి జీడిపప్పు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంది.


ఖాదీ వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ పొందూరు :

శ్రీకాకుళంలోని పొందూరు ఖాదీ వస్త్రాల ఉత్పత్తికి పేరుగాంచిన అంతర్జాతీయ కేంద్రమని చెప్పుకోవచ్చు. మన దేశం మొత్తంలో పొందూరులో మాత్రమే కొండపత్తిని ఉపయోగించి ఖాదీ వస్త్రాలను తయారుచేస్తున్నారు. 1921 లో మహాత్మగాంధీ పొందూరు ఖాదీ వస్త్రాలను పరిశీలించారు. ఇవి కేవలం చేతి వడుకు నూలుతో చేసిన వస్త్రాలని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఇవి ఎలా తయారుచేస్తున్నారో తెలుసుకొని చెప్పమని తన కుమారుడు దేవదాస్ గాంధీని పురమాయించారు. దేవదాస్ అప్పుడు స్వయంగా తన పరిశోధనలలో భాగంగా, పొందూరు, బొంతలకోడూరు లాంటి శ్రీకాకుళం ప్రాంతాలను సందర్శించారు. ఆనాటి మన దేశ రాష్ట్రపతి సర్వేపల్లి వారి దగ్గర నుండి మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వరకూ అందరూ పొందురూ ఖాదీ వస్త్రాలను ధరించినవారే.


క్రీడలలో దేశానికి ఆదర్శం :

ప్రముఖ మల్లయోధుడు కోడి రామమూర్తి నాయుడు, ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో మన దేశానికి కాంస్య పతకాన్ని అందించిన కరణం మల్లీశ్వరి లాంటి గొప్ప క్రీడాకారులను అందించిన మహత్తరమైన నేల శ్రీకాకుళం.

Post a Comment

0 Comments