మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానా : : వైద్య ఆరోగ్య శాఖ తాజా ఉత్తర్వులు
దుకాణాలకు రూ.25 వేల వరకు విధింపు
వివాహాలకు 500 మంది దాకా హాజరుకావొచ్చు
కొవిడ్-19 నిబంధనల అమలును మరోమారు తప్పనిసరిచేస్తూ వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తారు. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల్లో మాస్కులు ధరించని వారు కనిపిస్తే వాటి యజమానులకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు. అలాగే..ఒకటి, రెండురోజులపాటు దుకాణాలు మూసివేసేలా అధికారులు నిర్ణయాలు తీసుకోవచ్చని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్కెట్ అసోసియేషన్స్ ప్రజల్లో కొవిడ్-19 నిబంధనల ప్రాధాన్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు.
ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయెచ్చు :
వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో గరిష్ఠంగా 500 మంది వరకు హాజరుకావొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే..మాస్కులు ధరించాలని, శానిటైజర్తో చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇతర కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంచేశారు. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే కేసులు నమోదు చేస్తారు. కరోనా నిబంధనల ఉల్లంఘనపై 8010968295 (వాట్సప్) నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా అధికారులకు ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు.
0 Comments