నడక వీరుడు - పతకాల రాయుడు
ఆయనో ఉపాధ్యాయుడు. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా ఏదైనా సాధించాలనే తపనతో ‘నడక’ను ఓ మార్గంగా ఎంచుకున్నారు. నిరంతర సాధనతో ఏకంగా అంతర్జాతీయ పోటీల్లో పతాకలు సాధించి ఔరా అనిపించుకున్నారు. ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 100కి పైగా పతకాలు సొంతం చేసుకున్నారు. ఆయనే లావేరు ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు సంజీవి నళినీసుధాకర్.
ప్రేరణ ఇలా : పాతపట్నం మండలం రోమదళ గ్రామానికి చెందిన సుధాకర్ 1996 శ్రీకాకుళం సూర్యవాకర్స్ క్లబ్లో సభ్యుడిగా ఉంటూ పలు పోటీల్లో పాల్గొనేవారు. నాటినుంచి అనేక పోటీల్లో పాల్గొని సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశారు. 2021 నవంబరు నెలలో నాసిక్లో జరిగిన జాతీయ స్థాయి 3 కి.మీ. పరుగులో బంగారు, 5 కి.మీ.లో రజత పతకాలు సాధించారు. విశాఖలో జరిగిన 3 కి.మీ. రాష్ట్రస్థాయి పోటీలో బంగారు పతకం సాధించారు. 2020లో విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో 5 కి.మీ. విభాగంలో రజత, 1500 మీటర్లలో కాంస్య పతకం సాధించారు. 2018 ఫిబ్రవరి 20-25 వరకు బెంగళూరులో జరిగిన జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పొల్గొని 10 కి.మీ. విభాగంలో బంగారు పతకం సాధించారు. నడక తనకు గుర్తింపుతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడిందని సుధాకర్ చెబుతున్నారు
0 Comments