GET MORE DETAILS

కొలువు పిలుస్తోంది! పెరుగుతున్న ప్రాంగణ నియామకాలు _ కరోనా తర్వాత కొత్త సందడి

కొలువు పిలుస్తోంది! పెరుగుతున్న ప్రాంగణ నియామకాలు _ కరోనా తర్వాత కొత్త సందడి



నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో మెగా జాబ్‌మేళా... 20 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 20వేల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకుంటే హాజరైంది 7500 మంది. అందులో 2 వేల మందికి కొలువులు దక్కాయి.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చార్మినార్‌లో జాబ్‌ మేళా నిర్వహించగా 2వేల మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. 300 మందికి కొలువులు దక్కాయి.

 కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే కొలువుల జాతర ఊపందుకుంది. ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు వరసకట్టి భర్తీ ప్రక్రియపై దృష్టి పెట్టాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా మార్కులు కీలకం కానేకాదని నియామక సంస్థలు చెబుతున్నాయి. ఉద్యోగాల కోసం వచ్చిన యువతలో నైపుణ్యాలను అంచనా వేసి ఎంచుకుంటున్నాయి. కానీ జాబ్‌ మేళాలకు వస్తున్న యువతీయువకులు సరైన నైపుణ్యాలు లేక కొలువుల వేటలో వెనకబడుతున్నారు. ఈ సమయంలో యువతకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? నియామక సంస్థలు ఏం కోరుకుంటున్నాయి? ఏయే ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి? వాటిని అందిపుచ్చుకోవడమెలాగో తెలుసుకుందాం.

నైపుణ్యం, అనుభవం ఉంటే ఎక్కువ వేతనం : 

ఎక్కువగా బీపీవో, ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మా, డయాగ్నొస్టిక్‌, మార్కెటింగ్‌ వంటి కొలువులు ఉంటున్నాయి. విప్రో, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు వస్తున్నాయి. అనుభవం ఉంటే రూ.10 లక్షల వరకు ప్యాకేజీ ఇస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు రూ.4.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.   నేపథ్యంలో ఫ్రెషర్స్‌కు విడిగా, పని అనుభవం ఉన్న వారిని వేర్వేరుగా ఎంపిక చేస్తున్నారు.

* పదో తరగతి నుంచి పీజీ వరకు అన్ని రకాల కొలువులు ఉంటున్నాయి. ఏ ఉద్యోగానికి తగ్గట్టు ఆ మేరకు ప్యాకేజీ ఇస్తుంటారు.

* పదో తరగతి, పాలిటెక్నిక్‌ ప్రాతిపదికన ఎంపిక చేసే ఉద్యోగాలకు స్పందన తక్కువగా ఉంటోంది. వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు వంటి కొలువులే చూపిస్తున్నారు. నెలకు రూ.10-రూ.12 వేలు ఇస్తుండడంతో నిరుద్యోగులూ ఆసక్తి చూపడం లేదు. రెండు రోజుల క్రితం మాసబ్‌ట్యాంకులోని పాలిటెక్నిక్‌లో జాబ్‌మేళాలో ఈ తరహా 3వేల ఖాళీలు చూపించగా స్పందన కొరవడిదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఏయే నైపుణ్యాలు అవసరం...

ఉద్యోగాలను బట్టి రాత పరీక్ష, బృంద చర్చలు, ముఖాముఖి ఆధారంగా తీసుకుంటున్నారు. కంపెనీలు, నియామక సంస్థలు ఈ నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నాయి.  

* విషయాన్ని సూటిగా వ్యక్తీకరించాలి

‌* బాడీ లాంగ్వేజీ కీలకం

‌* స్పోకెన్‌ ఇంగ్లిష్‌‌

* ఏదైనా సబ్జెక్టు ఇస్తే కచ్చితమైన సమాచారంతో మాట్లాడాలి

‌* సబ్జెక్టులలో ప్రాథమికాంశాలపై పట్టుండాలి.

‌‌* ఐటీ పరంగా కోడింగ్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌ తెలుసుకోవాలి.

భావవ్యక్తీకరణ ముఖ్యం : 

ఏ ఉద్యోగానికైనా భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ముఖ్యం. ఉద్యోగ మేళాలు జరిగే తక్కువ సమయంలోనే తమకు అవసరమైన ఉద్యోగులను ఎంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటప్పుడు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, సబ్జెక్టులో ప్రాథమికాంశాలపై పట్టు ఎంతో ముఖ్యం.

- జె.సురేశ్‌కుమార్‌, యూఐఐసీ ఉపసంచాలకుడు, జేఎన్‌టీయూ

వ్యత్యాసం ఎంతో ఉంది : 

ప్రస్తుతం మన అకడమిక్స్‌, నైపుణ్యాలు, ఉద్యోగ అవసరాలు, పరిశ్రమల అవసరాలకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. అన్నిటి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పరిశ్రమలకు ఏం కావాలో విద్యార్థులకు తెలియడం లేదు. తరగతి గదిలో అభ్యసనకే పరిమితమవుతున్నారు. ఈ విషయంలో మన వ్యవస్థలోనే మార్పు రావాలి. వీటిని అనుసంధానం చేసుకోగలిగితే ఉద్యోగాలు పొందే వీలుంటుంది.

- సుభద్రరాణి, నిపుణ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు

మల్టీ స్కిల్స్‌ ఉన్న వారికి ప్రాధాన్యం : 

ఉద్యోగ మేళాల్లో కొలువుల స్వరూపాన్ని బట్టి ఎంపిక నడుస్తుంది. మల్టీ స్కిల్స్‌ ఉన్న యువతకు కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అదనపు నైపుణ్యాలు సాధిస్తే సులువుగా కొలువు పొందే వీలుంది. ఐటీ రంగంలో కొలువు దక్కాలంటే సైబర్‌ సెక్యూరిటీలోనూ పట్టుండాలి.

- ఎం.సత్యనారాయణ, తెలంగాణ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్


Post a Comment

0 Comments