GET MORE DETAILS

రాష్ట్రంలో మూడో వేవ్...‌? నాలుగు రోజులుగా పాజిటివ్‌లు పైపైకి _ 334 కొత్త కేసులు.. 2 నెలల్లో అత్యధికం

 రాష్ట్రంలో మూడో వేవ్...‌? నాలుగు రోజులుగా పాజిటివ్‌లు పైపైకి _ 334 కొత్త కేసులు.. 2 నెలల్లో అత్యధికం



ఒక శాతంపైగా నమోదైన పాజిటివిటీ రేటు

థర్డ్‌ వేవ్‌కు సంకేతమేనంటున్న నిపుణులు

రాష్ట్రంలో కొత్తగా 7 ఒమైక్రాన్‌ కేసులు


రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం మొదలైందా..? థర్డ్‌ వేవ్‌ సంకేతాలు కనిపిస్తున్నాయా..? మూడో ముప్పు ముంచుకొస్తుందా..? విదేశాల్లో మహమ్మారి విజృంభిస్తున్న తీరు.. వారం రోజులుగా దేశంలో కరోనా, ఒమైక్రాన్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న వైనం.. రాష్ట్రంలోనూ నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసుల లెక్క చూస్తుంటే... అవుననే అనిపిస్తోంది! గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,311 శాంపిల్స్‌ను పరీక్షించగా 334 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో వెల్లడించింది. పాజిటివిటీ రేటు 1.17శాతంగా నమోదైంది. పాజిటివిటీ రేటు 1 శాతం దాటడం గత రెండు నెలల్లో ఇదే తొలిసారి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిసెంబరు 30న యాక్టివ్‌ కేసులు 1,081 ఉంటే.. 31న 1,154, జనవరి 1న 1,227, 2న 1,260, 3న 1,278కి పెరిగాయి. మంగళవారం ఈ సంఖ్య ఏకంగా 1,516కి చేరుకుంది.

తొలి రెండు విడతల్లో చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవగా.. ఈసారి విశాఖపట్నంలో కరోనా ప్రభావం చూపిస్తోంది. నాలుగు రోజులుగా అత్యధిక కేసులు విశాఖలోనే నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఈ జిల్లాలో 80 కేసులు బయటపడ్డాయి. థర్డ్‌ వేవ్‌లో విశాఖతోపాటు చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కొవిడ్‌ ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కేసుల పెరుగుదల థర్డ్‌ వేవ్‌కు సంకేతమా, కాదా అన్నదానిపై ఆరోగ్యశాఖ సృష్టత ఇవ్వాల్సి ఉంది. ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌ చూస్తే థర్డ్‌వేవ్‌ సంకేతాలు కనిపిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 334 కేసులు వెలుగులోకొచ్చాయి. అత్యధికంగా విశాఖలో 80 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 55, కృష్ణాలో 50, గుంటూరులో 39 మందికి వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,77,942కి పెరిగింది. గత 24 గంటల్లో 95 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు.

కొత్తవలసలో 19 మంది విద్యార్థులకు కరోనా :

విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో ఒకేరోజు 20 కరోనా కేసులు బయటపడ్డాయి. సోమవారం ఆ పాఠశాలలో 120 మందికి పరీక్షలు నిర్వహించగా.. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 19 మంది విద్యార్థులతోపాటు, ఒక ఉపాధ్యాయునికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో పాఠశాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా మరో 65 మందికి పరీక్షలు చేశారు. విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి కొవిడ్‌ వైరస్‌ సోకింది. మంగళవారం ఆయన కలెక్టర్‌ నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు.

తెలంగాణలో ఒక్క రోజే 1,052 కొవిడ్‌ కేసులు :

తెలంగాణలో కరోనా కేసులు అమాంతం పెరిగాయి. కొత్త పాజిటివ్‌లు వెయ్యి దాటాయి. హైదరాబాద్‌లో వైరస్‌ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం 42,991 మందికి పరీక్షలు చేయగా 1,052 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

Post a Comment

0 Comments