రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో హీట్వేవ్స్ : ఐఎండీ హెచ్చరిక
రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, విదర్భ, ఒరిస్సా, కొంకణ్ ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. గత మూడు రోజులుగా దేశంలో వేడిగాలులతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగాయి. గత మూడు రోజులుగా మధ్య భారతదేశంలోని దక్షిణ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్, కొంకణ్ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. మధ్యభాగంలో గుజరాత్-రాజస్థాన్, ఒరిస్సా వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయని, గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు మహపాత్ర తెలిపారు.
ఖడాంతర గాలులే కారణం...
మార్చి నెలలో మధ్య భారతంలో హీట్వేవ్స్కు దక్షిణ ఖడాంతర గాలి కారణమని ఆయన తెలిపారు. పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. గత రెండు రోజులుగా సౌరాష్ట్ర, కచ్, కొంకణ్, పశ్చిమ రాజస్థాన్లో తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులను వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. దేశవ్యాప్తంగా హీట్వేవ్ పరిస్థితులపై వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, ముంబయిలో ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల్లో కేరళ, మహేలలో తేలికపాటి వర్షం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 17-19 మధ్య దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదుగా, 18-19 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ మీదుగా నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని మంగళవారం వాతావరణ శాఖ అంచనా వేసింది.
వడగాలుల నుంచి రక్షించుకోండి...
తెలుగు రాష్ట్రలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా శిశువులు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని వాతావరణ పేర్కొంది. ఎక్కువ సేపు ఎండలో ఉంటే.. ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని, వేడిగాలుల కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఎండదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని, దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలని చెప్పింది. తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని, బయటకు వెళ్లే సమయంలో తలకు టోపీ ధరించాలని లేదంటే గొడుగైనా తీసుకెళ్లాలని సూచించింది. ఓఆర్ఎస్ లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న లస్సీ, నిమ్మరసం, మజ్జిగ వంటి పానియాలను తీసుకోవాలని చెప్పింది.
0 Comments