GET MORE DETAILS

కార్తీక పురాణం - 11 వ అధ్యాయం

కార్తీక పురాణం - 11 వ అధ్యాయం



● మంథరుడు - పురాణ మహిమ

ఓ జనక మహారాజా ! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా , చేయించినా , వినినా , వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకింపుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు , మద్య మాంసాది పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప , ధీపారాదనాదికములను ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి , గుణవంతురాలు , శాంతమంతురాలు , భర్త యెంత దుర్మార్గుడయిననూ , పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు , పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ , దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము , వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు భాద పడుచుండిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్ళుకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి " స్వామి ! నేను దీనురాలను , నాకు భర్త గాని , సంతతిగానిలేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను , కాన , నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు , ఆచారమునకు ఆ ఋషి సంతసించి

"అమ్మా ! ఈ దినము కార్తిక పౌర్ణమి , చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నీవు ప్రమిదను , వత్తి ని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే అందుకామె సంతోసించి , వెంటనే దేవాలయమునకు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల "ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు  పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుటచేత విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాదపడుచున్న తన భర్త ను జూచి" ఓ విష్ణుదూత లారా ! నా భర్త మరి ముగ్గురును యీ నరక  బాధపడుచున్నారు . కాన , నాయందు దయయుంచి వానిని వుద్దరింపు "డని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు "అమ్మా ! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు  అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము , మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచున్నారు. "అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా ! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా , అందులకా దూతలు "అమ్మా ! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు , ప్రమిదఫలము కిరాతకునకు , పురాణము వినుటవలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు" నని  చెప్పుగా అందులకామె అట్లే ధార పోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున , ఓరాజా ! కార్తీకమాసమున పురాణము వినుటవలన , దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా ? అని వశిష్టులవారు నుడివిరి.


ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి పదకొండవరోజు  పారాయణము సమాప్తము.

Post a Comment

0 Comments