GET MORE DETAILS

కార్తీక పురాణం -12 వ అధ్యాయము

కార్తీక పురాణం -12 వ అధ్యాయము





● ద్వాదశి ప్రశంస

● సాలగ్రామ దానమహిమ


"మహారాజా ! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి , సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను" మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.

కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి , సాయంకాలము శివాలయమునకు గాని , విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి , నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక , మోక్షము కూడా పొందుదురు.

కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున , పూర్ణోపవాసముండి ఆ రాత్రి  విష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి , శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన , కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక , కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి , ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి , దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున , కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని , సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము

సాలగ్రామ దానమహిమ : 

పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు , తాననుభవించక , యితరులకు బెట్టక , బీదలకు దానధర్మములు చేయక , ఏల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవిగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక "పరులద్రవ్యము నెటుల అపహరింతునా !" యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.

అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు "అయ్యా ! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా , మీ ఋణము తీర్చుకోగలను" అని సవినయముగా వేడుకోనెను. ఆ మాటలకు కోమటి మండిపడి "అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీ కంఠమును నరికి వేయుదును" అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి , అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక , అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.

ఆ  వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు , నీడకొరకై చెట్లు నాటించుచు , నూతులు , చెరవులు త్రవ్వించుచు , సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి , త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి , విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి , చేతులు జోడించి "మహానుభావా ! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ   నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు" అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవిరా ! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రితికరమైన దినము. అరోజున స్నాన , దాన , జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా , జారుడైనా , చోరుడైన , పతివ్రతమైనా , వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి , సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ , ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము" అని చెప్పెను.  అంతట దర్మవిరుడు " నారద మునివర్యా ! నేను గోదానము , భూదానము , హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని , అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునా   యని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా ! దాహంగొన్న వానికి దాహం తీరునా ? కాక , యెందులకీ దానము చేయవలయును ? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల" నని నిష్కర్షగా పలికెను.

ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా ! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని , యీ దానముతప్ప మరొక మార్గము లేదు"అని చెప్పి నారదుడు వెడలిపోయాను.

ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు , దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి , మరి మూడు జన్మలందు వానరమై పుట్టి , ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి , పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి , పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టి  ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.

చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగేనా యని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి "నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక" యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయి  ఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం , జన్మాంతరమున స్వర్గమున కెగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.

కావున , ఓ జనకా ! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.


ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము పన్నెండోవ రోజు పారాయణము సమాప్తము.


🙏🕉️🕉️🙏

Post a Comment

0 Comments