GET MORE DETAILS

కార్తీకపురాణం - 18 వ అధ్యాయము

 కార్తీకపురాణం - 18 వ అధ్యాయము



● సత్కర్మానుష్టాన ఫల ప్రభావము

"ఓ మునిచంద్రా ! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే , నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా , తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా ! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా ! అట్టి ! నేనెక్కడ ! మీ దర్శన భాగ్యమెక్కడ ! నాకు సద్గతి యెక్కడ ? పూణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీకమాసమెక్కడ ! పాపాత్ముడనగు నేనెక్కడ ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ ? ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన , నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో , దాని ఫలమెట్టిదో విశదీకరింపు" డని ప్రార్ధించెను.

"ఓ ధనలోభా ! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి ఉపయోగార్ధమైనట్టివి కాన , వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని , సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే , జాతివాడో , ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక , సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను , మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా ఈ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము  చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు , స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము , వేదములతో సరితూగు శాస్త్రము , గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు , బ్రాహ్మణులకు సమానమైన జాతీయు , భార్యతో సరితూగు సుఖమునూ , ధర్మముతో సమానమైన మిత్రుడనూ , శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

"ఓ మునిశ్రేష్టా ! చతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ! ఏ కారణం చేత దానిని నాచరించవలెను ? ఇదివరకెవ్వరయిన ఈ వ్రతమును ఆచరించియున్నారా ? ఆ వ్రతము యొక్క ఫలితమేమి ? విధానమెట్టిది ? సవివరంగా విశదికరింపు" డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

"ఓయీ ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు , కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు , ఈ వ్రతమునకు , చతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన , దాన , జప , తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన , ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".

తొలి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత , వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును , చతుర్బాహుండును , కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా ! నీవు క్షేమమే గదా ! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా ? మానవులందరికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ? ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా ! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు , అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా , మరి కొందరు అహంకార సహితులుగా , పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి  రక్షింపు" మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి , ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు , పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు "ఈ ముసలి వానితో మనకేమి పని" అని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా ?" అని అలోచించుచు , ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ , చక్ర , గదా , పద్మ , కౌస్తుభ , వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి , లక్ష్మి దేవితోడను , భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!

విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |

లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!

వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||

శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం

దాసి భూత సమస్త దేవా వనితాం లోకైకదీపంకురాం |

శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||


ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.

Post a Comment

0 Comments