GET MORE DETAILS

కార్తీక పురాణం - 25 వ అధ్యాయము

కార్తీక పురాణం - 25 వ అధ్యాయము



● దూర్వాసుడు అంబరీషుని శపించుట

"అంబరీషా ! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ అనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా ! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న , విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును ? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన , జలపాన మొనరించి వూరకుందును"అని వారి ఏదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా ! నన్ను భోజనానికి రమ్మని , నేను రాకనే నీవేల భుజించితివి ? ఎంత దుర్మార్గము , ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి ? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన , నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు ?   శ్రీ హరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా ! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా ! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు , ముని కోపమునకు గడ గడ వణుకుచు , ముకుళిత హస్తములతో  "మహానుభావా ! నేను ధర్మహీనుడను , నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ , దయా దాక్షిణ్యములు గలవారూ కాన , నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను , రెండవ జన్మలో తాబేలుగానూ , మూడవజన్మలో పందిగాను , నాలుగవ జన్మలో సింహముగాను , ఐదవ జన్మలో వామనుడు గాను , ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను , ఎ ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను , ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను , తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను , పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక"* అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా , శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని , తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా ! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా , శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" అని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను , దేవలోకమునకు వెళ్లి దేవేంద్రుని , బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని , కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ ఎంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 


ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.

Post a Comment

0 Comments