GET MORE DETAILS

మూఢనమ్మకాల్ని ఛేదించి, మశూచికానికి వ్యాక్సిన్‌ కనుగొన్న ఎడ్వర్డ్‌ జెన్నర్‌

మూఢనమ్మకాల్ని ఛేదించి, మశూచికానికి వ్యాక్సిన్‌ కనుగొన్న ఎడ్వర్డ్‌ జెన్నర్‌



''మశూచికాన్ని చూపించండి. వెయ్యి రూపాయలు గెలుచుకోండి'' అనే నినాదంతో పట్టణాలలో, పల్లెటూళ్ళలో దేశమంతా 25, 30సంవత్సరాల క్రితం ప్రభుత్వం గోడలపై వ్రాసి ప్రచారం చేసింది. కాని 10వేలు ఖర్చుపెట్టినా ఏ వ్యక్తికీ మశూచికం వచ్చిందని ప్రజలు నిరూపించలేకపోయారు. ఎందుకంటే మశూచికం మనదేశంలో తగ్గిపో యిందని ప్రభుత్వానికి రూఢిగా తెలుసు. కాని వేలాది సంవత్సరాలు లక్షలాది మంది మశూచికం వల్ల జబ్బుపడి వేలాది మంది మరణించారు. దాదాపు 2వేల సంవత్సరాలు నుంచి మశూచికం ఒక ప్రాణాంతకమైన జబ్బు అని గుర్తించి దాని నివారణకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ జబ్బు ఎలా వస్తుందో ప్రజలకు అవగాహన లేదు. 

పర్షియాలో వైద్యులు రాజన్‌ క్రీ.శ.100 సంవత్సరంలో మశూచికం గురించి పేర్కొన్నాడు. క్రీ.శ.570 యూరప్‌లో మశూచికం వునికి గుర్తించారు.17వ శతాబ్దంలో యూరప్‌లో ఇది తీవ్రతరం అయింది. సిఫిలిస్‌ జబ్బుకు, మశూచికి తేడాను చాలాకాలం గుర్తించలేకపోయారు. అందుకే సిఫిలిస్‌ను గ్రేట్‌ఫాక్స్‌ అని, మశూచికాన్ని స్మాల్‌ ఫాక్స్‌అని అనేవారు.అట్లమ్మ(పొంగు)కి, మశూచికి తేడాను 18వ శతాబ్దంలో గుర్తించారు. మనదేశంలో మశూచికం వల్ల లక్షలాదిమంది మరణించారు. 1944లో మనదేశంలో 74.178 మశూచికం కేసులు వస్తే, వారిలో 17,743మంది చనిపోయారు. మశూచికం మచ్చలు జీవితాంతం ఆ వ్యాధి సోకినవారి మొహాలపై ఉండిపోయేవి. 

స్వాతంత్య్రానంతరమే మనదేశంలో ఈ మశూచి వ్యాధిని వ్యాక్సినేషన్‌ ద్వారా పూర్తిగా అరికట్టడం సాధ్యమైంది. అయితే మనదేశంలో మూఢన మ్మకాలు అధికంగా ఉండడంతో వ్యాక్సినేషన్‌ చేయించుకోవడానికి చాలా వ్యతిరేకత ఉండేది. పెద్ద అమ్మవారు, చిన్న అమ్మవారు అంటూ వ్యాక్సినేషన్‌ చేయించుకోకుండా భీష్మించుకుని కూర్చునేవారు. ఆరోగ్య విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ గ్రామీణ ప్రాంతా లలో కొన్ని మూఢ నమ్మకాలు తగ్గడానికి మార్గం సుగమం అయింది. విద్యా, విజ్ఞా నం పెరిగిన తరు వాతనే మశూ చికం వచ్చినప్పుడు జాత రలు, కొలువులు అని కూర్చోకుండా 20వ శతాబ్దం ఉత్తరార్థంలో ప్రజలు స్వచ్ఛందంగా మశూ చికం టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడం ప్రారంభించారు.

మౌఢ్యంపై సైన్స్‌ విజయానికి, మశూచిని అంతమొందించడానికి మార్గం సుగమం చేసిన మహనీయుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌. 1749లో ఇంగ్లండులోని గ్లౌచెస్టర్‌లో జన్మించాడు. వైద్య విద్యనభ్యసించి మశూచి నిరోధక టీకాల మీద పరిశోధన చేసి, తన కుమారుని మీదే ప్రయోగించి విజయం సాధించిన ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. జెన్నర్‌ సాధించిన విజయం వైద్యశాస్త్ర చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించింది. మహారాజుల నుండి సామాన్యుల వరకు జన్నర్‌ కనుగొన్న శాస్త్రీయమైన పద్ధతిని అంగీకరించి, మశూచి వ్యాధి నుండి విముక్తి చెందారు. ఈ విధంగా జెన్నర్‌ శాస్త్రీయమైన వైద్య విజ్ఞానంతో మానవజాతికి మహోపకారం చేశాడు. చిన్న విషయాలలోనే పెద్ద అర్థాలు ఉంటాయి. ఇంగ్లండులో మశూచికం వచ్చినపుడు జెన్నర్‌ కుటుంబానికి పాలు పోసే అమ్మాయి తనకు మశూచి రాదని జెన్న ర్‌తో గర్వంగా చెప్పింది.''నా ఆవు లకు మశూచికం వచ్చింది. నేను పాలు పితుకుతూవుంటే నా చేతికి ఉన్న గాయా నికి ఆవుపుండ్ల రసి తగిలింది. అందుచేత నాకు మశూచికం రాదు'' అని ఆమ్మాయి చెప్పిన మాట జెన్నర్‌ తీవ్రంగా మశూ చికంపై పరిశోధన చేయడానికి దారి చూపింది. ఎన్నో దేశాల నుంచి వివ రాలు సేకరించి మశూచికి వ్యాక్సిన్‌ కనుగొన్నాడు.

తన పరిశోధన ఫలితంగా ఆవుదూడలకు మశూచికం వస్తే, వాటి నుండి మశూచి వ్యాధి క్రిములను తీసి, కొద్ది మోతాదులో టీకాగా మనుషులకు వేస్తే మనిషిలో మశూచిక నిరోధన శక్తి పెరుగుతుందని జన్నర్‌ కనుగొన్నాడు. తాను కనుగొన్న విషయాలను జెన్నర్‌ సవివరంగా ఒక పరిశోధనా వ్యాసంగా వ్రాసి, ఇంగ్లండులో రాయల్‌ సొసైటీకి పంపిస్తే, దానిని రాయల్‌ సొసైటీ పెద్దలు అసలు పట్టించుకోలేదు. వైద్యులు అతనిని ఎగతాళి చేశారు. అయినా జెన్నర్‌ నిరాశ చెందలేదు. అంతకు ముందు టర్కీ రాయబారి భార్య మశూచికంపై చెప్పిన విషయాలను కూడా 18వ శతాబ్దం ప్రారంభంలో రాయల్‌ సొసైటీ పట్టించుకోలేదు. అతి చిన్న సూక్ష్మక్రిమి ఏవిధంగా మశూచికి కారణం అవుతుందో, వాక్సినేషన్‌ ద్వారా మశూచిని ఎలా నివారించవచ్చో జెన్నర్‌ చారిత్రక, శాస్త్రీయ ఆధారాలతో తన పరిశోధనా ఫలితాలు పట్టుదలతో, దీక్షతో శాస్త్రజ్ఞుల ముందు ఉంచాడు. 1798లో ఎంతోమంది జెన్నర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా 1800సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది అతని మాటవిని మశూచికం టీకాలు వేయించుకొని రక్షింపబడ్డారు. అమెరికా హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలు, థామస్‌, జఫర్‌సన్‌ జెన్నర్‌కు అండగా నిలిచారు. మనిషికి ఆవులోని మశూచికపు క్రిములు ఎక్కిస్తే మనిషి పశువైపోతాడని, ఆవులాగా అరుస్తాడని, ఎద్దులాగా మనిషికి కొమ్ములు వస్తాయని కట్టు కథలు ప్రచారం చేశారు.

 క్రైస్తవ మత గురువులు కూడా జెన్నర్‌ను దుమ్మెత్తిపోశారు. ''పాపం చేసిన మనిషిని శిక్షించడానికి దేవుడు మశూచికం వ్యాధిని పంపుతాడు. దేవుడు విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. జెన్నర్‌ది దైవధిక్కారం అని మతగురువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా జెన్నర్‌ చెప్పింది, చేసింది దాచేస్తే దాగని సత్యం. మత మౌఢ్యాన్ని వదిలి దేశదేశాలలో ప్రజలు మశూచి వ్యాక్సిన్‌ను చేయించుకోవడం ప్రారంభించారు. దానితో వైద్యశాస్త్రంపై మతగురువులో పెత్తనం మంచులాగా కరిగిపో యింది. మతంకాదు. సైన్స్‌ కావాలి అని, సైన్సే ప్రాణాల్ని రక్షిస్తుందని ప్రజలు స్పష్టంగా 20వ శతాబ్దం ఉత్తరార్థంలో గుర్తించారు. ఈరోజున వైద్యానికి, మల్టీనేషనల్‌ కంపెనీల చేతిలో మందులు ఉండడం వల్ల, అవి ప్రజారోగ్యం కంటే లాభానికే ప్రాధాన్యత యివ్వడం వల్ల ఇంకా ఎన్నో అంటువ్యాధులు నేటికీ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. వైద్యం పేదలందరికీ అందుబా టులోకి వస్తే, మశూచికం లాగానే ఎన్నో అంటు వ్యాధుల నుండి మానవజాతి విముక్తి చెందుతుంది, అనడంలో సందేహంలేదు. సామాజిక దృష్టి, శాస్త్రీయ దృక్పధం ప్రబలితే 'ప్రజలందరికీ ఆరోగ్యం' అనే నినాదంతో ముందుకు సాగితే, మానవ కల్యాణం సులభసాధ్యం అవుతుంది. 1749లో జన్మించి 1823లో మరణించిన జెన్నర్‌ మానవజాతికి యిచ్చే సందేశం అదే.

Post a Comment

0 Comments