GET MORE DETAILS

జ్యేష్ఠ శుధ్ధ తదియ - రంభా తృతీయ - సౌభాగ్యాన్నిచ్చే రంభా వ్రతం

జ్యేష్ఠ శుధ్ధ తదియ - రంభా తృతీయ - సౌభాగ్యాన్నిచ్చే రంభా వ్రతం




హిందువుల పంచాంగంలో చైత్ర , వైశాఖాల తర్వాత వచ్చే జ్యేష్ఠం మూడవది. ప్రతి నెలకి దానిదైన ప్రత్యేకత ఉంటుంది. జ్యేష్ఠంలో ముఖ్యమైన పండుగలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ‘జ్యేష్ఠ శుధ్ధ తదియ’. దీనిని పంచాంగ కర్తలు ‘రంభా తృతీయ’ , ‘రంభా వ్రతం’ అని అంటుంటారు. స్మృతి కౌస్తుభం , పురుషార్థ చింతామణి మొదలైన గ్రంథాలలో దీని ప్రస్తావనను రంభా తృతీయ అని కనుపిస్తుంది.

చాలామందికి అసలు ఈ రంభా వ్రతం అంటే తెలియదు. ఎలా చేస్తారు ? ఎందుకు చేస్తారు ? అన్నది ధర్మ సందేహమే ! చాలామందికి పెద్ద పెద్ద పండుగల గురించి తెలిసినట్టుగా ఈ రంభా వ్రతం గురించి అసలు తెలియకపోవచ్చు. చాలా తక్కువమందికే పరిచితమైన రంభా వ్రతం గురించి తెలిసిఉండవచ్చు.

రంభ అనగానే అప్సరస అనుకుంటారు చాలా మంది. కాని అరటి చెట్టు కు మరో పేరు రంభ. కనుక రంభా వ్రతం అనగానే రంభ అనే అప్సరను పూజించడడం అనుకోవడం సరికాదు. దైవ అంశతో కూడిన అరటి చెట్టును పూజించడమే రంభా వ్రతం. మంచి భర్త కోసం , అన్యోన్యమైన దాంపత్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.

ఈ వ్రతానికి సంబంధించిన కథ ఈ విధంగా ఉంది.

తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి ఉపచారాలు చేయడానికి పార్వతి తండ్రి హిమవంతుడు తన కుమార్తెను నియమించాడు. ఆమెపైన శివునికి ప్రేమ కలిగించాలని ఆ సమయంలో మన్మధుడు తన మన్మధ బాణాలను సరాసరి శివునిపైనే ప్రయోగించటం చేత రుద్రునికి మనసు చెదిరింది. కోపం వచ్చిన రుద్రుడు ఆగ్రహం పట్టలేక తన మూడవ కన్ను తెరచి మన్మధుని చూచాడు. మన్మధుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పార్వతీదేవి చిన్న బుచ్చుకుని ఇంటికి రాగా ఆమెను తల్లి ఎదురెళ్లి కౌగలించుకుంది. కన్నీరు కార్చిన గిరిజని ఆమె తల్లి తన భర్త దగ్గరకి తీసుకెళ్లింది. అక్కడ హిమవంతుడు సప్త మహామునులతో కూర్చుని సంభాషిస్తున్నాడు. వారికి ఆయన తన కుమార్తె మనోరథం గురించి చెప్పగా.. అందులో ఒకరైన భృగువు , ‘అమ్మాయి ! ఒక వ్రతం ఉంది. అది నువ్వు చక్కగా ఆచరిస్తే ఆ పరమశివుడు నీకు భర్త అవుతాడు !’ అని చెప్పాడు. అందుకు సంతోషించిన పార్వతీదేవి అటులనే మహా మునీ దయతో ఆ వ్రతం ఎట్లా చేయాలో తెలుపవలెనని వినయంగా అడిగింది.

దానికా ముని సంతోషించి , ‘బిడ్డా ! ఆ వ్రతాన్ని పెద్దలు రంభావ్రతం అని అంటారు. అసలు ‘రంభ’ అనగా ‘అరటి చెట్టు’ అని అర్థం. ఆ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియనాడు చేస్తారు. ఆ రోజు ఉదయం తలారా స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి ముగ్గు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కనుక అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలని చెప్పాడు.

దానికి పార్వతీదేవి ‘మహాశయా ! సావిత్రీదేవి ఎలా అరటి చెట్టుకు అధిష్ఠాన దేవత అయింది’ ఆని ప్రశ్నించింది. దానికి భృగువు ‘సావిత్రి, గాయత్రి ఇద్దరూ బ్రహ్మదేవునికి భార్యలు. తన సౌందర్యం చూసుకుని గర్వంతో సావిత్రి తాను బ్రహ్మదేవుని వద్దకు వెళ్లటం మానుకుంది. గాయత్రిదేవి ఆమెకు చాలాసార్లు చెప్పి చూసింది. అయినా సావిత్రి వెళ్లలేదు. దానితో తీవ్రంగా కోపించిన బ్రహ్మ మానవలోకంలో బీజంలేని చెట్టుగా పుట్టు. ఈ లోకం వదిలిపో అని సావిత్రిని శపించాడు.

అంతట తన తప్పు అర్థం అయ్యి పశ్చాత్తాపం చెందిన సావిత్రి ‘బ్రహ్మ కాళ్ళ మీద పడి తనని మన్నించ’ మని ప్రార్ధించింది. కానీ బ్రహ్మకు ఆమె పై దయ కలుగలేదు. ఇక గత్యంతరంలేని సావిత్రి భూలోకానికి వెళ్లి , అరటి చెట్టుగా పుట్టింది. అక్కడ ఆమె ఐదు సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేసింది. అంతట బ్రహ్మ మనస్సు అప్పటికి కరిగింది. అంతట బ్రహ్మ సావిత్రి ముందు ప్రత్యక్షమైనాడు. ఆనాడు జ్యేష్ఠ శుద్ధ తదియ. ‘నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకొని ఉండు , అలా అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారి కోరికలు తీరుతాయి’ అని చెప్పి ‘ఇక నువ్వు నాతో మన సత్యలోకానికి రావచ్చు’ అంటూ ఆమెను తనతో తీసుకెళ్ళాడు. అలా సావిత్రికి శాపవిమోచనం అయిన రోజు కనుక ‘జ్యేష్ఠ శుద్ధ తదియ ఒక పండుగగా , పర్వదినంగా అయ్యింది.

అంతట గిరిపుత్రిక ‘స్వామీ ! అయితే ఈ వ్రతం సంపూర్ణంగా చేసే నియమాలు దయతో శలవియ్యండి’ అని కోరింది.

‘బిడ్డా ! పంచవన్నెల ముగ్గులు వేసిన అరటి చెట్టు కింద ముందు మంటపం వేయవలెను. దానిని రుచికరమైన పదార్ధాలతో నివేదన పెట్టాలి. ఆ అరటి చెట్ల నీడలోనే పద్మాసనం వేసుకుని సాయంకాలం దాకా కూర్చు ని సావిత్ర స్తోత్రము చేస్తూ ఉండాలి. ఆ రాత్రి జాగరణ చేయాలి. పద్మాసనంలో కూర్చుని పగలు సావిత్రి దేవి స్తోత్రం చేస్తూ రాత్రి అరటి చెట్టు కింద విశ్రమించాలి. ఇలా నెలరోజులు చేసిన తర్వాత ఆ రుచికరమైన పదార్ధాలతో నివేదించిన మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి’* అని చెప్పాడు. ఈ వ్రతాన్ని లోపాముద్ర చేసి భర్తను పొందిందని చెప్పాడు.

అంత పార్వతీదేవి ఆ విధంగానే రంభావ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దీక్ష కు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇది ఆ రంభా వ్రత గాథ.

‘కృత్య సారసముచ్చయం’ అను గ్రంథంలో పంచాగ్న సాధన చేయాలి , పద్మాసనం వేసుకుని కూచుని తపస్సు చేయాలి’* అని ఉంది. అసలు పంచాగ్ని సాధన అంటేనే  *‘నాలుగు వైపులా నిప్పుల గుండాలు ఉంచుకుని తాను సూర్యునివైపు కంటి రెప్ప వేయకుండా చూస్తూ ఉండటం..’* ఇది చాలా చాలా కఠోర దీక్ష. అలాంటి దీక్షను నియమ నిష్ఠలతో చేయాలి. ఇందులో అరటి చెట్ల ప్రత్యేకతలను గమనిస్తే ఆ నీడను జ్యేష్ఠ శుద్ధ తదియ మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకూ దాదాపు నెలరోజు నివసించడం అనేది చక్కని ఆరోగ్యాన్నిస్తుంది. ఈ వ్రతం ప్రత్యేకంగా స్త్రీలకని చెప్పనవసరం లేదు. వేసవి సమయంలో పగటి పూట అరటి చెట్టు నీడ దాహాన్ని , తాపాన్ని తగ్గిస్తుంది. చలచల్లగా ఉంటుంది.

ఈ రంభా వ్రతం కాక అరటిచెట్టు సంబంధమైనది కదళీ వ్రతం అని మరొక వ్రతం కూడా ఉంది. అది భారతీయులే చేస్తారు. ఆ వ్రతం చేస్తే స్త్రీలు సౌభాగ్యవతులై చిరకాలం జీవిస్తారని ఫలశ్రుతి. రాజ్య వ్రతం , త్రివిక్రమ తృతీయా వ్రతం మొదలైన ఇతర వ్రతాలు కూడా నేడు చేస్తారని ఉన్నది. కాని అన్నింటిలోకి రంభావ్రతం కొంతవరకూ ఆచరణలో ఉన్నట్టు కనుపిస్తోంది.

Post a Comment

0 Comments