GET MORE DETAILS

అంతరిక్షయానంతో చరిత్ర లిఖించబోతున్న తొలి తెలుగు వ్యక్తి.. బ్లూ ఆరిజిన్‌ మిషన్‌తో రికార్డ్‌

అంతరిక్షయానంతో చరిత్ర లిఖించబోతున్న తొలి తెలుగు వ్యక్తి. బ్లూ ఆరిజిన్‌ మిషన్‌తో రికార్డ్‌



తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు మరో తెలుగు వ్యక్తి సరికొత్త రికార్డ్‌ సృష్టించబోతున్నాడు. అంతరిక్షయానంతో చరిత్ర లిఖించబోతున్నాడు.

అంతరిక్షయానం అనగానే దేశవిదేశీయుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పటివరకు ఎంతోమంది విదేశీయులు వివిధ మిషన్ల ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ.. తెలుగువారు ఎవరూ అంతరిక్షంలో అడుగుపెట్టలేదు. ఆ లోటును తీర్చబోతున్నారు మన తెలుగు వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపిచంద్‌ తోటకూర అనే వ్యక్తి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు సృష్టించబోతున్నాడు.

అమెరికాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన న్యూ షెపర్డ్‌ మిషన్‌లో భాగంగా గోపిచంద్ తోటకూర టూరిస్ట్‌గా వెళ్లనున్నారు. దాంతో.. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్‌ తోటకూర చరిత్రకెక్కబోతున్నారు. స్పేస్‌ టూర్లకు ప్రఖ్యాతిగాంచిన బ్లూ ఆరిజిన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

విజయవాడకు చెందిన గోపిచంద్‌ తోటకూర అమెరికాలో స్థిరపడ్డారు. అట్లాంటా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రిజర్వ్‌ లైఫ్‌ అనే వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపిచంద్ కో ఫౌండర్‌గా ఉన్నారు. ఎంబ్రీ-రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్‌ సైన్స్‌లో గోపిచంద్‌ బీఎస్సీ పూర్తి చేశారు. గతంలో పైలట్‌గానూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. బ్లూ ఆరిజిన్‌ మిషన్‌ ద్వారా అంతరిక్షయానం చేయబోతున్నారు. అయితే.. బ్లూ ఆరిజిన్‌ అధికారికంగా ప్రకటించే వరకు అంతరిక్షంలోకి వెళ్తున్నట్లు తన కుటుంబానికి తెలియదన్నారు గోపిచంద్‌.

ఇక.. బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఇప్పటివరకు 6 మిషన్లలో 31 మందిని స్పేస్‌లోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్రమట్టానికి 80-100 కిలోమీటర్ల ఎగువన ఉండే కర్మన్‌ లైన్‌ వరకు వెళ్లి తిరిగివచ్చారు. మొత్తం 11 నిమిషాల పాటు సాగనున్న ఈ యాత్ర.. ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించనున్నారు. కర్మన్‌ లైన్‌ను దాటి కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిని అనుభవిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి భూమిని చూస్తూ మెల్లగా పారాచూట్ల సాయంతో క్యాప్స్యూల్‌లో కిందికి దిగనున్నారు.

Post a Comment

0 Comments