వాస్తవిక సినిమాల దార్శనికుడు
మూస ధోరణికి భిన్నంగా అడుగులేసిన దర్శకుడు తాను నమ్మిన యథార్థ, వ్యథార్థ కథల్ని రాజీ పడకుండా తెరపైకి తీసుకొచ్చిన ఘటికుడు...శ్యామ్ బెనెగల్.
తన కథల్లోని పాత్రలకి తగ్గ నటులు దొరకడానికి ఒకొక్కసారి నెలలు పడతాయి.. తాను అనుకున్నట్టుగా సినిమాని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో ఏళ్లు గడిచిపోతుంటాయి... అయినా సరే వెనక్కి తగ్గకుండా తన ఊహల్లోని సినిమాని అచ్చంగా తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు... శ్యామ్ బెనెగల్.
పుట్టినరోజు కానుకగా తండ్రి ఇచ్చిన కెమెరా... తిరుమలగిరిలోని తన ఇంటి దగ్గరి గారిసన్ థియేటర్... అక్కడ వారానికి మూడు చొప్పున చూసిన పలు భాషల సినిమాలు...
ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫరైన తన తండ్రి కెమెరాతో చేసిన ప్రయోగాలే ఆయనకి దర్శకత్వంలో తొలి గురువు స్కూల్కి వెళ్లినా సినిమానే... కళాశాలలోనూ సినిమా ఊసులే.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ పూర్తి చేశాక ఆయన తన కలల కోసం ముంబయి పయనమయ్యారు...
పన్నెండో ఏటే డాక్యుమెంటరీ తీసి
ఆరేళ్ల వయసులోనే దర్శకుడు కావాలని నిర్ణయించుకున్న శ్యామ్ బెనెగల్...
తన 12వ ఏటే తండ్రి కెమెరాతో తన కుటుంబం నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. అలా చదువుకునే వయసులోనే కెమెరాతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టిన ఆయన వారానికి మూడు సినిమాలు చూస్తూ దర్శకత్వం కలలు కన్నారు. ఆ అభిరుచితోనే కళాశాలలో స్నేహితులతో కలిసి ఫిలిం సొసైటీని స్థాపించారు. ఎంఏ పూర్తి చేశాక తన బంధువైన గురుదత్ స్ఫూర్తితో దర్శకుడు కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముంబయి వెళ్లారు. కానీ ఆయన ఎవరి దగ్గర సహాయ దర్శకుడిగా చేరలేదు. ఓ ప్రకటనల ఏజెన్సీలో ఇంగ్లిష్ కాపీ రైటర్గా చేరి, ఆ తర్వాత వాణిజ్య ప్రచార రంగంలోకి అడుగు పెట్టారు. కొన్ని వందల ప్రచార చిత్రాల్ని రూపొందించారు.
తొలి ప్రయత్నం ‘అంకుర్’:
వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తూనే... అంధకారంలో అలమటిస్తున్న అభాగ్య బాల కార్మికుల దైన్యస్థితి నేపథ్యంలో ‘ఏ ఛైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్’ డాక్యుమెంటరీని రూపొందించారు
తన కెరీర్కి అదొక మలుపు:
ఆ తర్వాత తన అసలైన గమ్యాన్ని అందుకోవాలని ‘అంకుర్’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. ఈ కథని సగటు సినిమాల్లా చెప్పాలనుకునుంటే దర్శకుడిగా శ్యామ్ బెనెగల్ కల ఎప్పుడో నెరవేరేది. వాస్తవిక చిత్రాల ఔన్నత్యాన్ని గుర్తించిన ఆయన పడికట్టు సూత్రాలకి భిన్నంగా అడుగులేశారు. తాను పుట్టి పెరిగిన వాతావరణం, నిజాం కాలం నాటి పల్లె పట్టు జనజీవితం నేపథ్యంగా, దక్కనీ ఉర్దూ సంభాషణలతో వాస్తవాన్ని ప్రతిబింబించేలా ‘అంకుర్’ని రూపొందించాలన్న అంకితభావం ఆయన్ని రాజీపడనివ్వలేదు. చివరికి అనుకొన్నది అనుకొన్నట్లుగా తీయడానికి పదమూడు సంవత్సరాలపాటు శ్యామ్ బెనెగల్ ఎదురు చూడాల్సి వచ్చింది.
1974లో ‘అంకుర్’ విడుదలైంది. కొత్తతరం సినిమాగా ప్రేక్షకులకు చేరువైంది. ఆర్థిక విజయంతోపాటు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని కైవసం చేసుకొంది..
పాత్ర కనిపించాలి...
తన ఊహల్లోని పాత్రలకు అచ్చంగా సరిపడే నటీనటుల్ని ఎంపిక చేయడంలో రాజీపడని దర్శకుడు శ్యామ్ బెనెగల్. నసీరుద్దీన్ షా, సాధు మెహర్, ఓంపురి, అమ్రిష్ పురి, అనంత్నాగ్, గిరీశ్ కర్నాడ్, షబానా అజ్మీ, స్మితాపాటిల్, ప్రియా తెందూల్కర్, వాణిశ్రీ (అనుగ్రహం), పల్లవిజోషి, సులభాదేశ్ పాండే తదితర నటులు శ్యామ్ బెనెగల్ ఊహల్లోని పాత్రల్లో ఒదిగిపోయారు. ఆయన తొలినాటి చిత్రాల్లో ఒక కొత్తదనాన్నీ, వైవిధ్యాన్ని, విభిన్నమైన కథాగమనాన్నీ చూపించడంలో నటీనటుల ఎంపిక ఎంతో దోహదం చేసింది. ‘అంకుర్’లో కీలకమైన లక్ష్మి పాత్ర కోసం శ్యామ్ ఎందరినో పరిశీలించారు. ఎవరూ నచ్చలేదు. కారణం పాత్రలో ఒదిగే రూపురేఖలతోపాటు సంభాషణలు దక్కనీ ఉర్దూ (అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ఉర్దూ యాస)ను మాట్లాడగలిగే నటి లభించకపోవడమే! ఆ సమయంలో ప్రముఖ కవి కైఫీ అజ్మీ కుమార్తె షబానా అజ్మీ పేరును ఎవరో సూచించారు. అలా ఆమెని ఎంపిక చేసుకుని పలు చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ‘నిశాంత్’లోని రుక్మిణి పాత్రకోసం దూరదర్శన్లో మరాఠీ వార్తలు చదివే స్మితా పాటిల్ని ఎంపిక చేసి ఆమెని ఒప్పించారు. స్మితాపాటిల్ సినిమా జీవితానికి బాటలు వేశారు.
హత్తుకునే కథలతో...
సమాంతర సినిమా... కొత్తతరం సినిమా అనే మాటల్ని శ్యామ్ బెనెగల్ ఇష్టపడేవారు కాదు. ఆయన దృష్టిలో సినిమా ఒక్కటే! కథను అనుసరించి ఖర్చు అన్నది ఆయన నమ్మిన సూత్రం. స్టార్లతో సినిమాలు తీయడానికి తాను వ్యతిరేకం కాదని చెప్పేవారు. సమాంతర చిత్రాలతోనే ఆయన పేరు మార్మోగిపోయినా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ 2001లో ‘జుబేదా’ అనే పక్కా వాణిజ్య చిత్రాన్ని తెరకెక్కించారు. ‘అంకుర్’ మొదలుకొని ‘వెల్డన్ అబ్బా’ వరకూ ఆయన తీసిన సినిమాలైనా, టీవీ ధారావాహికలైనా కథల్ని మనసులకు హత్తుకునేలా చెప్పారు. హోమీబాబా ఫెలోషిప్ ద్వారా బ్రిటన్, జపాన్, అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించి చిత్ర నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యాన్ని, మెళకువల్ని ఆకళింపు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ సినీ రంగ పోకడల్ని అర్థం చేసుకోవడమే కాక.. వాస్తవిక చిత్రాల ఔన్నత్యాన్ని గుర్తించారు. చదువుకునే రోజుల్లో సత్యజిత్ రే సినిమాలు నింపిన ప్రగతి శీల భావనలు.. తెలంగాణ పోరాట కాలంలో విద్యార్థి ఉద్యమాలతో అలవడిన అభ్యుదయ భావాలు ఆయనపై బలంగా ప్రభావం చూపించాయి.
ఆయన తీసిన ‘మండి’ పాకిస్థాన్ కథైనప్పటికీ దాన్ని భువనగిరి నేపథ్యంలో తెరకెక్కించారు. అదే ఏడాది ‘నిశాంత్’ చిత్రంతో తెలంగాణ పోరాటాన్ని, భూస్వాముల దురాగతాల్ని కళ్లకు కట్టారు. శ్వేత విప్లవ పితామహుడిగా పేరు పొందిన వర్ఘీస్ కురియన్ జీవిత కథ ఆధారంగానే ‘మంథన్’ చిత్రాన్ని తెరకెక్కించారు శ్యామ్ బెనెగల్..
ఈ సినిమా నిర్మాణం కోసం 5 లక్షల మంది రైతులు ఒకొక్కరు రూ.2 పెట్టుబడి పెట్టారు. మన దేశంలో ప్రజా విరాళాలతో నిర్మితమైన తొలి చిత్రంగా, ప్రపంచంలో ఎక్కువమంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా ఈ చిత్రం రికార్డుల్లోకి ఎక్కింది. మరాఠీ నటి హంస వాట్కర్ జీవిత చరిత్ర ఆధారంగా 1977లో ‘భూమిక’, ఇదే ఏడాది హిందీ, తెలుగు భాషల్లో ‘అనుగ్రహం’ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుంచారు. కలవారి పంచన పేదలకు మిగిలేది నయవంచన అనే విషయాన్ని ‘జునూన్’ (1979)తో ఎలుగెత్తి చాటారు బెనెగల్. ఇది ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వేశ్యల జీవితాల నేపథ్యంలో రూపొందించిన ‘మండి’ ప్రేక్షకుల్ని కదిలించింది. ఇందులో షబానా అజ్మీ, స్మితా పాటిల్ పోటాపోటీగా నటించారు. ‘త్రికాల్’, ‘సుహాస్’, ‘సర్దారీ బేగం’.. ఇలా ఆయన తీసిన ప్రతి సినిమాదీ ఓ ప్రత్యేకతే. ఆయన సినిమాల్లో హంగులు ఆర్భాటాలు, భారీ తారాగణాలు, భారీ సెట్లు కనిపించవు. బలమైన కథలు మాత్రమే కనిపిస్తాయి. ఆయన సినిమాల్లోని మహిళా పాత్రలు శక్తిమంతంగా ఉంటాయి. శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత ఆయన నమ్మిన జీవిత సూత్రాలు. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాలు రూపొందాయి.
చివరి చిత్రం ‘ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’
బంగ్లాదేశ్ జాతిపిత, తొలి అధ్యక్షుడు షేక్ ముజీబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తన చివరి చిత్రాన్ని తెరకెక్కించారు శ్యామ్ బెనెగల్. బంగ్లాదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, భారతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. 2023లో విడుదలైన ఈ చిత్రానికీ పలు అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. ఇటీవలే తన 90వ పుట్టినరోజుని చేసుకున్న శ్యామ్ బెనెగల్ రెండు ప్రాజెక్టుల కోసం కథలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం చిత్రసీమలో విషాదాన్ని నింపింది.
0 Comments