"మాకొద్దీ తెల్ల దొరతనము" (గరిమెళ్ళ సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా)
స్వాతంత్ర ఉద్యమకాలంలో "మాకొద్దీ తెల్ల దొరతనము" అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రుతలూగించి స్వాతంత్ర పోరాటం వైపు జనాలను మళ్లించిన జాతీయ కవి శ్రీ గరిమెళ్ళ. ఆయనంత ప్రసిద్ధి పొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరు దేశభక్తి కవితలు వ్రాసి పాడి జైలు శిక్ష అనుభవించినవారిలో ప్రథముడు గరిమెళ్ళ.
గరిమెళ్ళ సత్యనారాయణగారు శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట తాలూకా గొనెపాడు అనే గ్రామములో 1893 జులై 14 న సూరమ్మ, వెంకట నరసింహము దంపతులకు జన్మించాడు. స్వగ్రామంలో ప్రాధమిక విద్య పూర్తిచేసి విజయనగరం, మచీలీపట్నము,రాజమండ్రి మొదలైన చోట్ల పై చదువులు పూర్తి చేసాక గంజాము కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా ఆ తరువాత విజయనగరము హైస్కూల్ లో ఉపాధ్యాయుడి గా పనిచేసినా కానీ స్వతంత్ర భావాలు స్వేచ్చాప్రియత్వము ఎక్కువగా ఉండటం వల్ల ఏ ఉద్యోగములోను ఇమడలేక పోయినాడు.
1920 సహాయనిరాకరణ ఉద్యమ సమయంలో గరిమెళ్ళ 162 లైన్ల మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాటను వ్రాసాడు ఆ రోజుల్లో ఈపాట చాలా పాపులర్ తెలుగు వారందరి చెవుల్లో మారు మ్రోగింది.ఈ పాట ఆనోటా ఈనోటా అప్పటి బ్రిటిష్ కలెక్టర్ బ్రేకన్ చెవిన పడింది. అయన గరిమెళ్ళను పిలిపించి ఆ పాటను పాడమని ఆ పాట విన్న కలెక్టర్ భాష అర్ధము కాకపోయినా ఆ పాటలోని మహత్తర శక్తి సామాన్య ప్రజలను ఎలా చైతన్య పరచగలదో తానూ ఉహించ గలనని చెప్పి ఆ పాట బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష వేసాడు. కలక్టర్ ఆయనకు శిక్ష వేసాడుగాని ఆ పాటను జనబాహుళ్యములో ఆపలేకపోయాడు.
1921లో గరిమెళ్ళ రచించిన స్వరాజ్యా గీతాలు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తి గీతాలు బాల గీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. శ్రీశారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చు వేసి ఊరురా తిరిగి వాటిని అమ్ముదామని అనుకున్నాడు కానీ వాటి వల్ల నష్టం వచ్చినది. 1935 లో జీవనోపాధి కోసము గరిమెళ్ళ మద్రాసు వచ్చి అక్కడ కొన్ని ప్రముఖ పత్రికలలో సంపాదితకుడిగా పని చేసినను ఆర్దికముగా చాలా ఇబ్బందులు పడినాడు.
ఆయన జీవితము లో సంతోషించదగ్గ విషయము ఏదైనా ఉందంటే అయన జైలు నుంచి వచ్చినాక ఎన్నో చోట్ల ఆయనకు ప్రజలు చేసిన సన్మానాలు. భార్య చనిపోయే నాటికి ఇద్దరు కూతుళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అప్పులు తీర్చటం కోసము అస్తి అమ్మేశాడు. కొంతకాలము ప్రియాగ్రహారము లో గ్రంధాలయ కార్యదర్శిగా పనిచేసాడు. ఈయన పేదరికములో ఉన్నప్పుడు కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు అలాగే వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు గారు కూడా ప్రతినెలా కొంత ఆర్ధిక సహాయము చేసేవారు తన రచనలను వివిధ పత్రికలకు ఆలిండియా రేడియో కు పంపుతూ సంపాదిస్తున్నప్పటికీ అయన అవసరాలకు సరిపడేది కాదు ఆ విధముగా పేదరికము ఒకవైపు అనారోగ్యము మరొకవైపు భాధిస్తు ఉండగా ఒక కన్ను పోయింది పక్షవాతము వచ్చింది దిక్కులేని పరిస్తుతు లలో చివర్లో యాచన మీద బ్రతికాడు
స్వాతంత్రము వచ్చినాక కూడా ప్రభుత్వాలు ఆయనను పట్టించుకోలేదు. ఏ విధమైన సహాయము చేయలేదు ఆ పరిస్థితులలో అయన అభిమానులు కొందరు సహాయం చేద్దామని ప్రయత్నించినా ఆయన స్వీకరించలేదు. ఆ విధముగా దుర్భర దారిద్ర్యమును అనారోగ్యాన్ని అనుభవిస్తూ 59 ఏళ్ల వయస్సులో 1952 డిశంబర్ 18 న మరణించారు. చివరికి అయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు పూనుకొని పూర్తిచేశారు. ఇది మాకొద్దీ తెల్ల దొరతనం అని గొంతెత్తి పాడిన కవి, స్వాతంత్ర సమరయోధుడు ఒక అసామాన్య దేశ భక్తుడి కధ.
0 Comments