GET MORE DETAILS

కార్తీకపురాణం: 8వ అధ్యాయము. శ్రీ హరినామస్మరణాధన్యోపాయం - ఆజా మీళుని కథ

కార్తీకపురాణం: 8వ అధ్యాయము. శ్రీ హరినామస్మరణాధన్యోపాయం - ఆజా మీళుని కథ



వశిష్టుడు చెప్పినదంతా విని...

“మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభంగా కలుగు ననియూ, అది - నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులే చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. 

దుర్మార్గులు  కొందరు సదాచారములను పాటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను” యని కోరెను.

అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి “జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు.

సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు యెంతటా ఆధిక్యత కలదు.  

సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు - వేదములు పఠించి, సదచారుడై, కుటింబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందున్న  దేవాలయంలో జపతపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మమనగా - ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించునదగును.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడినపుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్ఛరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

ఆజా మీళుని కథ

పూర్వ కాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావాసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను.

ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కామంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞోపవీతము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామ క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంటనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున అజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువులు తనని విడిచి పెట్టిరి. అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. 

ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టేక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. అజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధకారాముచె కన్ను మిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటిలోనె చచ్చిరి. మరల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను.

వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ' అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళుచూ, “నారాయణా-నారాయణా” అని ప్రేమతో సాకు చుండిరి. 

కాని ‘నారాయణ' యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్రమతనికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజామీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక 'నారాయణా'’నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. 

అజామీళుని నోట 'నారాయణా'యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి “ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి' యని చెప్పి, అజామీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు 

అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కోరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొడంగిరి.

ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - లోకాసమస్తా సుఖినోభవన్తు!

Post a Comment

0 Comments