Ads Area

మాఘ పురాణం : 11వ అధ్యాయము. భీముని ఏకాదశి వ్రతము

0

మాఘ పురాణం : 11వ అధ్యాయము. భీముని ఏకాదశి వ్రతము   



 బలవంతుడైన భీముడి గర్వం మరియు అతని మార్పు గురించి చెబుతుంది,గర్వంతో ఇతరులతో గొప్పలు చెప్పుకునే భీముడు, ముని సలహా మేరకు ఏకాదశి వ్రతం పాటించి, వినయం, సంయమం పెంచుకుంటాడు. వ్రతం అతని గర్వాన్ని తగ్గించి, వినయంతో నింపి, ఇతరులకు సహాయం చేసేలా మార్చేస్తుంది. 

ఈ కథ, గర్వం హానికరమని, వినయం, సంయమం మన జీవితాలను మెరుగుపరుస్తాయని బోధిస్తుంది. సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘ మాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకము కూడా అందుబాటులో లేని యెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును.

పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను,అతని పూర్వీకులు అందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి,పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయ భక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను,దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను,మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను, అలా సంపాదించి ధనవంతుడయ్యెను, కొంతకాలానికి వృద్దుడయ్యెను,తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు, ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను,“అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము,శరీర బలము వున్నదను మనో గర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా” అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను.

అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ,బంగారమూ యెత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా,అతని సంపద అంతయూ అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము,అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు, ఆసమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి, తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను, ఆ సమయముననే మాఘ మాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను, అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను,నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను,చలికి గడగడ వణికి బిర్రబిగసి పోవుచూ ‘నారాయణా’ అని ప్రాణములు విడచినాడు, దివ్యమైన యమునా నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములు అన్నియూ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను,అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజన ప్రియుడు,ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడు అన్నము అయినా చాలదు, అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది, కాని ఒక విషయములో బెంగతో ఉండెను, అదేమందువా“ఏకాదశీ నాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి”,అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు “అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది, కనుక, అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును” అని పలికెను.

సరే నేను అటులనే చేయుదును,గాని, “విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను, ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండును, కావున ఆకలి దాహము తీరులాగున, ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము”, అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహా శ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరి ఒక్కటి లేదు, ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై యుండును, అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు, సంవత్సరము నందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశి లలో  మాఘశుద్ద ఏకాదశి మహా పర్వదినము కావున, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును, ఇందు యేమాత్రమును సంశయములేదు, కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము, ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు” అని వివరించెను.

ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాససం ఉండెను* *అందులకే మాఘశుద్ధ ఏకాదశిని“భీమ ఏకాదశి” అని పిలుతురు,అంతియే గాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాస మందే వచ్చును,కాన మహా శివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను,శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీప మహారాజుతో నిటులపలికిరి.

ఏకాదశి మహా విష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో,అదే విధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే “శివరాత్రీ"యని అందురు, అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము, మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చెడి చతుర్దశి దీనినే “మహాశివరాత్రి” అని అందరూ పిలిచెదరు.

ఇది మాఘ మాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును.

ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహా శివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.

ఆ రోజు నదిలోగాని, తటాకమందుగాని లేక నూతి వద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను, పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును, అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాస ప్రాప్తి కలుగును.

శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు, కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది, కావున  శివరాత్రి దినమున ప్రతిఒక్కరూ అనగా జాతి భేదముతో నిమిత్తము లేక, అందరూ శివరాత్రి వ్రతమును ఆచరించి  జాగరణ చేయవలయును,

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో, నివసించుచుండెను, అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు,వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి, తాను తిని, తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియూ తెలియదు, జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయ వానిని చూచి భయపడి పారిపోయేడివి, అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు, ప్రతి దినము వలె ఒక నాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమియూ కంట పడలేదు, సాయంకాలం అగుచున్నది, వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు యెదురు చూచుచుండెను.

తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను,ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి, ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు, తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి,ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను, మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశు వృద్ధ భేదములుగాని లేవు, పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను, వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి, యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను,శివుడు – పార్వతి,గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను, ఉమాపతి యముని దీవించి, ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించెను, అంతట యముడు,“మహేశా! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను,

మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు,ఒక దినమున అనగా మహా శివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు, జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని, చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా” అని యముడు విన్నవించుకున్నాడు.

“యమధర్మరాజా! నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు  బిల్వపత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు,ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది” అని పరమేశ్వరుదు వివరించెను.

✅ మాఘపురాణంలోని 30 అధ్యాయములు

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area