మాఘ పురాణం - 3 వ అధ్యాయము : గురుపుత్రికాకథ
మంగళదాయినీ ! సర్వమంగళా ! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నొందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి ! మాఘ స్నానమున పాపవిముక్తి నొందిన విధానమేమి ? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణు డుండేవాడు. అతడు సదాచార వంతుడు , వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు,గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది.పొడవైన కేశములతో , చక్కని ముఖంతో , చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు , ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది , పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద , అనేకవర్ణములలోనున్న కలువలు , జలసంచారముచేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లనుతిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ ! మనుష్య సంచారము లేని , యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించక నావద్దకు రమ్ము , నా శరీరము దూదికంటే మెత్తగానున్నది , నీకు మరింత సుఖమిచ్చును , రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము , రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు మంచి దానా ! నీవిట్లనకుము , నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీ సోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి యుండును. కావున యింటికి పోదమురమ్ము , గురువుగారు మనకై ఎదురు చూచు చుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింప వచ్చును. సమిధలు , దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ ! కన్యారత్నము , సువర్ణము. విద్యాదేవత , అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చినసమిధలు మున్నగు వానిని చూచి యానంద పడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు , మధురా హారమును తిని విశ్రాంతినందు మని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.
తండ్రియామెను కాశ్మీరదేశ వాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంత కాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో ! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి ? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించు చుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవుని రోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి 'జ్ఞానస్వరూపా ! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును , భార్యపుత్రికలను చూచి క్షణ కాలము ధ్యానయోగము నంది యిట్లు పలికెను. ఓయీ ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను.
ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించిన దాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమునగౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించు చున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా !
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య , ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదర తుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి 'తండ్రీ ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును ? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును ? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా ! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు , ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీ తీరమునగాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింప వలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించ వలయును. ఈ విధముగ నీయమముచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియ నాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ , ఫల పుష్పాదులు , పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచరించి సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘ స్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుగ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందుదురు. అని యోగి వివరించి తన దారిన బోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును , గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను , భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని , సరస్సునగాని , కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు , సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనొంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.
.jpeg)
0 Comments