శ్రావణమాస ప్రాముఖ్యత
ఈమాసంలో పుట్టినవారు వేదోక్తకర్మలను చేయిస్తూ, పుత్రులతోను, ధనాదులతోను, అందరి మర్ననలు పొందుతారుని, యౌవనం జాతకం చెబుతోంది. ఈనెలలో ఏ పనిచేసినా కలిసి వస్తుందని, గృహనిర్మాణం చేబడితే భృత్యులాభమని, మత్స్యపురాణం చెబుతోంది.
'శుద్ధపాడ్యమి' ధనదునికి, విదియ శ్రియఃపతికి, తదియ పార్వతీదేవికి, చవితి వినాయకుడికి, పంచమి శనికి, షష్టి సుభ్రహ్మణ్యునికి, సప్తమి సూర్యుడికి, అష్టమి దుర్గాదేవికి, నవమి మాతృగణానికి, దశమి ధర్మరాజుకు, ఏకాదశి మునులకు ద్వాదశి చక్రపాణికి, త్రయోదశి మన్మధుడికి, చతుర్దశి శివుడికి, పూర్ణిమ పితృదేవతలకు, పవిత్రారోపణం చేయాలని గ్రంధాలు చెబుతున్నాయి. దర్భను దర్భతోకట్టిన పొడవైన వేలితొడుగును పవిత్రం అంటారు.
360 దారాలులేక 270 కనీసం 180 దారాలు, అయినా, వినియోగించి, మూడుపేటలు వేసి, మూడింటినీ కలిపి కట్టినదే పవిత్రం.
గరుడపంచమి & నాగపంచమి విశేషాలు
శ్రావణమాసంలో గరుడపంచమి చాలా ముఖ్యమైన రోజు. గరుత్మంతుడు నాగులను తన తల్లి దాస్యవిముక్తి కోసం ఏమి చేయాలని అడిగాడు. ఇంద్రుని వద్ద నుండి అమృతభాండాన్ని తెచ్చి ఇవ్వమన్నాయి నాగులు. అమరావతికి వెళ్లి, అమృతభాండాన్ని తెచ్చి, నాగులకు ఇచ్చిన గరుత్మతుని నిజాయితీకి మెచ్చుకున్నాడు ఇంద్రుడు. అనేక వరాలను ప్రసాదించాడు.
శ్రీమహావిష్ణువు గరుడుని మాతృప్రేమకు, భక్తికి ముగ్ధుడై గరుత్మంతుడిని తన వాహనంగా చేసుకున్నాడు. నాగులకు అమృతం దొరికిన రోజు కనుక, గరుడుడు విష్ణువుకి వాహనంగా వరిన రోజు కనుక, 'గరుడపంచమి', 'నాగపంచమి' అనే పేర్లు వచ్చాయి. అందుకే ఈ రోజున గరుడిని, నాగులను పూజించాలి. నాగులపంచమినాడు నాగులను పూజించినవారికి తమ వల్ల ఏ హాని జరగదని, నాగులు వరమిచ్చాయట.
నేడు భూమిని తవ్వకూడదు. ఎందుకంటే, ఎక్కడైనా కలుగుల్లో పాములుంటే వాటికి హాని జరుగుతుంది. చెట్టు నుండి పండ్లనుగానీ, పూలనుగానీ కోయకూడదు. మట్టితో చేసిన నాగ ప్రతిమనుగాని, నాగుల బొమ్మలను ముగ్గులతో చిత్రించిగాని, పూజ చేయాలి. మాళవదేశంలో రోజంతా ఉపవాసం ఉండి, నియమనిష్ఠలతో నాగదేవతలను పూజిస్తారు. ఈ నోము నోచుకోవడం కోసం ప్రత్యేకంగా ఆడపిల్లలను పుట్టినింటికి తీసుకువస్తారు. గరుడపంచమి వ్రతాన్ని పదేళ్లు చేస్తే తోబుట్టువులు ఆరోగ్యంగా ఉండి, ఇష్టకామ్యార్ధసిద్ధిని పొందుతారని నమ్ముతారు.
ప్రతి వైష్ణవ ఆలయంలోనూ గరుత్మంతుడి విగ్రహం ఉండి తీరుతుంది. సర్పపూజ చేసిన వారికి విషబాధలు కలుగవని, వంశాభివృద్ధి జరుగుతుందని, శాస్త్రాలు చెబుతున్నాయి. సర్పాలను పూజించి, గోధుమతో చేసిన పాయసాన్ని నివేదన చేస్తే, శుభం జరుగుతుందట. సర్వస్తోత్రాలను ఉదయ సాయంకాలాలలో పఠించిన వారికి విషభీతి నివారణతోపాటు సకల కార్యసిద్ధి కలుగుతుందట! తమను ఆరాధించిన వారికి ఎలాంటి హానినీ కలిగించమని, సంరక్షిస్తామని నాగులు వరం ఇచ్చినట్లుగా అగ్నిపురాణం, స్కాందపురాణం, నారద పురాణం తెలియజేసాయి.
వంశాభివృద్ధినేకాక, సత్సంతానాన్నీ ప్రసాదిస్తాయి నాగులు. శ్రావణ పంచమి, కార్తీక శుద్ధచవితి, మార్గశిర శుద్ధ షష్ఠి నాగపూజకు శ్రేష్టమైనవి. ఋగ్వేదంలో నాగుల ప్రస్తావన ఉంది. పరమశివుడికి అలంకారము, వినాయకుడికి యజ్ఞోపవీతం పాములే! శ్రీమహావిష్ణువుకి పానుపు ఆదిశేషుడే! దేవ దానవ సంగ్రామంలో వాసుకి అనే సర్పం, కవ్వపు తాడుగా అమరి సముద్రమధనానికి సహాయపడింది. మానస దేవతగా బెంగాల్, బీహార్లలో సర్పం పూజింపబడుతోంది!
వ్రతాలు, నోములు & రక్షా బంధనం
ఇక శ్రావణమాసంలో వచ్చే మంగళవారపు నోములు, శుక్రవారపు పూజలు అందరికీ తెలిసినవే! అందరూ ఆచరిస్తున్నవే! పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా ఆచరిస్తారు. పూర్ణిమనాడు సముద్రుడు తన పుత్రుడైన చంద్రుడు అన్ని కళలతోనూ కనిపిస్తూంటే పొంగిపోతాడు! తన తండ్రి సంతోషానికి కారణమైన పూర్ణిమకు ముందటి శుక్రవారం నాడు తన పండుగను వరలక్ష్మీ వ్రతంగా నిర్ణయించింది లక్ష్మీదేవి. తన పండుగకు పుట్టినింటివారు వస్తే ఎంతో సంబరం ఆడపిల్లకి, అందువల్ల వారికి వీలయిన రోజునే పండగ చేసుకోవాలనే సాంప్రదాయాన్ని నేర్పింది ఆ తల్లి!
శ్రావణ పూర్ణిమ రోజున ఉదయాన్నే స్నానంచేసి దేవ, పితృ కార్యాలు, ఉపాకర్మలు, ఋషి తర్పణాలు నిర్వహించాలి. పట్టుబట్టలో కాని, ఇంకేదైనా మంచి బట్టగాని తీసుకొని, అక్షింతలు, ఆవాలు మొదలైన వాటిని పొట్లం కట్టి ఇంటి మధ్యలో అలికి, ముగ్గులు పెట్టి, పీఠంపై రక్షను పెట్టి పూజించి చేతికి కట్టాలి.
ఈ రోజున అన్నదమ్ములు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తే, అక్కచెల్లెళ్ళు వారికి హారతి ఇచ్చి మిఠాయిలను తినిపిస్తారు. ఒకప్పుడు యజ్ఞోపవీతాన్ని వేదాధ్యయనానికి ప్రారంభ సూచనగా ధరిస్తే, అది కంకణ ధారణగా మారి ఇతర వర్ణాల వారిలోనూ రక్షా బంధనంగా రూపుదిద్దుకుంది! రక్షా పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అని అంటున్నాం! ఈ రాఖీ పండగ రోజున అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు సందడే సందడి! విదేశాల్లో సైతం ఇది ఆచరింపబడుతోంది!
ఇంకా ఈ శ్రావణ మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి. హయగ్రీవ జయంతి, వైఖానస జయంతి, శ్రీ దయానంద సరస్వతీ వారి జయంతి, శ్రీకృష్ణాష్టమి వగైరాలన్నీ ముఖ్యమైనవే.
