GET MORE DETAILS

నవంబరులో ఫీజుల చెల్లింపు..

 నవంబరులో ఫీజుల చెల్లింపు..


ఒక్క పైసా కూడా బోధన రుసుముల బకాయిల్లేవు..

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడి..


2020-21 సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల హాజరు వివరాలను పరిశీలిస్తున్నాం. చివరి ఏడాది విద్యార్థులకు చెల్లించాల్సిన త్రైమాసిక ఫీజులను నవంబరులో ఎస్క్రో ఖాతా ద్వారా డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలకు అందించాలని ఆలోచిస్తున్నాం. ఒక్క పైసా కూడా బోధన రుసుముల బకాయిలు లేవు. ఆలస్యమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు...’ అని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తయిన తర్వాత పెండింగ్‌ బోధన రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. విద్యార్థులు హాజరుకాకుండానే ప్రైవేటు పీజీ కళాశాలలు బోధన రుసుములు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, నాణ్యత ఉండడం లేదనే పీజీలకు ఈ పథకాన్ని నిలిపివేశామన్నారు.

విజయవాడలో గురువారం కళాశాలల యాజమాన్యాలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కోర్సు పూర్తయిన విద్యార్థులెవ్వరికీ ధ్రువపత్రాలు ఆపవద్దు. కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి చేయవద్దు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసిన రెండు త్రైమాసికాల్లో మొదటి విడతలో 91.2శాతం, రెండో త్రైమాసికంలో 42.2శాతం మంది కళాశాలలకు ఫీజు చెల్లించారు. విద్యార్థుల బాగోగులు, కళాశాలల పరిస్థితిని తల్లులు తెలుసుకోవాలనే వారి ఖాతాల్లో వేస్తున్నాం. గతేడాది ఏప్రిల్‌లో 2018-19 బకాయిలతో సహా 2019-20 బోధన రుసుములు రూ.4వేల కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,880 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది. కరోనా కాలంలోనూ కళాశాలలు నిలబడ్డాయంటే సీఎం జగనే కారణం. ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే ఆ ఏడాది వారికే వర్తింప చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజు చెల్లించింది. ప్రభుత్వం త్రైమాసిక విధానంలో ఫీజులను చెల్లిస్తోంది. బోధన రుసుముల చెల్లింపులో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలన్నీ సంతృప్తిగా ఉన్నాయి. 87శాతం మంది విద్యార్థులకు ఫీజులను చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఈ ఏడాది ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ 35శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తున్నాం. పేద విద్యార్థులు సైతం మంచి కళాశాలల్లో చదవాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు...’’ అని వివరించారు. అనంతరం ఉన్నత విద్య ప్రత్యేక ప్రధానకార్యదర్శి సతీష్‌చంద్ర వర్చువల్‌లో మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు లేకుండా చూస్తున్నామని, ఉన్నత విద్యలో నాణ్యత తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

Post a Comment

0 Comments