GET MORE DETAILS

దీపారాధన పూర్తి విశ్లేషణ

దీపారాధన పూర్తి విశ్లేషణ




ప్రతి హిందువు తప్పక పాటించాల్సిన నియమాలలో దీపారాధన ప్రధానం... ఎంతో విలువైన,  ముఖ్యమైన ఈ విషయ సేకరణను ప్రతి ఒక్కరు భద్రపరుచుకోండి... ఆచరించండి... ప్రతి హిందువుకు పంచండి... అత్యంత విలువైన ఈ సమాచారాన్ని కష్టపడి సేకరించడమైనది.


దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః

దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః


దీపం పర బ్రహ్మ స్వరూపం. పరాయణత్వం కలిగిందై. పాప ప్రక్షాళన చేయును. మన ఇంట సిరులు ఇచ్చేది దీపజ్యోతియే ! 


   దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం, అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం, అదే పెద్దల యందు ఉంటే గౌరవం. అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు. 

   అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. రెండు వత్తులు కలిపి వెలిగించాలి. రెండు దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు, వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి. ఒక వత్తు వేదాన్ని, రెండో వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణ గ్రంథములు. వ్యాఖ్యాణ గ్రంథములు అంటే రామాయణ, మహాభారతం, ప్రబంధాలు మొదలైనవి. ధర్మ శాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియూ ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాణ గ్రంథములు అని అంటారు. ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి. కనుక ననకు వేదమూ అవసరమే, వ్యాఖ్యాణ గ్రంథములు అవసరమే.ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అణుమాత్రం, జ్ఞానమే తన స్వభావం. జ్ఞానమే ఆత్మ స్వరూపం. ఆ జ్ఞానం వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్దతి కాదు. అట్లాచేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీప కాంతి దేవుడిపై పడాలి, అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు.


   భూమి, జలం మరియూ తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేసాడు. ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి మరియూ తేజస్సుకి సూచకంగా జ్యోతి. ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటకి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనస్సుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు, ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం.నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 

   'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి. దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.

   వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.


దీపారాధన ఎలా చేయాలంటే...


   అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో అయిదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాలుగవది గౌరవ, ధర్మవృద్ధులకూ, అయిదోది వంశాకభివృద్ధికి అని పురోహితులు అంటున్నారు. 

   దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ఉద్ధేశించిన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు అంటున్నారు.


వివిధ రకాల వత్తులతో  దీపారాధన - ఫలితాలు :


మంచి పత్తితో చేసిన వత్తులతో దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి. 

తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది. 

అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది.

జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది.

పసుపురంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.

కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు.

సంతాన గోపాలస్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.

వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.


కొబ్బరి నూనెతో దైవారాధన :


కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.రావిచెట్టు క్రింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారా యణస్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముతైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది.

మహాలక్ష్మీదేవికి కొబ్బరినూనెతో 40 రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలు అవుతాయి. ఎవరైతే ప్రతిరోజూ మహాలక్ష్మికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదారన నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి.

పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావు.


హరిద్వార్‌లో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఎవరైతే కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.


దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి. మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించేది. దేవాలయాలలో చేసే దీపారధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది. విశేష ఫలితాలు లభిస్తాయి. తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు.

దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను "అర్చనా" దీపాలు అంటారు. నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు. గర్భగుడిలో వెలిగించే దీపాన్ని "నందా" దీపము అని అంటారు. లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో గుడిలో వెలిగించే దీపాన్ని "లక్ష్మి దీపం" అంటారు.

దేవాలయ ప్రాంగణంలోనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా "బలిదీపం" అని అంటారు. ఆ సమీపాన ఉన్న ఎత్తూయిన స్థంబం పై వెలిగించిన దీపాన్ని "ఆకాశదీపం" అంటారు. అలాగ పంచాయతన దేవాలయాలలో దేవతలు..శివుడు,విష్ణువు,అంబిక,గణపతి,ఆదిత్యుడు(సూర్యుడు) లున్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి. శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి. విష్ణువు వద్ద దీపకృతులు :శంఖు,చక్ర,గద,పద్మ"రూపాలు కనిపిస్తాయి.

ఏక ముఖం- మధ్యమం, ద్విముఖం - కుటుంబ ఐక్యత, త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం -పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు ఉండును. అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం. వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థనం. దీపారాధన చేసేటప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి. ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనసరిగ చెయ్యాలి. నిత్యం శుభఫలితాలను ఇస్తు, దుష్ట శక్తులు నశిస్తాయి. ఆ ఇంటా అందరు క్షేమముగా ఉంటారు


జన్మ తేదీల రీత్యా వెలిగించవలసిన వత్తులు :


1. మార్చి 21 నుండి ఏప్రిల్‌ 20 వరకు - (5) పంచవత్తులు

2. ఏప్రిల్‌ 21 నుండి మే 20 వరకు - (7) సప్తవత్తులు

3. మే 21 నుండి జూన్‌ 20 వరకు - (6) షణ్ము వత్తులు

4. జూన్‌ 21 ఉండి జూలై 20 వరకు - (5) పంచముఖి వత్తులు

5. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు - (3) త్రివత్తులు

6 ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 20 వరకు - (6) షణ్ముఖ

7. సెప్టెంబరు 21 నుండి అక్టోబర్‌ 20 వరకు - (7) సప్త వత్తులు

8. అక్టోబర్‌ 21 నుండి నవంబర్‌ 20 వరకు - (2) ద్వి వత్తులు

9. నవంబర్‌ 21 నుండి డిసెంబర్‌ 20 వరకు - (5) పంచమ వత్తులు

10. డిసెంబర్‌ 21 నుండి జనవరి 20 వరకు - (6) షణ్ముక వత్తులు

11. జనవరి 21 నుండి ఫ్రిబవరి 20 వరకు - (5) షణ్ముక వత్తులు

12. ఫిబ్రవరి 21 నుండి మార్చి 20 వరకు - (2) ద్వి వత్తులు


అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వత్తులు :


1. 1.10.19 - 1 (ఏక లేదా ద్వాదశ వత్తులు)

2. 2.11.20 - 2 ( ద్వి వత్తులు)

3. 3.12.21 - 5 ( పంచమ వత్తులు)

4. 4.13.22 - 8 (అష్టమ వత్తులు)

5. 5.14.23 - 4 (చతుర్‌ వత్తులు)

6. 6.15.24 - 6 (షణ్ముఖ వత్తులు)

7. 7.16.25 - 9 (నవ వత్తులు)

8. 8.17.26 - 7 (సప్త వత్తులు)

9. 9.18.27 - 3 (త్రి వత్తులు)


నవరత్నములు ధరించిన వారు వెలిగించవలసిన వత్తులు :


1. కెంపు - 1 ఏక వత్తి లేదా 12 ద్వాదశ వత్తులు

2. ముత్యము - 2 ద్వి వత్తులు

3. పగడము - 3 త్రి వత్తులు

4. జాతిపచ్చ - 4 చతుర్‌ వత్తులు

5. కనకపుష్యరాగం- 5 పంచవత్తులు

6. వత్రము - 6 షణ్ముఖ వత్తులు

7. ఇంద్రనీలము- 7 సప్త వత్తులు

8. గోమేధికము - 8 అష్ట వత్తులు

9. వైఢ్యూర్యము - 9 నవ వత్తులు


సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు :


1. ఆరోగ్యము కొరకు - 1 ఏకవత్తి

2. మానసిక రోగములు నివారణకు- 2 ద్వి వత్తులు

3. వివాహ ప్రాప్తికొరకు - 3 త్రి వత్తులు

4. కుజ దోష నివారణకు - 3 త్రి వత్తులు

5. విద్యాప్రాప్తి కొరకు - 4 చతుర్‌ వత్తుల

6. ఉద్యోగ ప్రాప్తి కొరకు - 5 పంచమ వత్తులు

7. ఋణ బాధలు తీరుటకు - 6 షణ్ముక వత్తులు

8. వ్యాపారాభివృద్ధి కొరకు - 6 షణ్ముక వత్తులు

9. ఏలినాటి అష్టమ శని కొరకు - 7 సప్త వత్తులు

10. సర్వదోష నివారణ - 8 అష్టమ వత్తులు

11. సంతానప్రాప్తి కొరకు - 9 నవమి వత్తులు

12. అపమృత్యుదోష నివారణకు - 10 దశమ వత్తులు

13. ధనప్రాప్తి కొరకు - 12 ద్వా దశ వత్తుల

14. నాయకత్వము కొరకు - 14 చతుర్దవ వత్తుల


నవగ్రహాలకు దీపారాధన :


   జాతకపరంగా నవగ్రహ పరివర్తనను అనుసరించి శుభ, అశుభఫలితాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాధిపత్యంతో కలిగే అశుభ ఫలితాలను తప్పించేందుకు నవగ్రహ ఆరాధన చేయడం మంచిదని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. 


ఇందులో బాగంగా నవగ్రహ పూజలో దీపారాధనకు వాడాల్సిన వత్తులు, దీపారాధనలో ఉపయోగించాల్సిన నూనెలు గురించి తెలుసుకుందాం... 

సూర్యారాధనలో కుంకుమ వర్ణపు ఏకవత్తిని ఎర్రరంగు ప్రమిదెలో వెలిగించి పూజచేయాలి. దీపారాధనలో ఆవునేతిని ఉపయోగించాలి. అదేవిధంగా చంద్ర గ్రహ పూజలో ఏకిన దూదితో తయారు చేయబడిన రెండు వత్తులను వెండి ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనలో నేతిని వాడాలి. 


కుజ గ్రహ పూజలో కుంకుమ రంగు వర్ణంలో ఉన్న మూడు వత్తులను ఎర్రటి ప్రమిదెలలో వెలిగించాలి. దీపారాధనలో నువ్వుల నూనెను వాడాలి. 

అలాగే బుధ గ్రహ పూజలో తెల్లజిల్లేడు వత్తులను నాలుగింటిని ఎర్రటి ప్రమిదెలో తమలపాకు వేసి వెలిగించాలి. ఇందులో దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది. 

ఇక గురుగ్రహ పూజచేయటానికి తామర వత్తులతో తయారు కాబడిన ఐదు వత్తులను కంచు ప్రమిదెలలో వేసి వెలిగించాలి. దీపారాధనలో నేయిని ఉపయోగించాలి. 

శుక్ర గ్రహ పూజలో కూడా తామర వత్తులతో తయారు చేసిన ఆరు వత్తులను వేసి వెలిగించాలి. దీపారాధనకు ఆవునేతిని వినియోగించాలి. 

శని గ్రహ పూజకు నల్లని ఏడు వత్తులను స్టీలు ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వినియోగించాలి.

ఇక రాహు గ్రహ పూజకు నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించాలి. దీపారాధనలో అష్టమూలికా తైలాన్ని వినియోగించాలి. 

కేతు గ్రహ పూజలో తెల్లజిల్లేడుతో తయారు కాబడిన తొమ్మిది వత్తులను ఉపయోగించాలి. దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించాలి. 


దీపంలో ఉండే నవగ్రహాల అంశ :

దీపపు ప్రమిద సూర్యుడు,

నెయ్యి అంశ చంద్రుడు,

దీపం వత్తి బుధుని అంశ,

వెలిగే దీపం నిప్పు కుజుని అంశ,

దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు.గురువు,

దీపం నీడ రాహువు,

దీపం నుంచి వెలువడే  కిరణాలే శుక్రుడు (ఆశ)

దీపం వెలిగించడం వల్ల  పొందే మోక్షమే కేతు

దీపం కొండెక్కిన తర్వాత  మాడిన  నలుపు రంగే శనీశ్వరుడు

దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే, ప్రమిద మట్టి భూమి గాను... నెయ్యి నీరుగాను అగ్నిజ్వాల నిప్పుగాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.

దానివల్లనే మన పెద్దలు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల,  నవగ్రహాల కలయికతో... అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు.


వెండి దీపాలతో దీపారాధన వలన కలిగే ఫలితాలు :


1. వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో గానీ దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టనిధులు కలుగును.

2. గతపతికి లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపురసుందరీ దేవికి, రాజరాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి ఎవరైతే దీపారాధన చేస్తారో వారు అను కున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. 

సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తిన్నేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. 

ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)

దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. 

వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. 

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాక..!! 


దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః

దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః



Post a Comment

0 Comments