GET MORE DETAILS

బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు. రేపు మరొకటి...!

 బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు. రేపు మరొకటి...!



👉 ఈ నెల 13న అండమాన్ వద్ద అల్పపీడనం

👉 బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం చేరే అవకాశం

👉 రాగల 24 గంటల్లో రాష్ట్రానికి వర్ష సూచన

👉 ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు

ఈశాన్య రుతుపవనాల సీజన్ లో బంగాళాఖాతంలో తరచుగా అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. తాజాగా కొన్నిరోజుల వ్యవధిలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడగా తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడే ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం చేరిన నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, ఏపీ వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషన్ కె.కన్నబాబు స్పందించారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసర సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్టు వెల్లడించారు.

అటు, కడప జిల్లాలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. రైల్వే కోడూరు మండలంలో 10.72 సెం.మీ వర్షపాతం నమోదైంది. పింఛ రిజర్వాయర్ నుంచి 12 వేల క్యూసెక్కులు, అన్నమయ్య రిజర్వాయర్ నుంచి 9.640 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లిన 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోగా, కృష్ణపట్నం కోస్ట్ గార్డ్స్ వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి వెళ్లగా, ఇంజిన్ మధ్యలోనే ఆగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు అధికారులను అప్రమత్తం చేశారు.

భారీ వర్షాలకు తిరుమల కొండపై 6 డ్యాములు ఉప్పొంగుతున్నాయి. తిరుమల నడకదారిలో నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు భారీ వర్షంతో, చలిగాలులతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

Post a Comment

0 Comments