GET MORE DETAILS

నేటి విశేషం : : ప్రభోధనైకాదశి / ప్రబోధిని ఏకాదశి

 నేటి విశేషం : : ప్రభోధనైకాదశి /  ప్రబోధిని ఏకాదశి 

              


కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధైకాదశి’ , ‘బృందావన ఏకాదశి’ అనే పేరుతో పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు  కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి , దేవ - ప్రబోధిని ఏకాదశి , ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి - భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి , అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి , విష్ణువును పూజించి , రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి , పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి బ్రహ్మదేవుడు , నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు , 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు , తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా , అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని , ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం , సంపదలు , ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది...

 పుణ్యక్షేత్ర దర్శనాలు , యజ్ఞయాగాలు , వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు.

ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం , పండ్లు , దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు , యక్షులు , కిన్నెరులు , కింపురుషులు , మహర్షులు , సిద్దులు , యోగులు తమ కీర్తనలు , భజనలు , హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు.

 అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. 

కాబట్టి విష్ణుమూర్తికి హరతి ఇవ్వాలి.. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూసినా , హారతి కర్పూరం సమర్పించినా అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది.


              

Post a Comment

0 Comments