GET MORE DETAILS

అమ్మాయి పెళ్లి @ 21 : 21 ఏళ్లకు కళ్యాణం కమణీయం.

 అమ్మాయి పెళ్లి @ 21 : 21 ఏళ్లకు కళ్యాణం కమణీయం.





✒ మహిళల కనీస వివాహ వయసు పెంపు.

 కేంద్ర మంత్రి మండలి ఆమోదం.

 జయా జైట్లీ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం.

 పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే సవరణ బిల్లు.

 పురుషులతో సమానంగా వైవాహిక జీవితం.

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహ వయసు రూపంలో ఎదురవుతున్న వివక్ష ఇక తొలగిపోనుంది.

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహ వయసు రూపంలో ఎదురవుతున్న వివక్ష ఇక తొలగిపోనుంది. ఈ అంశంలోనూ ఏకరూపత తీసుకొచ్చేలా యువతుల కనీస పెళ్లి వయసును కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా బాల్య వివాహాల నిరోధక చట్టం-2006, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టం-1955లకూ కేంద్రం తగిన సవరణలు చేయనుంది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లు తీసుకొచ్చే అవకాశముంది. ఇది చట్టరూపం దాల్చితే 21 ఏళ్ల వయసు కన్నా ముందే పెళ్లి చేయడం నేరమవుతుంది.

ఏడాది క్రితమే ప్రస్తావించిన ప్రధాని :

మహిళల కనీస వివాహ వయసును పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గత ఏడాది ఎర్రకోటపై నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ ప్రసంగంలోనూ యువతుల పెళ్లి వయసు పెంచబోతున్నామనే సంకేతాన్నిచ్చారు.

జనాభా నియంత్రణ కోసం కాదు...

మహిళల కనీస వివాహ వయసును పెంచడం వెనుక కారణం జనాభా నియంత్రణ కాదని జయా జైట్లీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మహిళలకు సాధికారత కల్పించడం కోసమే వారి వివాహ వయసు పెంచాలని సిఫార్సు చేసినట్లు వివరించారు. సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలైన జయా జైట్లీ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ నిపుణుల బృందం యువతుల వివాహ వయసు నిర్ధారణకు దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరిపింది.

కొనసాగుతున్న బాల్య వివాహాలు :

ఆంధ్రప్రదేశ్‌లో ఏటా జరిగే వివాహాల్లో 33.2% పెళ్లి కూతుళ్ల సగటు వయసు 18-20 ఏళ్ల మధ్యే ఉంటోంది. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం... రాష్ట్రంలో పట్టణాల్లో 21.7%, గ్రామాల్లో 32.9% బాల్యవివాహాలు జరుగుతున్నాయి. 15-19 ఏళ్లలోపే తల్లులు అవుతున్న వారు పట్టణాల్లో 9.3%, గ్రామాల్లో 14.1% ఉంటున్నారు. రాష్ట్రంలో 2015-2021 మధ్య 6,622 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అంతకు అనేక రెట్లు అధికంగా ఇవి జరుగుతున్నా రికార్డుల్లోకి ఎక్కట్లేదు.

యువతుల ఆరోగ్యపరంగా మేలే :

బాల్యవివాహాలతో అమ్మాయిలు టీనేజీలోనే గర్భం దాలుస్తారు. 21 ఏళ్ల పైబడిన తర్వాత గర్భం దాల్చిన వారితో పోలిస్తే ఇలాంటి వారికి కొన్ని సమస్యలు అధికంగా ఉంటాయి. 21 ఏళ్ల వయసు దాటితే శారీరకంగా ఎదుగుదలతోపాటు మానసిక పరిపక్వత కూడా అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఈ నిర్ణయం మేలు కలిగించేదే.

- డా.భారతి, సూపరింటెండెంట్‌, రుయా ఆసుపత్రి


హేతుబద్ధత లేని నిర్ణయం :

మహిళల  వివాహ వయసు పెంపు నిర్ణయంలో హేతుబద్ధత లేదు. సరైన అధ్యయనం, చర్చలు లేకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నష్టాలే అధికంగా ఉంటాయి.

- రమాదేవి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండాలి : 

వివాహం అమ్మాయిల వ్యక్తిగత అభీష్టం మేరకు జరగాలి. బాలికలకు 18 ఏళ్లు వచ్చినపుడు పరిణితితో ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ఆ వయసు వచ్చిన తరువాత యువతి తనకు ఇష్టమైనపుడు వివాహం చేసుకునే స్వేచ్ఛ అందించాలి. అంతేకానీ కనీస వయసు పేరిట ఆంక్షలు పెట్టడం సరికాదు.

- జమీలా నిషత్‌, షాహీన్‌ ఉమెన్‌ రిసోర్సెస్

Post a Comment

0 Comments