GET MORE DETAILS

55 శాతం ఇవ్వాల్సిందే...! ఫిట్‌మెంట్‌పై జేఏసీల పట్టు

 55 శాతం ఇవ్వాల్సిందే...! ఫిట్‌మెంట్‌పై జేఏసీల పట్టు



సీఎస్‌ కమిటీ సిఫారసులు అమలుచేస్తే ఉద్యోగుల మనుగడే ప్రశ్నార్థకం

ఉద్యోగ సంఘాల నేతల అసంతృప్తి

50 శాతం ఇవ్వాలి: సూర్యనారాయణ

34కు తగ్గకూడదు: వెంకట్రామిరెడ్డి


వేతన సవరణ, ఫిట్‌మెంట్‌పై సీఎస్‌ సారథ్యంలోని అధికారుల కమిటీ చేసిన ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఫిట్‌మెంట్‌పై వారు తలో అభిప్రాయం వ్యక్తంచేశారు. 55శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందేనని ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేయగా.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ 50శాతం కావాలని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాత్రం 34శాతానికి తగ్గకుండా ఇవ్వాలని కోరడం గమనార్హం. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ జనరల్‌ సెక్రటరీ హృదయరాజు డిమాండ్‌ చేశారు. 

అశుతోష్‌ నివేదిక అమలు చేయాలి: బండి

సీఎస్‌ కమిటీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి, ఉద్యోగులకు.. ఎవరికీ మేలు చేసేవి కావు. వీటిని అమలు చేస్తే ఉద్యోగుల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. అశుతోష్‌ మిశ్రా నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరాం. మాకిచ్చిన హామీలు అమలయ్యేవరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. 11వ పీఆర్‌సీ అంశా లు, 70 డిమాండ్ల అమలుపై సజ్జలతో చర్చించాం. నిరాశానిస్పృహల్లోకి వెళ్లిన ఉద్యోగులకు సీఎం సంతోషం కలిగించే వార్త చెబుతారని ఆశిస్తున్నాం. 2018 జూలై 1 నుంచి 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్నదే మా డిమాండ్‌.

ఆ సిఫారసులను వ్యతిరేకిస్తున్నాం: బొప్పరాజు

ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇచ్చిన సీఎస్‌ కమిటీ సిఫారసులను వ్యతిరేకిస్తున్నాం. వాటిపై ఆ కమిటీ మాతో కనీసం చర్చించలేదు. ఫిట్‌మెంట్‌, ఆర్థిక ప్రయోజనాల అమలు, లబ్ధిపై వ్యత్యాసాలు ఉన్నాయి. సీఎంతో జరిగే చర్చల్లో దీనిపై స్పష్టత తీసుకుంటాం. 14.29 శాతం ఫిట్‌మెంట్‌తో 13 లక్షల మంది ఉద్యోగులు నష్టపోతారు. ఐఆర్‌ కంటే అదనంగా ఫిట్‌మెంట్‌ ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలని సజ్జలను కోరాం. హామీల అమలు చేస్తామని ప్రభుత్వం అగ్రిమెంట్‌ రూపంలో ఇస్తే ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటాం. 

సీపీసీ ఫిట్‌మెంట్‌కు నో: సూర్యనారాయణ

ఉద్యోగులకు 50ు ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని.. 2018నుంచి ఫిట్‌మెంట్‌, ఆర్థిక ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరాం. సజ్జలకు మా అభిప్రాయాలు లిఖితపూర్వకంగా ఇచ్చాం. సీపీసీ ప్రకారం ఫిట్‌మెంట్‌ అంగీకారం కాదని చెప్పాం. 

ఐఆర్‌ కంటే తక్కువ ఇవ్వొద్దు: వెంకట్రామిరెడ్డి

అధికారుల కమిటీ సిఫారసులేవీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవు. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని చెప్పాం. 34శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాం. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ అంగీకరించబోమని చెప్పాం. మా డిమాండ్లను సీఎం దృష్టికి  తీసుకెళ్తామని సజ్జల హామీ ఇచ్చారు. 

హామీ ఇచ్చి.. ఉద్యోగులను మోసం చేస్తారా?: సీపీఎస్ ఈఏ రాష్ట్ర నేతలు

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీఇచ్చి.. ఇప్పుడు సీపీఎస్‌ రద్దుకు అడ్డంకులున్నాయని చెప్పడం సరైందికాదని ఏపీ సీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.అప్పలరాజు, కె.పార్ధసారథి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

2వేల పింఛనుతో ఎలా బతకాలి: ఏపీటీఎఫ్‌

దశాబ్దాల పాటు ప్రభుత్వ సర్వీసు చేసి పదవీ విరమణ తర్వాత సీపీఎస్‌ విధానంలో రూ.700 నుంచి రూ.2వేలు పింఛను వస్తే ఎలా బతకాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌రెడ్డి హామీ ఇచ్చారని, సాంకేతిక అంశాలు, బడ్జెట్‌ అంశాలు తెలీకుండా హామీ ఇచ్చామని సజ్జల అనడం సబబు కాదన్నారు. మాటకు కట్టుబడి తక్షణం సీపీఎ్‌సను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. 

సీఎస్‌ కమిటీ ప్రతిపాదనలు అమలు చేస్తే ఉద్యోగుల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. అశుతోష్‌ మిశ్రా సమర్పించిన పీఆర్‌సీ నివేదికను యథాతథంగా అమలు చేయాలి. 2018 జూలై 1 నుంచి 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి.

- ఉద్యోగ సంఘాలు

Post a Comment

0 Comments