UP : కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు!
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యుపి ప్రభుత్వం ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. రాష్ట్రంలో కోటిమంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. సిఎం యోగి పాలనలో యువతకు లాప్టాప్లు ఎలా వాడాలో కూడా తెలియదంటూ ఇటీవల రాయ్ బరేలీలో సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ల్యాప్టాప్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయని అన్నారు. అఖిలేష్ యాదవ్ విమర్శలు వెలువడిన మరుసటి రోజే యోగి ఈ ప్రకటన చేయడం గమనార్హం. మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి పుట్టినరోజ డిసెంబర్ 25న లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ తొలి దశను ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఎంఎ, బిఎ, బిఎస్సి, ఐటిఐ, ఎంబిబిఎస్, ఎంటెక్, బిటెక్ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల పంపిణీపై యుపి ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్ వినీత్ మాట్లాడుతూ.. ఇప్పటికే 38లక్షల మందికి పైగా విద్యార్థులు డిజి శక్తి పోర్టల్లో నమోదు చేయించుకున్నారని తెలిపారు. తదుపరి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం లావా, శామ్సంగ్, ఏసర్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆర్డర్లు చేశామని తెలిపారు. మొదటి దశలో పంపిణీ చేయబోయే పరికరాల కోసం రూ.2035 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
0 Comments