GET MORE DETAILS

కనుమ రోజున కోడి పందాలు _ "కోడి పందేల" చరిత్ర ఏంటో తెలుసుకుందాం.. !

కనుమ రోజున కోడి పందాలు _ "కోడి పందేల" చరిత్ర ఏంటో తెలుసుకుందాం.. !



 సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరి నోటా వినబడే పేరు అనడంలో సందేహం లేదు. నిజం చెప్పాలంటే కోడి పందేల చరిత్ర ఈనాటిది  కాదు. అనాదికాలం నుండి శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గారి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' లో సైతం కోడి పందేల గురించి విపులంగా రాశారు. సంక్రాంతి వేళ కోడికి కత్తి కడితే కనక వర్షమే అనే సామెత పాతదైనా.. అందులో సత్యం ఎంత ఉందనే విషయం మాత్రం అనుమానమే. ఎందుకంటే వినోదం కోసం నిర్వహించే కోడి పందేలు వేరు..  డబ్బు కోసం ఆడే కోడి పందేలు వేరు. మొదటి దాని వలన ఎలాంటి నష్టమూ లేదు. కానీ రెండవ దాని వల్లే కాపురాలు కూలిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. నేడు కోడిపందేల పేరుతో బెట్టింగ్ అనేది సాధారణమైపోయింది. అయినా కోడిపందేలు ఒక సంప్రదాయానికి చిహ్నం. మరి దీని చరిత్రను మనమూ ఒకసారి అవలోకనం చేసుకుందాం.

6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా సంక్రమించి ఇప్పటికీ కొనసాగుతోంది. సాధారణంగా బెట్టింగ్ కోసం కోడిపందేలు ఆడేవారున్నా.. ప్రసుత్తం  ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా బెట్టింగులు నిర్వహించడం గమనార్హం.

మీకో విషయం తెలుసా... పందెం కోళ్లల్లో కూడా చాలా జాతులున్నాయి. వాటిని విభజించి వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.  రసంగి , కౌజు , మైల , చవల , సేతువ , కొక్కిరాయి , పచ్చకాకి , ఎరుపుగౌడు , తెలుపుగౌడు లాంటి పేర్లతో వాటిని పిలుస్తుంటారు. డేగ , కాకి బాగా పాపులరైన జాతులు.

అలాగే పందెం కోడిపుంజులకంటూ ఒక పంచాంగం ఉంది. దానినే "కుక్కుట శాస్త్రం" అంటారు. 

పూర్వం ఆంధ్ర క్షత్రియులు (రాజులు) తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు.  బొబ్బిలి యుద్ధం , పల్నాటి యుద్ధానికి కారణం కూడా కోడి పందేలే అన్నది జగమెరిగిన సత్యం.

1646లో జార్జి విల్సన్‌ అనే ఓ ఆంగ్ల రచయిత  కాక్‌ ఆఫ్‌ ది గేమ్‌  అనే గ్రంథంలో కోడి పందేల గురించి రాశారు. ఇరాన్‌ , ఇండోనేషియా , బ్రెజిల్‌ , పెరు , ఫిలపైన్స్‌ , మెక్సికో , ఫ్రాన్స్‌ , క్యూబా , పాకిస్తాన్‌ , అమెరికా , జపాన్‌ , మొదలైన దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోడి పందేల ఆచారం ఉంది.

కుక్కుటశాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశారని చెబుతుంటారు. ఏ సమయంలో ఏ జాతి పుంజును బరిలోకి దింపితే.. అది గెలుస్తుందో గణాంకాలు వేసి మరీ పందేలు కాస్తారు. కోడి యజమాని పేరులోని అక్షరాలు , తిథుల ఆధారంగా కూడా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని కుక్కుట శాస్త్రం చెబుతుంది

పందెం కోళ్ల పోషణ కూడా ఆషామాషీగా ఉండదు. వాటికి చాలా బలవర్థమైన ఆహారాన్ని అందిస్తారు. జీడిపప్పు , పిస్తా , బాదం కూడా వాటికి తినిపిస్తుంటారు. 

ప్రస్తుతం పందెం కోళ్ళ అమ్మకానికి సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్ కూడా బాగా పుంజుకుంది. కార్పొరేట్ బిజినెస్ కూడా షురూ అయ్యింది. పూర్వకాలం నుండీ కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తున్నారు. ఎత్తుడు దించుడు పందెం , చూపుడు పందెం , ముసుగు పందెం , డింకీ పందెం అని వాటిని పిలవవచ్చు.

సంక్రాంతి కోడి పందాల వెనుక కథ ఇదీ...

పౌరుషానికీ , రాజసానికీ పెట్టింది పేరు పందెం కోళ్లు. ఒక్కసారి బరిలో దిగాయంటే ప్రాణాలైనా వదిలేస్తాయి గానీ... వెనకడుగు వెయ్యవు. కోళ్లలో ఈ ప్రత్యేక లక్షణమే పందేలకు పురిగొల్పేలా చేస్తోంది. కోళ్ల చరిత్ర , పందేల ప్రస్థానం తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.

ప్రపంచంలో 10 వేల రకాల జాతుల పక్షులున్నాయి. వాటిలో భాగమైన కోళ్లలోనే దాదాపు 100 రకాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఇన్ని రకాలున్నాయి గానీ... అసలీ కోడి జాతి మొట్టమొదట ఎలా పుట్టిందో పరిశోధకులకు కూడా తెలియదు. ఓ అంచనా ప్రకారం తూర్పు , దక్షిణ ఆసియా దేశాల్లో మొట్ట మొదటిసారిగా కోడి జాతి జన్మించినట్లు చెబుతున్నారు. సాధారణంగా మనుషులతో జీవించేందుకు పక్షులు ఇష్టపడవు. అలాంటిది కోళ్లు మాత్రం మనుషులను చూసి పారిపోతూనే... అదే మనుషులతో మచ్చికగా ఉంటాయి. ఇందుకు కారణం కోళ్లు తినే ఆహారం ఎక్కువగా మనుషుల ఇళ్లలో ఉండటమే అనే వాదన వినిపిస్తోంది. ఎప్పుడో 10 వేల ఏళ్ల కిందటే కోళ్లను ప్రజలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆధారాలు కావాలంటే మాత్రం సింధు నాగరికతా కాలమైన క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దంలో లభిస్తున్నాయి. హరప్పా, మొహెంజోదారోలో కోడి ఆకారంలోని కొన్ని చిత్రాలు కనిపించాయి. తద్వారా అప్పటి ప్రజలు కోళ్లను పెంచుకున్నట్లు తెలిసింది.

కోళ్లకు సైంటిఫిక్ ఆధారాలేవి ?

ప్రస్తుతం ఉన్న కోళ్లను ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. వాటిలో ఒకటి గ్రే జంగల్ ఫౌల్. ఇవి ఇండియాలో ఎక్కువగా కనిపించే కోళ్లు. రెండో రకం రెడ్ జంగల్ ఫౌల్. ఇవి తూర్పు ఆసియాలో కనిపించే కోళ్లు. ఇండియన్ కోళ్ల కంటే తూర్పు ఆసియాలో కోళ్లు పొడవైన రెక్కలు , పెద్ద సైజు తోకతో ఆకట్టుకుంటున్నాయి.

కోళ్ల పందేల చరిత్ర :

కోళ్ల పందేల్లో ఇప్పుడంటే డబ్బుతో పందేలు కట్టి ఆడుతున్నారు కానీ... పూర్వం... అంటే సింధు నాగరికత కాలంలో కోళ్ల పందేలు వినోదం కోసం మాత్రమే జరిపేవాళ్లు. ఈజిఫ్టులో కూడా కోళ్ల పందేలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. మనుషులకు ఎలాంటి హానీ లేకుండా... పక్షులు మాత్రమే దెబ్బలాడుకుంటుంటే , ఆ యుద్ధాన్ని చూసి ఆనందపడుతూ అదో వినోదంగా భావించేవాళ్లు అప్పటి పాలకులు.

గ్రీస్‌లో యుద్ధాలకు వెళ్లేముందు శత్రువుల పేర్లను కోళ్లకు పెట్టి పందేలు కాసేవాళ్లు. తద్వారా తమ పుంజు గెలిస్తే , యుద్ధం గెలిచినట్లు భావించేవాళ్లు. సిరియన్లైతే... గెలిచిన కోళ్లకు పూజలు చేసేవాళ్లు. కోడి గెలిస్తే , తాము కూడా విజయం సాధిస్తామన్న బలమైన నమ్మకం వాళ్లది. రోమన్లు... చనిపోయిన కోళ్లను దేవతలకు నైవేద్యంగా ఇచ్చేవాళ్లు. ఇక దాని జోలికి వెళ్లేవాళ్లు కాదు. రానూరానూ కోళ్ల పందేల అర్థం మారిపోయింది. పరువు, ప్రతిష్టలకు ప్రతిరూపంగా భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పందేలు :

తెలుగు నేలపై కోళ్ల పందేలకు సంబంధించి కచ్చితమైన ఆధారాలున్నాయి. 11వ శతాబ్దంలో అప్పటి పల్నాటి రాజులు కోళ్ల పందేలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాల నాగమ్మతో పందెంలో ఓడిపోయిన పల్నాటి బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లాడని చరిత్రలో ఉంది. బొబ్బిలి , విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందేలు జోరుగా సాగాయి. కోడి ఓడితే , పరువు పోయినట్లు , తల కొట్టేసినట్లు భావించేవాళ్లు.

ఇప్పుడు లక్షలు పోసి పందేలు :

కాలం గడిచే కొద్దీ , కోడి పందేలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి తెలుగు రాష్ట్రాలు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు , కృష్ణా , గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల రూపాయల బెట్టింగులు జరుగుతున్నాయి. జీవహింస మహా పాపం అంటూనే... కోళ్లకు కత్తులు కట్టి మరీ విన్యాసాల్ని వీక్షిస్తున్నారు ప్రజలు.

Post a Comment

0 Comments