GET MORE DETAILS

దానం వల్ల కలిగిన పుణ్యం విలువ తెలుసా...?

దానం వల్ల కలిగిన పుణ్యం విలువ తెలుసా...?

              


కాశీకి చేరుకున్నారు ఒక జంట.   కొన్నేళ్ల తరువాత వారికి ఒకమ్మాయి పుట్టింది. చిన్నప్పుటి నుండి శివారాధనలో మునిగింది అమ్మాయి. భక్తిలో ఆ ఈశుడినే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.

ఆమె కాశీకి దైవదర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది. అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, తండ్రి తోడుగా ఉన్నాడు. ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె ‘వివాహం చేసుకోను,ఇలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను!’ అని చెప్పింది.

ఆమె కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది. దాహంతో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడకు వచ్చి దాహం తీర్చుకుంటారని! ఆమె అడిగినవారికి దానం చేయడం తెలుసుకున్న అందరూ ఆమెను వచ్చి అడుగుతుంటే… కాదనలేక అందరికి ఇస్తూ అప్పులుపాలైపోయింది.

అప్పటి వరకు ఆమెను పొగిడిన అందరు ఆమెను నిష్టూరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ”మా డబ్బులు మాకు ఇవ్వండి!” అంటూ గొడవ పెట్టారు. ఆమెకు ఏం చేయాలో అర్థం కానివేళ ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర తన అప్పులు తీర్చమని అడిగింది. అప్పు మొత్తం ఐదు లక్షలు అని చెప్పింది.

అతడు “తాకట్టుగా నీ దగ్గర ఏముంది!” అని అడిగాడు. అందుకు ఆమె “నాదగ్గర ఏమి లేదు నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప!” అన్నది.

”నీ పుణ్యం నాకు ఎలా వస్తుంది?” అంటే…

“ఇదిగో ఇక్కడ నేను కట్టించిన నీటి తొట్టే ఉంది, అక్కడకి వచ్చి దాహం తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరింది ఇప్పుడు ఆ నీటి తొట్టెను మీకు ఇస్తున్నాను. నా పుణ్యం తీరేవరకు అక్కడ వచ్చే పుణ్యం మీదే!” అంది.

”నాకెలా తెలుస్తుంది- నాకెంత పుణ్యం వచ్చిందో?” అని అంటే…

ఆమె ఒక లింగ రూపం అయిన రాయిని తీసి “అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను, అది మునిగి నదిలో ఉంటుంది. ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి తేలుతుంది!” అని చెప్పింది.

రాయి మునిగిపోతుంది, కాని ఎప్పటికీ తేలదు అని అనుకుని అతడు ఆమెకు ఐదులక్షలు అప్పు తీర్చాడు. ఆ తరువాత ఆ వ్యక్తి ఆ తొట్టే దగ్గర ఒక వ్యక్తిని నియమించాడు. ఎంతమంది అక్కడకు వచ్చి నీళ్లు తాగుతున్నారని లెక్కకట్టమన్నాడు.

ఆరోజు రాత్రి గడిచింది...

ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు.

అతడి నివాసం నుండి అతను నదిలోకి చూస్తూ ఉన్నాడు.

’అనవసరంగా అంత డబ్బు గుడ్డిగా నమ్మి ఇచ్చాను.,

 మోసపోయానేమో?’ అని అనుకుంటుండగా… 

ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టెలోని నీరు తాగింది. అంతే! నదిలో ఆమె విసిరిన లింగం పైకి తేలింది.

ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి!  ‘ఏంటి ఐదులక్షలు విలువ చేస్తుందా పుణ్యం ఈ ఒక్క ఆవు తాగిన ఈ చుక్క నీరు  అంటే ఆ తల్లి చేసిన పుణ్యం నా కోట్లు కుమ్మరించినా సరితూగదు కదా!’ అని ఆమెను వెతుక్కుంటూ పరుగు పెట్టాడు.

ఆ రోజు నుండి అతను కూడా అందరికీ సాయం చేయడం మొదలుపెట్టాడు.  ఆ ఈశుడిని భక్తిగా కొలవడం మొదలుపెట్టాడు.

మనం మంచితనంతో సంపాదించుకున్న పుణ్యం  చాలా విలువైనది వెల కట్టలేనిది. చెడు ఒక్క క్షణం కూడా తలవకు మంచిని నిమిషమైన మరిచిపోకు!

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Post a Comment

0 Comments