అక్షయలింగేశ్వరుడు - అక్షయ తృతీయనాడు దర్శించదగిన దక్షిణాది దేవాలయం.
కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు తన కళ్యాణం కోసమై కుబేరుని వద్ద అప్పు చేసేడని పురాణాలు వివరిస్తున్నాయి. దైవానికే అప్పు ఇచ్చేటంత ఐశ్వర్యం కుబేరునికి ఎలా వచ్చింది ?
పరమశివుని తపస్సు చేసి మెప్పించినందున, కుబేరుని ఉత్తరదిశకు అధిపతిని చేసి, నవనిధులను అప్పగించి, అలకాపురి అనబడే కుబేరపురిని పాలించే అధికారాన్ని కూడా అనుగ్రహించాడని కేడిలియప్పర్ ఆలయ స్ధలపురాణం వివరిస్తోంది.
అక్షయతృతీయ నాడే ఈ మహాద్భాగ్యం కుబేరునికి లభించిందని స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. కుబేరుని కటాక్షించినది కీళ్ వేళూర్ కేడిలియప్పర్.
దేవ దానవులు పాల కడలిని చిలికినందువలన లభించిన అమృత కలశం నుండి పడిన ఒక అమృత బిందువు రెండుగా విడిపోయి ఈ భారత పుణ్య భూమిలో ఉత్తర దిశగాను, దక్షిణ దిశగాను పడి బదరీ(రేగిపళ్ళ) వనాలుగా రూపొందాయి.
ఉత్తర దేశంలో ని బదరీవనం ఉత్తరబదరికారణ్యంగా పేరుపొందింది. ఇదే ఉత్తరాఖండ్ లోని బదరీనాధ్ పవిత్ర క్షేత్రం. రెండవది దక్షిణ బదరికా వనంగా అనే పేరు పొందిన కీళ్ వేళూర్. కావేరీనదికి దక్షిణ తీరాన 84 వ శైవక్షేత్రం గా ప్రసిద్ధి చెందినది.
కావేరినదికి ఉపనది అయిన వెట్టాట్రునది కావేరి నుండి విడిపోయి ఓడమ్ పోక్కి అనే పేరుతో ఒక చిన్న నది దక్షిణ తీరాన ప్రవహిస్తున్నది. తిరుజ్ఞాన సంబంధర్ అనే నాయన్మార్ , పరమశివభక్తుడు కీళ్ వేళూర్ క్షేత్ర మహిమలను కొనియాడుతూ స్తోత్రం చేశారు. శూరపద్ముని వంటి సంహరించినందువలన తనకు ఏర్పడిన హత్యా దోషాన్ని పోగొట్టుకునేందుకు సెందిల్ ఆండవర్ (కుమారస్వామి) బాలసుబ్రహ్మణ్యం గా ఈశ్వరుని వేడుకుని తపమాచరించిన స్థలమే ఈ ఆలయం. దేవలోక సేనాధిపతి కుమారస్వామి కొలువై పూజించబడుతున్న 'జ్ఞాన స్కందపురి' మేల్ వేళూర్ అని ; కుమారస్వామి తపస్సు చేసిన స్ధలం 'కీళ్ వేళూర్'" అనే పేర్లతో ప్రసిధ్ధిచెందాయి.
ఒక యుగాంతమున మహాప్రళయం ఏర్పడి విశ్వమంతా జలమయం అయిన తరుణంలో భగవంతుడు ఇదే పుణ్యక్షేత్రంలో తిరిగి సృష్టి ప్రారంభించాడు. ఈ అపూర్వ సంభవం జరిగినది ఒక అక్షయతృతీయనాడు.
చిరంజీవిగా ఈశ్వరునిచే వరం పొందిన మార్కండేయ మహర్షి యుగయుగాలుగా మార్కండేయుడు శివుని పూజిస్తూ ఈ జల ప్రళయంవలన తపోభంగమవకుండా వుండేలా ఒక సురక్షిత ప్రాంతాన్ని చూపించమని వేడుకొనగా భగవంతుడు ఈ ప్రాంతాన్ని నిర్దేశించాడట.
మార్కండేయుడు ఈ క్షేత్రంలోనే శివుని నిరాటంకంగా పూజిస్తూ తన తపస్సు కొనసాగించాడు. కీళ్ వేళూర్ లో పరమేశ్వరుడు మూలవిరాట్ రూపంలో అక్షయలింగేశ్వరుడుగా కొలువై వున్నాడు.
ఈ ఆలయంలో పరమశివుడు ప్రకాశవంతమైన కాంతిగా మరకతలింగంగా ఆది అంతం లేని స్వయంభువుగా, త్రిమూర్తులు,ముగ్గురు అమ్మవార్లు, అష్టవసువులతో అష్టైశ్వర్యాలను ప్రసాదించే అక్షయాధిపతిగా విరాజిల్లుతున్నాడు. ఆయనే కేడిలియప్పర్.
అక్షయలింగస్వామి అనే సంస్కృత నామంతో పూజించబడుతున్న న్నాడు. మహేశ్వరుడు కొలువై వున్న ఈ ఆలయం 5 అంతస్థులుగా అనేక ఆవరణలతో నిర్మించబడినది. సన్నిధికి ఎదురుగా చిత్రగుప్తుని కి సహాయపడే పన్నెండుమంది శ్రవణరులు పన్నెండు స్ధంభాలుగా ఒక మహామండపంలో నెలకొని ఇక్కడికి వచ్చి పూజించేవారి పాపపుణ్యాలు బేరిజ్ వేసి వారికి మంచిని చేస్తారని ఐహీకం.
అక్షయ లింగ స్వామి వామ భాగమున పార్వతీదేవి వనములై నాయకి అనే సుందరకుచాంబికగా ప్రత్యేక సన్నిధిలో భక్తులను కాపాడుతున్నది. హిమాలయాలలో పరమశివుని వివాహం చేసుకున్న అంబిక తన ఎడమ హస్తాన్ని తొడమీద ఆన్చి, కుడి హస్తంతో భక్తులకు అభయాన్ని యిస్తూ, నాలుగు హస్తాలతో దేవి దర్శనమిస్తోంది.
అగస్త్య మహర్షి కి సతీసమేతంగా కళ్యాణ భంగిమలో దర్శనమిచ్చిన సుందర మూర్తిని, అమ్మవారిని ముత్తుస్వామి దీక్షితుల వారు " అక్షయ లింగ విభో'' అనే కీర్తనలో బదరీవన నాయకి అని వర్ణిస్తారు.
వివాహ భాగ్యం , సంతాన భాగ్యం కోసం వేడుకునే భక్తులను యీ దేవి అనుగ్రహిస్తున్నది. ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ అక్షయలింగ స్వామిని అక్షరస్వరూపో అని తన కీర్తనలో కీర్తించారు. ఇక్కడి అక్షయలింగేశ్వరుని భక్తితో కొలిచి సకల విద్యలలోను 64 కళలోను రాణించి ఉన్నత విజయాలు సాధించినవారు అనేకమంది వున్నారు.
ఈ ఆలయంలో జ్ఞాన గురువైన దక్షిణామూర్తి వీణాధర మూర్తిగా దర్శనమిస్తాడు.
0 Comments