Ads Area

శయనస్థితిలో హనుమంతుడు - భద్ర మారుతి ఆలయం

0

శయనస్థితిలో హనుమంతుడు - భద్ర మారుతి ఆలయం



హనుమంతుడు అనగానే అపారమైన భక్తి, పరాక్రమం,  అసమానమైన మేథస్సు, వినయం, విధేయతలు గుర్తుకొస్తుంటాయి. 

ఒక భక్తుడు ఎలా ఉండాలో ససాక్ష్యంగా నిరూపించిన భగవంతుడు హనుమంతుడు.

అనేక ప్రాంతాల్లో అనేక నామాలతో ఆవిర్భవించిన ఆయన భక్తాంజనేయుడుగా, వీరాంజనేయుడుగా, వరాల ఆంజనేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా, మారుతిగా అభయాన్ని ప్రసాదిస్తూ వుండే స్వామి. ఎక్కడ చూసినా నుంచునే దర్శనమిస్తూ ఉంటాడు. 

అయితే అందుకు పూర్తిభిన్నంగా స్వామి వారు పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం కూడా ఒకటి, మహారాష్ట్రలోని మరాట్వాడా అని పిలువబడే ఔరంగాబాద్ జిల్లాలో ప్రసిద్ధ ఎల్లోరాకి సుమారు 4 కి.మీ. దూరంలో 'ఖుల్తాబాద్'లో ఉంది. దానినే భద్ర మారుతి టెంపుల్‌గా పిలుస్తారు.

శయనస్థితిలో ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఈ భద్రమారుతి ఆలయం ప్రత్యేకత.

ఈ ఆలయ విశేషాలలోకి వెళ్తే... 

'భద్రమారుతి'గా పిలవబడే ఇక్కడి హనుమంతుడిని స్వయంభువుగా చెబుతుంటారు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడే కాసేపు పడుకుని సేదతీరుతాడని ఒక కథ ప్రచారంలో ఉంది.

పూర్వం భద్రావతీ నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు రాముడిపై గల అమితమైన భక్తితో శ్రీరాముడిని ఎప్పుడూ భజనలతో, స్త్రోత్రాలతో తనను తాను మైమరిపోయి స్తుతిస్తూ ఉండేవాడనీ, ఒక రోజు భద్రకూట్ సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా వినిన హనుమంతుడు అక్కడికి వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయి అక్కడే పడుకొని నిద్రపోయాడట. 

చాలా సేపటి తర్వాత అది గమనించిన ఆ భక్తుడు, హనుమంతుడి పాదాలపై పడి, లోకకళ్యాణం కోసం, భక్తులను సదా అనుగ్రహించేందుకు,  మీ భక్తులకు సకల శ్రేయస్సులు కలిగించేందుకు అక్కడే కొలువై ఉండవలసిందిగా విన్నవించుకోగా హనుమంతుడు ఆ కోర్కెను మన్నించి అక్కడే కొలువైనట్లు మరో కథనం ప్రాచూర్యంలో ఉంది. ఆ కారణంగా ఆయన శయన హనుమంతుడిగా దర్శనమిస్తూంటాడు. 

ఈ పురాతన ఆలయాన్ని ఎందరో రాజులు దర్శించి తరించినట్లు ఆధారాలున్నాయి. మహరాజుల నుండి సామాన్య భక్తుల వరకూ అందరూ ఇక్కడి స్వామి మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే. 

ఇక్కడ శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

జై హనుమాన్


Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area