GET MORE DETAILS

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త...!

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త...!



సిమ్‌కార్డులు తీసుకునేందుకు, ఆర్థిక లావాదేవీలకు ఇ-కేవైసీ కోసం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనూ వేలిముద్రలు వేస్తుంటాం.

● లావాదేవీ సమయంలోనే అన్‌లాక్‌ చేసుకోవాలి.

● ఆధార్‌కూ ఇలా చేస్తే మేలు.

● ఎంఆధార్‌, టోల్‌ఫ్రీ నంబరును వినియోగించుకోవాలి.

● సిమ్‌కార్డులు తీసుకునేందుకు, ఆర్థిక లావాదేవీలకు ఇ-కేవైసీ కోసం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనూ వేలిముద్రలు వేస్తుంటాం.

● ఆధార్‌ కార్డు జారీచేసేప్పుడు మన వేలిముద్రలు/కనుపాపల ఐరిస్‌ తీసుకుని, డేటాలో నిక్షిప్తం చేసినందున, ఆధార్‌ అనుసంధానిత పథకాల్లో వ్యక్తుల ధ్రువీకరణ క్షణాల్లో పూర్తవుతోంది.

● అయితే వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఈ వేలిముద్రల డేటాను సేకరిస్తున్న మోసగాళ్లు, వాటితో వేలిముద్రల రూపులు తయారు చేసి, వేరే రాష్ట్రాల్లో నగదు అపహరిస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి.

● ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.

● ఇందుకోసం ఆధార్‌, బయోమెట్రిక్స్‌ వివరాలను లాక్‌ చేసుకుని, అవసరమైనప్పుడు అన్‌లాక్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

● ఇందుకు సంక్షిప్త సందేశాలు(ఎస్‌ఎంఎస్‌) లేదా  ఎం ఆధార్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చు.

ఎలాగంటే...

1. ఆధార్‌తో అనుసంధానమైన సిమ్‌కార్డు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఎంఆధార్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

2. దీనిలో మన ఆధార్‌ నెంబరు నమోదు చేసి, సూచనలు పాటిస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.

3. తదుపరి 16 అంకెల వర్చువల్‌ ఐడీని సృష్టించుకోవాలి. దీనిని 24 గంటలకు ఒకసారి మార్చుకోవచ్చు కూడా._*

4. ఇది నమోదయ్యాక యాప్‌లో మన ఆధార్‌ కార్డు ప్రత్యక్షమవుతుంది.

5. తదుపరి కింది భాగంలో సర్వీసెస్‌, మైఆధార్‌, ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌, మోర్‌ వంటి విభాగాలుంటాయి.

6. ఇందులో మైఆధార్‌ను క్లిక్‌ చేస్తే గెట్‌ ఓటీపీ, క్యూఆర్‌కోడ్‌, ఇ-కేవైసీ, అథెంటికేషన్‌ హిస్టరీ, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతా, అప్‌డేట్‌ హిస్టరీ వంటివి కనిపిస్తాయి.

7. వాటి దిగువన ఆధార్‌ అప్‌డేట్‌, బుక్‌ యాన్‌ అపాయింట్‌మెంట్‌, వర్చువల్‌ ఐడీ, బయోమెట్రిక్స్‌లాక్‌, ఆధార్‌ లాక్‌ కనపడతాయి.

ఈ మోసాల బారిన పడకుండా...

◆ మనం యూపీఐ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసో, ఫోన్‌ నెంబరుకు నగదు బదిలీ ద్వారానో బిల్లులు చెల్లిస్తుంటాం. ఇవన్నీ కూడా మన ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా- ఫోన్‌నెంబరు జత అయిన ఫలితంగానే సాధ్యమవుతోంది. ఏటీఎంలలో అయితే నగదును కార్డు-పిన్‌ వినియోగించుకుని, ఉపసంహరిస్తుంటాం. గ్రామాల్లో ఏటీఎంలు అతి తక్కువగా ఉన్నాయి. గ్రామీణులకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి అందించేందుకు, ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ‘బ్యాంకింగ్‌ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌’ (సీఎస్‌పీ)లను బ్యాంకులు నెలకొల్పాయి. ఆధార్‌తో అనుసంధానమయ్యే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు సాధారణ బ్యాంక్‌ ఖాతాదారులు కూడా నగదును ఈ కేంద్రాల్లో ఉపసంహరించుకోవచ్చు. గరిష్ఠంగా ఒక వ్యక్తి రోజుకు రూ.30,000 వరకు ఇక్కడ విత్‌డ్రా చేయొచ్చు.

◆ ఒక బ్యాంక్‌ తరఫున నిర్వహించే కేంద్రంలో ఏ బ్యాంక్‌ ఖాతాదారు అయినా ఆధార్‌ అనుసంధానిత వివరాలతో, వేలిముద్ర వేసి కూడా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఈ సదుపాయాన్నే బిహార్‌ వంటి చోట్ల నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఖాతాదారుల వేలిముద్రలు, ఆధార్‌ వివరాలు సేకరించి, వాటితో రూపులు తయారు చేస్తున్నారు. తదుపరి సుదూర రాష్ట్రాల్లో తమకు అనువుగా ఉన్న గ్రామాల్లోని సీఎస్‌పీల దగ్గర, ఆ వేలిముద్రల సాయంతో, సంబంధితుల ఖాతాలోని నగదును అపహరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై విశాఖ పోలీసులు కేసులు కూడా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

వేలి ముద్రల సమాచారం రక్షణకు :

వేలిముద్రల వివరాలు లాక్‌ చేసుకునేందుకు బయోమెట్రిక్స్‌లాక్‌ను టచ్‌ చేయాలి. అప్పుడు ఓటీపీ నమోదు చేస్తే, లాక్‌ అయిపోయినట్లే. మళ్లీ మనం ఎక్కడైనా ఆధార్‌ అనుసంధానిత పథకాల్లో వేలిముద్ర వేయాలనుకున్నప్పుడు అన్‌లాక్‌ చేయాలనుకుంటే, అక్కడే అన్‌లాక్‌ బయోమెట్రిక్స్‌ను టచ్‌ చేయాలి. అప్పుడు దాదాపు 10 నిమిషాల సేపు మాత్రమే బయోమెట్రిక్స్‌ను వినియోగించుకోవచ్చు. ఇందువల్ల మన ఆధార్‌ అనుసంధానిత వేలిముద్రలను ఎవరూ ఉపయోగించలేరు. ఎవరైనా అక్రమంగా ప్రయత్నించినా, తెలిసిపోతుంది.

ఆధార్‌ వివరాల రక్షణకు :

◆ బయోమెట్రిక్స్‌ లాక్‌ కిందే ఆధార్‌ లాక్‌ లింక్‌ ఉంటుంది. దీనికి కూడా వర్చువల్‌ ఐడీ, ఓటీపీ వంటివి నమోదు చేశాకే, ఆధార్‌ లాక్‌ అవుతుంది. తదుపరి వర్చువల్‌ ఐడీని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

◆ https://resident.uidai.gov.in/bio-lock  వెబ్‌సైట్‌లో ఆధార్‌/వర్చువల్‌ ఐడీ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసినా కూడా ఈ సేవలు పొందొచ్చు.

మెసేజ్‌ ద్వారా :

◆ ఈ ప్రక్రియలో వర్చువల్‌ ఐడీ కీలకం. ఒకవేళ వర్చువల్‌ ఐడీ మరచిపోతే, ఆధార్‌ నమోదిత మొబైల్‌ నుంచి టోల్‌ ఫ్రీ నంబర్‌ 1947కు ఆధార్‌లోని చివరి 4/8 అంకెలను మెసేజ్‌ చేసి, పొందొచ్చు. ఉదాహరణకు చివరి అంకెలు 1234.. అయితే ఆర్‌వీఐడీ 1234 అని 1947కు మెసేజ్‌ చేస్తే వస్తుంది.

◆ ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా వర్చువల్‌ ఐడీ పొందొచ్చు. ఆధార్‌లోని చివరి 4 అంకెలు 1234 అయితే జీవీఐడీ 1234ని 1947కు పంపితే ఇది వస్తుంది.

మా కేంద్రాల్లో సమాచారం నిల్వ ఉండదు :

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న సీఎస్‌పీలలో ఖాతాదారుల వివరాలు నిల్వ ఉండవు. మార్ఫో ఆర్‌డీ సెన్సర్‌ పరికరాలను వాడుతున్నందున, ఖాతాదారు వేలిముద్ర వేయగానే ఆ వివరాలు బ్యాంక్‌ సర్వర్‌కు వెళ్లి, ధ్రువీకరణ పొందాక, ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయి. ఇందువల్ల ఈ కేంద్రాల్లో లావాదేవీలు సురక్షితమే. ఆధార్‌, బయోమెట్రిక్స్‌ను లాక్‌ చేసుకుంటే  మోసపోయే ప్రమాదాలు తగ్గుతాయి.


కె.రంగరాజన్‌, 

డీజీఎం, 

స్‌బీఐ.




Post a Comment

0 Comments