GET MORE DETAILS

శ్రీ రామనవమి పూజా విధానము. శ్రీరామనవమి రోజున - వడపప్పు, పానకం, విసనకర్ర ప్రాధాన్యత.

శ్రీ రామనవమి పూజా విధానము. శ్రీరామనవమి రోజున - వడపప్పు, పానకం, విసనకర్ర ప్రాధాన్యత.



శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వనారనే.

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

శ్రీరామ నవమి విశిష్టత - దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి.

శ్రీరామ నవమి విశిష్టత :

శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.

ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. 

గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. 

శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.

రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు.

మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి.

ఇంట్లో జరుపుకునే విధానము :

శ్రీ రామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి.

పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. 

పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి.

అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. 

ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. 

అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి.

అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది.

నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. 

పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.

శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. 

దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. 

ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది.పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.

పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.

ఇక పానకం ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు :

● బెల్లం - 3 కప్పులు

● మిరియాల పొడి - 3 టీ స్పూన్లు,

● ఉప్పు - చిటికెడు,

● శొంఠిపొడి - టీ స్పూన్,

● నిమ్మరసం - మూడు టీ స్పూన్లు,

● యాలకుల పొడి - టీ స్పూన్

● నీరు - 9 కప్పులు

తయారీ విధానం : ముందు బెల్లాన్ని మెత్తగా కొట్టుకుని.. నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే పానకం సిద్ధమైనట్లే.

వడపప్పు ఎలా చేయాలంటే...?

కావలసిన పదార్థాలు :

● పెసరపప్పు - కప్పు,

● కీరా - ఒక ముక్క,

● పచ్చిమిర్చి - 1 (తరగాలి),

● కొత్తిమీర తరుగు - టీ స్పూన్,

● కొబ్బరి తురుము - టేబుల్ స్పూన్,

● ఉప్పు - తగినంత

తయారీ విధానం : పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపితే వడపప్పు రెడీ అయినట్లే. 

ఈ ప్రసాదాలను స్వామివావికి నివేదన చేసి భక్తులకు వితరణ చేయాలి.

శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం, విసనకర్ర ప్రాధాన్యత

శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం ఇస్తారు. విసనకర్రలు దానం చేస్తారు♪.

ఉగాది తర్వాత వచ్చే పండగల్లో శ్రీరామనవమి ముఖ్యమైనది. ఆనాడు లోకకళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో, పాటలతో జరిపించాక వడపప్పు, పానకం ఇస్తారు.

నానబెట్టిన పెసరపప్పునే వడపప్పు అంటారు. శ్రమను హరించే పప్పు వడపప్పు. శ్రమ పడినప్పుడు ఎండాకాలంలో వడ కొడుతుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో కొంత వేడి ప్రారంభంలో వచ్చే పండగ. వడపప్పు తినడం చేత చల్లదనం ఏర్పడుతుంది.

పానకం అనేది బెల్లం, మిరియాలతో చేస్తారు. పానకం శుభకార్యక్రమాలలోనే అవసరం♪. పెళ్ళిళ్ళలో పానకం బిందెలు ఇవ్వడం ఒక తతంగం. మాధుర్యమే కాక ఎదుటివారు చల్లగా వుండాలనేది కూడా వుంది. సీతారాముల కళ్యాణం ఒక శుభపర్వం. ఆ సమయాన పానకం పంపకం తీయని సందర్భం.

పూర్వకాలంలో వేసవికాలంలో విద్యుచ్ఛక్తి ఉండని కాలంలో, ఫ్యాన్లూ అవీ లేని కాలంలో తాటాకు విసనకర్రలే తాపం పోవడానికి, గాలి రావడానికీ వాడుకునేవారు. విసనకర్రలు గతంలో రెండు రకాలుగా వుండేవి. వెదురుతో చేసిన విసన కర్రలు పొయ్యిలకి, కుంపట్లకీ ఉపయోగించేవారు. తాటాకు విసనకర్రలు గాలి పొందడానికి, తాపాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించేవారు. మామిడిపండ్ల కాలం రావడంతో మామిడిపళ్ళు, విసనకర్రలు ఇవ్వడం పుణ్యప్రదం. అంతేకాదు, ఇతరులు హాయిగా వుండటం కోరుకోవడం కూడా వుంది. శ్రీరామనవి నాడు విసనకర్రలు దానం చేయడం కూడా అందుకే♪.

 

          🚩జై శ్రీరామ్🚩


 

సర్వే జనాః సుఖినోభవంతు.

 లోకాస్సమస్తా సుఖినోభవంతు.

 హిందువునని గర్వించు...

 హిందువుగా జీవించు...



Post a Comment

0 Comments