GET MORE DETAILS

ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార (నేడు చిత్రకారుడు దామెర్ల రామారావు జయంతి)

ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార (నేడు చిత్రకారుడు దామెర్ల రామారావు జయంతి)



యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

మన దేశంలో చిత్రకళ అనగానే ముందుగా రవివర్మ గుర్తుకు వస్తారు.ఆంధ్ర ప్రదేశ్ లో ఆ స్థాయిలో ఈ రంగంలో పేరు పొందారు దామెర్ల. వుమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1897 మార్చి 8వ తేదీన ప్రముఖ వైద్యుడు దామెర్ల వెంకట రమణారావు, లక్ష్మీదేవిలకు రెండవ కుమారుడుగా దామెర్ల జన్మించారు. చిన్నతనం నుంచీ ఆయనకు చిత్రకళ పట్ల అభిరుచి ఉండేది. రామారావు మేనమామ పాఠశాలలో డ్రాయింగు టీచరుగా పనిచేసేవాడు. అన్నివేళలా ఆయనతో ఉండటం వలన కాబోలు రామారావుకి కూడా చిత్రలేఖనం మీద మనసు మళ్ళింది. ఆరేళ్ళ వయసునుండి గోడమీద బొగ్గుతో బొమ్మలు, ఆపైన తెల్ల కాగితాల మీద వేయటం ప్రారంభించాడు. మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ళవయసుకి చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీయటం, అవి అందరి అభినందనలు అందుకోవటం మొదలయింది. కొబ్బరితోటల్లో కూర్చుని, గోదావరి గట్టు మీద కూర్చుని, లాంచీలో తిరుగుతూ అనేక ప్రకృతి దృశ్యాలను చిత్రించాడు.

ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు.

కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి పంపాడు. 1916 లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె. స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల సంచాలకుడైన సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా మూడవ సంవత్సరములో చేర్చుకొన్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని మద్రాసీ అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి అందరూ ఆశ్వర్యపోయారు. ఆనాటి నుండి తిరుగులేని చిత్రకారుడు అయ్యాడు. చివరి సంవత్సరంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై మేయో బంగారు పతకాన్ని రామారావు పొందాడు. వెంటనే చిత్రకళశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. కాని స్వరాష్ట్రంలోనే కళాసేవ చేయాలన్న ఆకాంక్షతో రాజమండ్రికి తిరిగివచ్చాడు,

1922 లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన 'ఋష్యశృంగ బంధనం' చిత్రానికి ప్రథమ బహుమతిగా 'వైస్రాయి ఆఫ్ ఇండియా' పతకం వచ్చింది. అంతేకాకుండా అప్పటి వైస్రాయి లార్డ్ రీడింగ్ రామారావును స్వయంగా పరిచయం చేసుకొని ఆయన వేసిన చిత్రాల్లో ఒకదాన్ని కొన్నాడు. రామారావు చిత్రించిన గొల్లపడుచు, గోదావరి లోయ, పుష్పాలంకారం, ద్రోణుడు, 'సిద్ధార్థుని రాగోదయం', 'బావి దగ్గర', భరతవంశపు రాకుమారులు, కైకేయీ దురాలోచన, నంది పూజ, పేరంటము, గొల్లపడుచులు, కార్తీక పౌర్ణమి వంటి రామారావు చిత్రాలు దేశ, విదేశాలలో ఎన్నో ప్రశంసలు పొందాయి.

ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. వారు ఆతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరించారు. కలకత్తా , బొంబాయి వంటి మహానగరాల్లో జరిగిన బ్రిటీషు ఎంపైర్ ప్రదర్శనశాలలో దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను ఒక సంవత్సరం పాటు అక్కడి గ్యాలరీలో ఆయన బొమ్మలుంచారంటే అతని చిత్రకళా ప్రతిభకు తార్కాణం.

దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ1923లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణను ఈయన ఇచ్చాడు. 1925లో 28 ఏళ్ళకే ఆయన అకాల మరణం చెందాడు. 1929 లో రాజమండ్రి వంకాయల వారి వీధిలో నున్న దామెర్ల వారింట్లో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని గాంధిజీ ప్రారంభించారు. రామారావు గీసిన 34 తైలవర్ణ చిత్రాలు, 129 నీటి రంగుల చిత్రాలు, 250 పెన్సిల్‌ స్కెచ్‌లు ఇంకా 28 స్కెచ్‌ బుక్ లు రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీ లో భద్రపరచారు. ఆయన పేర ఒక చిత్రకళామందిరం వెలసింది. అందులో ఆయన వేసిన చిత్రాలు ఉన్నాయి. 

Post a Comment

0 Comments