GET MORE DETAILS

మాఘ పురాణం : 8వ అధ్యాయము - దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట

మాఘ పురాణం : 8వ అధ్యాయము - దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట



శక్తిమత్తు గర్వంతో ఉన్న రాజు కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోపదేశాన్ని వివరిస్తుంది. వినయం, సహనం, దయల ప్రాముఖ్యతను, ఈ లోకము భ్రమేనని, నిజమైన ఆనందం భగవంతుడిలోనే ఉందని దత్తాత్రేయుడు  బోధిస్తాడు. కార్తవీర్యార్జునుడు వాటిని అనుసరించి గొప్ప గురువుగా మారతాడు. ఈ కథ గర్వం మనకు ఎటువంటి మేలు చేయదని, వినయంతో ఇతరుల నుండి నేర్చుకుంటేనే జ్ఞానం, ఆనందం లభిస్తాయని చెబుతుంది. 

దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశము ఇచ్చుట

దత్తాత్రేయుడు బ్రహ్మా,విష్ణు,మహేశ్వరుల యొక్క అంశమున జన్మించాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. 

దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి  “గురువర్యా! మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటినీ, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును విని ఉండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించ వలసినదిగా కోరుచున్నాను” అని దత్తాత్రేయుని కోరెను.

దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.

“భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్య నదులకు సమమైన నదులు ప్రపంచమునందు ఎచ్చటా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు,అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును,కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. 

అందునా మాఘమాస మందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడ కలుగును.  గనుక, ఏ మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘ స్నానము చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు” అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి తెలుపుచుచూ ఇంకనూ యీవిధముగా చెప్పుచున్నాడు..

“పూర్వ కాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు,వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు, నాణేములు రాసుల కొలది ఉన్నవాడు. కొంత కాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టము వచ్చినటుల పాడు చేయుచుండిరి. 

ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ చేరదీసి, కుల భ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించు చుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమ దూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్ద వానిని నరకంలో* పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో రెండోవాడు యిలా అన్నాడు.

“అయ్యా! మేము ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును” అని అడిగెను.

ఆ మాటలకు చిత్రగుప్తుడు “ఓయీ వైశ్య పుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతి దినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు.  అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహా పాపములు కూడ నశించును.

కాన విప్రుని చూచుట వలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను” అని చిత్రగుప్తుడు వివరించెను.

“ఆహా! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను".

మృగ శృంగుని కథ!

గత అధ్యాయములో తెలిపిన విధంగా మరణించిన ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికించుటకు గాను మృగశృంగుడు యముడు కోసం తప్పస్సు చేసిన విధానం యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కొనినటుల లేచి, వారు యమలోకము నందు చూసిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోక మందలి జీవులు తమ పాప పుణ్యములను బట్టి శిక్షలను అనుభవించు చున్నారు. 

ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి.  ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప జేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విష కీటకములున్న నూతిలో త్రోసి వేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.

అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసము నందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జప తపములు యిత్యాది పుణ్య కార్యములు చేయుట వలన అంతకు ముందు చేసియున్న పాపములు అన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్దమయినది.

మాఘమాసమందు నదీస్నానము ఆచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసము అంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి. 


Post a Comment

0 Comments